ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Public Data Collection: గాలిలో దీపంలా ప్రజల డేటా.. ప్రమాదంలో వ్యక్తిగత గోప్యత

By

Published : Jul 31, 2023, 7:33 AM IST

Updated : Jul 31, 2023, 9:56 AM IST

Jagan comments on personal information collection: తెలుగుదేశం ప్రభుత్వం డేటాచౌర్యానికి పాల్పడుతోందంటూ ప్రతిపక్షనేతగా నానాయాగి చేసిన జగన్‌.. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వ్యవస్థీకృతం చేశారు. సంక్షేమ పథకాల మాటున వాలంటీర్లతో సున్నితమైన ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం సేకరిస్తున్నారు. దీన్ని వివిధ మార్గాల్లో ఐప్యాక్‌కు పంపి, విశ్లేషించిన అనంతరం వైసీపీ క్షేత్రస్థాయి నేతలకు చేరవేస్తున్నారని విపక్షాలు ఆధారాలతో సహా బయటపెడుతున్నాయి. ఈ డేటా ఆధారంగానే ఓట్ల తొలగింపు, చేర్చడం జరుగుతోందని ఆరోపిస్తున్నాయి. మహిళల ఫోన్‌ నెంబర్లు సహా.. ప్రజల ఆధార్‌, బ్యాంకు ఖాతాల వివరాలు అసాంఘిక శక్తుల చేతికి చేరితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నా.. ప్రభుత్వంలో ఉలుకు, పలుకు లేదు.

Public Data Collection
గాలిలో దీపంలా మారిన వ్యక్తిగత గోప్యత.. ప్రమాదంలో వ్యక్తి స్వేచ్ఛ

గాలిలో దీపంలా ప్రజల డేటా.. ప్రమాదంలో వ్యక్తిగత గోప్యత

Jagan comments on personal information collection: ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌ చిలక పలుకులు పలికారు. ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారంటూ ఉన్నవీ లేనివీ కల్పించి మరీ నానాయాగీ చేసిన జగన్‌మోహన్‌రెడ్డి.. ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సంబంధించిన సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. పౌరుల వ్యక్తిగత డేటా సేకరణనేరమంటూ ప్రతిపక్ష నేతగా గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన జగన్.. ఇప్పుడు సంక్షేమ పథకాల అమలు ముసుగులో వాలంటీర్ల ద్వారా పౌరుల వ్యక్తిగత సమాచార సేకరణను వ్యవస్థీకృతం చేశారు. ఇదేదో రాజ్యాంగం కల్పించిన చట్టబద్ధ హక్కు అన్నట్లుగా రాష్ట్ర ప్రజల సమాచారం సమస్తం సేకరిస్తున్నారు.

ప్రజల ఆధార్‌, బ్యాంకు ఖాతా, ఓటరు ఐడీ, పాన్‌, పౌరుల రాజకీయ ఆసక్తులు, ప్రతి ఇంట్లోని మహిళల ఫోన్‌ నంబర్లు, పౌరుల వేలిముద్రల నుంచి.. వివాహేతర సంబంధాలున్నాయా? ఎవరెవరితో గొడవలు ఉన్నాయి? తదితర సమగ్ర వివరాలు తీసుకుంటున్నారు. ఈ సమగ్ర సమాచారాన్ని ఫీల్డ్‌ ఆపరేటింగ్‌ ఏజెన్సీ పేరిట ప్రైవేటు వ్యక్తులు, సంస్థల చేతికందిస్తోందని ప్రతిపక్షాలు ఆధారాలతో సహా చెబుతున్నాయి. ఈ సున్నిత సమాచారం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళితే దుర్వినియోగమవుతుందంటూ నీతివాక్యాలు చెప్పిన జగన్‌.. ఇప్పుడేం సమాధానం చెబుతారని విపక్షాలు నిలదీస్తున్నాయి. ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి ఆయనకు అర్హత ఉందా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

