Illegal transportation of sand from NTR district to Hyderabad: ఇక్కడ కనిపిస్తున్న లారీలు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు సమీపంలో హైదరాబాద్ జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం కనిపించాయి. ఒక్కో లారీ సామర్థ్యం 25 టన్నులే. అయినప్పటికీ ఒక్కోదానిలో 45టన్నుల వరకు ఇసుక ఉంటోంది. కంచికచర్ల మండలం గనిఆత్కూరు సమీపంలోని కృష్ణా నది రేవులో లోడ్ చేశారు. ఇవి నేరుగా హైదరాబాద్కు వెళ్తాయి. ఇలా రోజు వంద వరకు లారీలు వెళుతున్నాయి. ఏపీ లోని సరిహద్దు రవాణా కేంద్రం గరికపాడు, తెలంగాణలోని కోదాడ ప్రాంతంలో ఉన్న మరో రవాణా కేంద్రం వద్ద ఎలాంటి తని బీలు ఉండటం లేదు.
ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్కు ఇసుక రవాణా అక్రమ జోరుగా సాగుతోంది. ఇసుక కాంట్రాక్టు తీసుకున్న ఓ వైసీపీ ఎమ్మెల్యే రోజుకు 10 లారీలు, ఆయన బంధువు.. పీఏగా వ్యవహరించే వ్యక్తి 10 లారీలు.. ప్రభుత్వంలో కీలక సలహాలనిచ్చే వ్యక్తి కుమారుడు 10 లారీల చొప్పున పంచుకుంటూ రవాణా చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి ఒకరు, ఆయన అనుచరగణం 10 లారీలు, ఎగువసభకు ఎంపికైన ఓ నేత, ఓ యువ నాయకుడు ఇలా తలా కొన్ని లారీలను హైదరాబాద్కు తరలించేస్తున్నారు.
ప్రభుత్వ కీలక సలహాదారు కుమారుడు భాగస్వామిగా ఉండటంతో యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. తెలంగాణకు చెందిన ముఖ్య ప్రజాప్రతినిధులిద్దరికీ భాగస్వామ్యం ఉండటంతో రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఇటీవల ఒక ప్రజా ప్రతినిధికి చెందిన 5 లారీలు ఇసుక ఓవర్ లోడ్తో హైదరాబాద్ వెళుతుండగా, గరికపాడు తనిఖీ కేంద్రం వద్ద ఆర్టీఏ అధికారి చలానా వేశారు. ఆ ప్రజాప్రతినిధి చలానా సొమ్ము చెల్లించి, ఆ వెనుకే వచ్చిన ఇతర ప్రజాప్రతినిధుల లారీలకు ఎందుకు చలానా వేయలేదంటూ ఆర్టీఏ అధికారిని కొట్టినంత పనిచేశారు.