ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మళ్లీ అదే సీన్​..పలు చోట్ల నామినేషన్లు వేయకుండా అడ్డంకులు

By

Published : Nov 4, 2021, 7:10 AM IST

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియలో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నామపత్రాల దాఖలుకు సిద్ధమైన అభ్యర్థులను కొందరు అడ్డుకున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. బుధవారం గుంటూరు జిల్లా గురజాల, మాచర్లలో తెదేపా, భాజపా అభ్యర్థులకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది.

చించివేసిన నామినేషన్ పత్రాలు
చించివేసిన నామినేషన్ పత్రాలు

గుంటూరు జిల్లాగురజాల నగర పంచాయతీ పరిధిలోని ఎనిమిదో వార్డుకు తెదేపా అభ్యర్థినిగా పోటీ చేసేందుకు సుందరగిరి నజీమున్‌ బుధవారం అన్ని పత్రాలు సిద్ధం చేసుకొని, ఫొటో దిగేందుకని నగర పంచాయతీ కార్యాలయం పక్కనే ఉన్న స్టూడియోలోకి బయలుదేరారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి వచ్చి ఆమె చేతిలోని పత్రాలు లాక్కొని, చించేసి పరారయ్యాడు. ఈ విషయంపై గురజాల పోలీసుస్టేషన్‌కు వెళ్లి సీఐ సురేంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. నజీమున్‌ మాట్లాడుతూ ‘ఒక వ్యక్తి వచ్చి పత్రాలు గుంజుకున్నా అక్కడున్న పోలీసులెవరూ స్పందించలేదు’ అని ఆరోపించారు. నామినేషన్‌కు బందోబస్తు ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించిందని గుర్తు చేశారు. దీనిపై సీఐ మాట్లాడుతూ.. హైకోర్టు నుంచి తమకు ఉత్తర్వులందాయని నామినేషన్‌ వేసే ముందు చెబితే భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

మాచర్ల పురపాలక పరిధిలో 8వ వార్డును ఏకగ్రీవం చేయాలని వైకాపా భావిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు పురపాలక కార్యాలయం వద్ద మకాం వేసి నామినేషన్‌ వేసేందుకు వచ్చే వారి మద్దతు కోరుతున్నారు. బుధవారం భాజపా నాయకులు నామినేషన్‌ పత్రాలు తీసుకొనేందుకు రాగా ఏకగ్రీవానికి మద్దతు ఇవ్వాలని వైకాపా నాయకులు కోరారు. ఈ క్రమంలో రెండు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకొని, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరికి వైకాపా నాయకులు తమను అడ్డుకున్నారని భాజపా నేతలు, భాజపా వారే కులం పేరుతో తమను దూషించారని వైకాపా నాయకులు పరస్పరం సీఐకి ఫిర్యాదు చేసుకున్నారు.

ఇదీ చదవండి:

ప్రముఖ ఆలయాల్లో తితిదే విధానాల అమలు!

ABOUT THE AUTHOR

...view details