ఆంధ్రప్రదేశ్

andhra pradesh

యూటీఎఫ్​ 'సంకల్ప దీక్ష' భగ్నం.. ఉపాధ్యాయుల ఆందోళన

By

Published : Feb 3, 2023, 5:06 PM IST

Krishna district UTF 'Sankalpa Deeksha' UPDATES: సీపీఎస్‌ను​ వెంటనే రద్దు చేసి దాని స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యూటీఎఫ్) నాయకులు కృష్ణా జిల్లా గన్నవరంలో చేపట్టిన 'సంకల్ప దీక్ష'ను పోలీసులు అడ్డుకున్నారు. దీక్షకు ఎవ్వరూ వెళ్లకుండా ఉద్యోగులను, ఉపాధ్యాయులను, యూటీఎఫ్ నాయకులను పోలీసులు అడుగడుగునా గృహ నిర్బంధాలు చేయడం ప్రారంభించారు.

utf
utf

Krishna district UTF 'Sankalpa Deeksha' UPDATES: రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్‌ను​ వెంటనే రద్దు చేసి.. దాని స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యూటీఎఫ్) ఈ నెల 3, 4, 5 తేదీల్లో కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్న అవుటపల్లిలో 'సంకల్ప దీక్ష'ను చేపట్టారు.

ఈ క్రమంలో యూటీఎఫ్‌ నాయకులకు గురువారం రాత్రే పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీక్షకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా దీక్షకు వెళ్తే.. చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అయినా కూడా సీపీఎస్‌‌ను తక్షణమే రద్దు చేయాలన్న డిమాండుతో యూటీఎఫ్ నాయకులు సంకల్ప దీక్షను ప్రారంభించారు. దీంతో దీక్షకు బయలుదేరినా ఉద్యోగ, ఉపాధ్యాయులను ఆయా జిల్లాల పోలీసులు గృహ నిర్బంధాలు చేయడం ప్రారంభించారు.

దీక్షకు బయల్దేరిన సంఘం నాయకులలో.. తాహెర్‌వలి, శ్రీనివాసులు, ఆనంద్‌, ఆజంబాషా, డి.శ్రీనివాసులు, ఖాజాపీర్‌, ఖాజా, వెంకటరమణనాయక్‌, సుబ్బారెడ్డిలకు ఎస్సై ఇసాక్‌ నోటీసులు అందజేశారు. దీక్షకు బయలుదేరినా వెంటనే వారిని గృహ నిర్బందం చేశారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని పలు హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా దీక్షకు వెళ్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సంఘం జిల్లా కార్యదర్శి తాహెర్‌వలి మాట్లాడుతూ.. నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరన్నారు. ముఖ్యమంత్రి ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటే ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు.

మరోపక్క చెన్నై-కోల్​కతా జాతీయ రహదారిపై పోలీసులు భారీగా మోహరించారు. గన్నవరం మండలం చిన్న అవుటపల్లిలోని ధర్మస్థలి ఆవరణలో సీపీఎస్​ రద్దు చేయాలని యూటీఎఫ్ నాయకులు తలపెట్టిన సంకల్ప దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. సుమారు 250 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు గన్నవరం, వీరవల్లి పరిధిలో 8మంది, ఆత్కూరు పరిధిలో 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేనందున ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేశారు. దీంతో ఎమ్మెల్సీలు, యూటీఎఫ్ నేతలు విజయవాడలోని యూటీఎఫ్ ప్రధాన కార్యాలయంలో దీక్ష చేపట్టారు. ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దు చేసేంతవరకు పోరాటం కొనసాగిస్తామన్నారు.

యూటీఎఫ్ సంకల్ప దీక్షకు వెళుతున్న 60 మంది ఉపాధ్యాయులను అరెస్టు చేసి కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చేపట్టిన దీక్ష కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గన్నవరం వద్ద తలపెట్టిన ఈ దీక్షను పోలీసులు అడ్డుకొని కంకిపాడు స్టేషన్‌కు తరలించడంతో వారంతా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం సీపీఎస్ విధానంపై సానుకూలంగా స్పందించకపోతే.. తాము మరింత తీవ్రంగా పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. యుటీఎఫ్ నాయకులకు సీఐటీయు సంఘీభావం తెలుపుతూ.. వారికి మద్దతుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details