పౌరుల వ్యక్తిగత వివరాలు సేకరించే అధికారం వాలంటీర్లకు ఎక్కడిదని.. ఎవరి ప్రయోజనాల కోసం ఈ వివరాలు సేకరిస్తున్నారని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. వ్యక్తిగత వివరాలు ఎందుకు సేకరిస్తున్నారని.. ఆ సమాచారంతో వాలంటీర్లకు, ప్రభుత్వానికి ఏం పనిని అడుగుతున్నారు. పౌరుల రాజకీయ ఆసక్తులను ప్రభుత్వం ఎందుకు తెలుసుకుంటోందని.. ఎవరు ఏ పార్టీ మద్దతుదారైతే ప్రభుత్వానికి ఎందుకని నిలదీస్తున్నారు. ఈ డేటా ఆధారంగా తమ పార్టీని వ్యతిరేకించే వారి ఓట్లు తొలగించడానికే వివరాలు సేకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పౌరుల ఆధార్‌, బ్యాంకు ఖాతా నంబర్లు దుర్వినియోగమైతే ఎవరు బాధ్యత వహిస్తారని.. వాటి ఆధారంగా వారి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును కొల్లగొడితే ఎవరి తెచ్చి ఇస్తారని మండిపడుతున్నారు. మహిళల ఫోన్‌ నంబర్లు సేకరించడం వల్ల వారి భద్రతకు ముప్పు వాటిల్లదా అని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

వాలంటీర్ల నిర్వహణ, శిక్షణ కోసం ఫీల్డ్‌ ఆపరేటింగ్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న రామ్‌ ఇన్ఫో, ఉపాధి టెక్నో సర్వీసెస్‌, మ్యాక్స్‌ డిటెక్టివ్‌ అండ్‌ గార్డియన్‌ సర్వీసెస్‌ల కన్సార్షియానికి ఈ సమాచారం వెళ్తోందని, అక్కడి నుంచి వైసీపీకు రాజకీయ కన్సల్టెన్సీగా వ్యవహరిస్తున్న ఐప్యాక్‌కు, అక్కడి నుంచి జగన్‌కు చేరుతోందని ప్రతిపక్షాలు ఆధారాలతో సహా నిరూపిస్తున్నాయి. ఈ సమాచారాన్ని విశ్లేషించి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ లబ్ధి పొందేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారని వివరిస్తున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలతో పాటు విజయవాడలోని గుణదల, తిరుపతిల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కార్యాలయాల్లో పౌరుల వ్యక్తిగత సమాచార విశ్లేషణ జరుగుతోందన్న ఫిర్యాదులున్నాయి. అసలు ఆ కార్యాలయాలు ఎవరు నిర్వహిస్తున్నారు? అక్కడ రాష్ట్ర పౌరుల వ్యక్తిగత ఎందుకు ఉందంటే ప్రభుత్వం నుంచి గానీ.. వైసీపీ నుంచి గానీ ఎలాంటి సమాధానం లేదు.

పౌరుల వ్యక్తిగత డేటా ఎవరి చేతుల్లోకి వెళ్తోందో తెలియడం లేదు. దీని నిర్వహణ బాధ్యతలు ఎవరు చూస్తున్నారో కూడా తెలియదు. రాష్ట్రంలోని ప్రతి ఇల్లు, ప్రతి పౌరుడి సమగ్ర వివరాలు సేకరిస్తున్న వైసీపీ ప్రభుత్వం వాటిని 360 డిగ్రీల కోణంలో ఎందుకు ప్రొఫైలింగ్‌ చేయిస్తోందో అర్థంకావడం లేదు. ఈ ప్రశ్నలకు జగన్‌ ప్రభుత్వం మాత్రం సమాధానలివ్వడం లేదు. వీటిపై సమగ్ర వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయడం లేదు. అత్యంత సున్నితమైన పౌరుల వ్యక్తిగత సమాచారం సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కితే పరిస్థితి ఏంటని ప్రజలు భయపడుతున్నారు.

ప్రజల నుంచి వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం రకరకాల మార్గాలు, పేర్లతో, వేర్వేరు సంస్థల ముసుగులో ఐ ప్యాక్‌కు చేరుతోందని.. ఈ సమాచారాన్ని మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయుల్లో విశ్లేషించి ఎవరు ఏ పార్టీ మద్దతుదారులో తెలుసుకుని ప్రతిపక్షాల మద్దతుదారుల ఓట్లు తొలగిస్తున్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. కుదరకపోతే దూరంగా ఉన్న పోలింగ్‌ కేంద్రాల పరిధిలోకి వారిని మార్చేస్తున్నారన్నారు. వైసీపీకు అనుకూలంగా భారీగా దొంగ ఓట్లు సృష్టిస్తున్నారని ఆధారాలతో సహా బయటపెడుతున్నారు. వైసీపీకు అనుకూలంగా ఒకే డోర్‌ నంబరులో వందలసంఖ్యలో ఓట్లు నమోదు చేయటం, సున్నా డోర్‌ నంబరుతో లక్షలసంఖ్యలో ఓట్లు ఉంచటం.. అన్నింటినీ విపక్ష నాయకులు బయటపెట్టారు. వీటిపై ప్రభుత్వం మాత్రం నోరు విప్పడం లేదు. ప్రజల వద్దనుంచి సేకరించిన సమాచారమేదీ దుర్వినియోగం కావట్లేదని ప్రభుత్వం భరోసా కల్పించట్లేదు.

అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత డేటా సేకరిస్తోందంటూ గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం జగన్‌ మాట్లాడిన మాటలివి. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌ చేస్తున్న పనేంటో ఆయనకే తెలియాలి.. ప్రభుత్వం ప్రజల నుంచి వివరాలు సేకరిస్తే.. దేనికోసం తీసుకుంటున్నారు, ఆ వివరాలు ఎక్కడ, ఎంత భద్రంగా ఉంచుతున్నారో ప్రజలకు తెలియపరచాలి. ప్రజల అనుమతితోనే ఈ వివరాలు తీసుకోవాలి. సమాచారం అడిగితే నిరాకరించే హక్కు కూడా ప్రజలకు ఉంది. కానీ జగన్ ప్రభుత్వం బలవంతంగా వాలంటీర్ల ద్వారా సమాచారం సేకరిస్తోంది.

సామాజిక మాధ్యమాల్లో మార్పింగ్ ఫొటోల ద్వారా మహిళల ఫోన్‌ నెంబర్లు పెట్టి నేరాలకు పాల్పడటం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి మహిళా ఫోన్‌నెంబర్‌ వాలంటీర్లు సేకరిస్తున్నారు.. అవి అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళితే వారి భద్రతకే ప్రమాదం. ఆస్తుల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ల సందర్భంగా ఇచ్చిన వేలిముద్రల ఆధారంగా ప్రజలకు తెలియకుండానే వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్న ఉదంతాలు ఇటీవల కాలంలో అనేకం జరిగాయి. అలాంటిది రాష్ట్రప్రభుత్వం వాలంటీర్ల ద్వారా పౌరుల ఆధార్‌, బ్యాంకు ఖాతా నంబరు, ఫోన్‌ నంబర్ల లాంటి వివరాలన్నీ తీసుకుంటోంది. వీటి ఆధారంగా ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి సొమ్ములు కొల్లగొడితే బాధ్యత ఎవరు వహిస్తారు.

సుప్రీంకోర్టు వ్యాఖ్యలు..వ్యక్తిగత గోప్యత గాలిలో దీపమైతే.. వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కు పెను ప్రమాదంలో పడతాయి. వ్యక్తిగత గోప్యత పౌరుల ప్రాథమిక హక్కని శాంతాసిన్హా కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

హైకోర్టు వ్యాఖ్యలు..ప్రజల సమాచారాన్ని ప్రభుత్వ యాప్‌లలో పొందుపరిచే అధికారం వాలంటీర్లకు ఎవరిచ్చారని ఈ ఏడాది ఫిబ్రవరి 28న జగన్‌ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆధార్‌ తదితర వివరాలు యాప్‌లలో పొందుపరిస్తే లబ్ధిదారుల వ్యక్తిగత గోప్యత పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేసింది. వాలంటీర్ల ద్వారా సేకరించే పౌరుల వ్యక్తిగత సమాచారానికి ఎలా భద్రత కల్పిస్తున్నారని.. సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారుల వివరాల సేకరణ, అర్హతలను నిర్ణయించే బాధ్యతలను వాలంటీర్లకు అప్పగించటం ఏంటని ఘాటుగా వ్యాఖ్యానించింది.

ప్రభుత్వ అధికారులు ఉండగా.. వాలంటీర్లకు ఆ బాధ్యత ఎలా అప్పగిస్తారని హైకోర్టు నిలదీసింది. గత ప్రభుత్వాలు కూడా పథకాలు అమలు చేశాయి కదా.. అప్పట్లో ప్రభుత్వాధికారులే లబ్ధిదారులను ఎంపిక చేయలేదా అని ప్రశ్నించింది. అధికారులపై విశ్వాసం లేదా అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. హైకోర్టు ప్రశ్నించినా జగన్‌ ప్రభుత్వం సమాచార సేకరణను ఆపలేదు సరికదా.. పౌరుల వ్యక్తిగత వివరాలు మరిన్ని సేకరిస్తోందంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనుకోవాలి..?

Last Updated : Jul 31, 2023, 9:56 AM IST

ABOUT THE AUTHOR

...view details