ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Crime in AP: ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య.. ఇంట్లో బాంబు పేల్చిన దుండగులు..

By

Published : Jun 26, 2023, 12:00 PM IST

Several crimes in the state: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో దారుణమైన ఘటనలు చోటుచేసుకున్నాయి.. కర్నూలు జిల్లాలోని విశ్వభారతి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే విధందా చిత్తూరు జిల్లా.. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో బాంబు పేలిన ఘటనలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు.

Crime in AP
ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య.. మరో చోట ఇంట్లో బాంబు పెల్చిన దుండగులు

Several crimes in the state: కర్నూలు సమీపంలోని పెంచికలపాడు వద్దనున్న విశ్వభారతి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థి లోకేష్ ఫ్యాన్​కి ఉరివేసుకొని ఆత్మహత్యచేసుకున్నాడు.నెల్లూరు జిల్లా కావలికి చెందిన లోకేష్ ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ఆత్మహత్యకు కారణాలేంటో తెలియాల్సి ఉంది. నాగులాపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి తండ్రి బ్రహ్మానందరావుకి సమాచారం ఇచ్చి.. మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు.

అనంతపురం జిల్లా.. కళ్యాణదుర్గం మండలం పాత చెరువు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని బైక్​పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామానికి చెందిన నరసింహ అనే వ్యక్తి బైక్​పై తన వ్యక్తిగత పని నిమిత్తం అనంతపురం వైపు వెళ్తుండగా ఎదురు ఎదురుగా వచ్చిన వాహనం కళ్యాణదుర్గం ప్రధాన రహదారిలోని పాత చెరువు సమీపంలో ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలైన నరసింహ అక్కడికక్కడే మృతి చెందాడు.. కళ్యాణదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

చిత్తూరు జిల్లా.. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఈ రోజు తెల్లవారు జామున బాంబు పేలిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కొత్త పేట గంగమ్మ ఆలయం సమీపంలో.. ఓ ఇంటి తలుపు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బాంబును పేల్చడం వల్ల ఇంట్లో నిద్రిస్తున్న మురుగేష్ అతని భార్య ధనలక్ష్మి దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. భారీ శబ్దంతో బాంబు పేలడంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు.. బాంబును ఎవరు ఎందుకు పేల్చారు అనే విషయం పై పోలీసులు విచారణ చేపడుతున్నారు.

ప్రకాశం జిల్లా.. గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామంలోని అరుగుపై నిద్రిస్తున్న అనంత సంజీవయ్య (54)అనే వృద్ధుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కర్రలు, రాళ్లతో అతి దారుణంగా దాడి చేయడంతో మృతి చెందాడు. మొదట తీవ్రంగా గాయపడ్డ అనంత సంజీవయ్యను గుర్తించిన స్థానికులు గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అనంత సంజీవయ్య మృతి చెందినట్లుగా వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జరిగిన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా.. పాడేరు ఘాట్ రోడ్ అమ్మవారి పాదాలు సమీపంలో ఆయిల్ ట్యాంకర్​ను కారు ఢీ కొట్టిన ప్రమాదంలోగంజాయి భారీగా బయటపడింది. కారులో అక్రమంగా తరలిస్తున్న400 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన కారు మహారాష్ట్ర రాష్ట్రానికి చెందినదిగా గుర్తించారు. కారు వదిలి పరారైనన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

శ్రీ సత్య సాయి జిల్లా.. కదిరి పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని బార్ అండ్ రెస్టారెంట్​లో అర్ధరాత్రి దాటిన తర్వాత విద్యుదాఘాతంతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బార్​లో భారీగా పొగలు రావడంతో స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అగ్ని మాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో మద్యం, నగదు కాలిపోయినట్లు బార్ యజమానులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదం వల్ల భవనం దెబ్బతిని ఉండొచ్చు అన్న.. అగ్నిమాపక శాఖ అధికారుల సూచనతో పోలీసులు లోనికి ఎవ్వరిని అనుమతించలేదు.

ABOUT THE AUTHOR

...view details