కర్నూలు జిల్లా అవుకు ఎంపీడీఓ కార్యాలయంలో.. అనిశా అధికారులు దాడులు చేశారు. లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి పట్టుబడినట్లు అనిశా డీఎస్పీ శివ నారాయణస్వామి తెలిపారు. ఇంటి నిర్మాణం కోసం వెంకటేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి నుంచి అవుకు మండలం సుంకేసుల పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ 10 వేల రూపాయలు లంచం తీసుకున్నట్లు వివరించారు.
భవన నిర్మాణం అనుమతి కోసం 20 వేల రూపాయలు లంచం డిమాండ్ చెయ్యగా.. 10 వేల రూపాయలకు బేరం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. పంచాయతీ కార్యదర్శికి లంచం ఇస్తుండగా.. అధికారులు పట్టుకున్నారన్నారు. పూర్తి వివరాలు సేకరించి అధికారిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.