ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆ దారుల్లో ప్రయాణిస్తే.. ఒళ్లు గుల్ల కావడం ఖాయం!

By

Published : May 9, 2022, 5:22 PM IST

Roads In Kurnool

Roads In Kurnool: పల్లె దారులు ఛిద్రమయ్యాయి. కొన్ని రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే.. అడుగు తీసి అడుగు వేయడమే కష్టం అన్నట్లుగా ఉంది! అలాంటి మార్గాల్లో బైకులు, కార్లు తిరిగితే ఇబ్బందులు తప్పవు. ఒకవేళ సాహసించి వాహనాల్లో వెళ్లారంటే.. ఒళ్లు గుల్ల కావడం ఖాయం. ఇదీ కర్నూలు జిల్లాలోని రోడ్ల పరిస్థితి..

Roads In Kurnool: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ పరిధిలోని మొలగవల్లి - మద్దికెర మార్గం.. రోడ్ల దుస్థితికి అచ్చమైన ఉదాహరణగా నిలుస్తోంది. 14 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్డుని ఒక్కసారిగా చూశామంటే.. ఈ దారిలో ప్రయాణం చేయలేం బాబోయ్ అనాల్సిందే. మొలగవల్లిలో మొదలైతే.. మద్దికెరలో ముగిసేదాకా.. అణువణువూ కంకర తేలి అత్యంత దారుణంగా ఉంటుందీ రోడ్డు. చాలాచోట్ల రోడ్డు కోతకు గురై.. నరకానికి నకలుగా మారింది. అందుకే గర్భిణులు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు తమ ప్రయాణానికి ఈ మార్గాన్ని అస్సలు ఎంచుకోరు. మిగిలిన వారు కూడా రోడ్డుపైన కాకుండా.. పక్కనున్న పొలాల మీదుగా రాకపోకలు సాగిస్తుంటారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

కర్నూలు జిల్లాలో అధ్వానంగా రోడ్ల దుస్థితి

రోజువారీ పనులు, వైద్యం, ఇతర అవసరాల కోసం మొలగవల్లి నుంచి గుంతకల్లుకు వెళ్లే వారికి.. మద్దికెర వరకు ఉన్న రోడ్డు చుక్కలు చూపిస్తోంది. అందువల్ల ఈ మార్గం అంటేనే భయపడుతున్న కొందరు.. దాదాపు 24 కిలోమీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించేందుకూ సిద్ధమవుతున్నారు. మద్దికెర వెళ్లకుండా ఆలూరు, నగరడోన, రామదుర్గం, చిప్పగిరి మీదుగా గుంతకల్లు చేరుకుంటున్నారు.

మొలగవల్లి - మద్దికెర రోడ్డును "ఈటీవీ- ఈనాడు" బృందం పరిశీలించింది. 14 కిలోమీటర్ల ఈ రోడ్డుపై 759 గుంతలు దర్శనమిచ్చాయంటే.. పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చెప్పనవసరం లేదు. కేటీఆర్​ లాంటి నేతలు ఎగతాళి చేయడానికి ఇలాంటి ఘోరమైన రోడ్లే కారణమని.. ఆ పరిస్థితి మారాలంటే... వీలైనంత త్వరగా పునర్ నిర్మాణం చేయాలని ప్రజలు కోరుతున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్వగ్రామం మొలగవల్లి. ఆయన చొరవతో 2 కోట్ల రూపాయలతో ఈ మార్గంలో వంతెనలు నిర్మించినా.. రోడ్డును మాత్రం పాలకులు గాలికొదిలేశారు. ఇప్పటికైనా తగిన విధంగా స్పందించి... అత్యవసరంగా మరమ్మతులు చేయాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details