Flaws in Smart Meters Project for Agricultural Motors: వ్యవసాయ మోటర్లకు స్మార్ట్మీటర్ల ప్రాజెక్టులోని లోపాల్ని ప్రయాస్ ఎనర్జీ గ్రూప్ అనే స్వచ్ఛంద సంస్థ అడుగడుగునా ఎత్తిచూపినా ప్రభుత్వానికి చెవికెక్కలేదు.వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తూ రాష్ట్రంలోని 18.50 లక్షలకుపైగా వ్యవసాయ పంప్సెట్లకు స్మార్ట్మీటర్లను అమర్చాలని, వాటి సరఫరా, నిర్వహణ కాంట్రాక్ట్ను అస్మదీయుల కంపెనీలకు అప్పగించాలని చూస్తోంది. పైగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు శ్రీకాకుళం పైలట్ ప్రాజెక్టును ఉదాహరణగా చూపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో 28 వేల వ్యవసాయ పంప్సెట్లకు ఇన్ఫ్రారెడ్ మీటర్లు అమర్చడం వల్ల 36 శాతం విద్యుత్ ఆదా అయినట్టు చెబుతోంది. కానీ అంత భారీ ఖర్చుతో మోటార్లకు మీటర్లు అమర్చడం ఎంత పనికిమాలిన, తెలివితక్కువ వ్యవహారమో, ప్రభుత్వ వాదన ఎంత అసంబద్ధమో.. పీఈజీ నివేదిక స్పష్టం చేసింది.
విద్యుత్ వినియోగం, సబ్సిడీల భారం తగ్గాలనుకుంటే.. వ్యవసాయంలో నీరు, విద్యుత్ వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవాలే తప్ప.. మోటార్లకు మీటర్లు పెడితే ఒరిగేదేమీ ఉండదని చురకలు వేసింది.రాష్ట్రంలోని 18.50 లక్షలకుపైగా వ్యవసాయ పంప్సెట్లకు 6 వేల500 కోట్ల భారీ పెట్టుబడితో స్మార్ట్మీటర్లు అమర్చాలన్న ఆలోచన సబబుగా లేదని పీఈజీ నివేదిక పేర్కొంది. ప్రస్తుత వ్యవసాయ విద్యుత్ డిమాండ్లో 25 శాతం చొప్పున ఐదేళ్ల కాలం ఆదా చేయగలిగితేనే.. స్మార్ట్మీటర్లపై చేసిన వ్యయాన్ని తిరిగి రాబట్టుకున్నట్టవుతుందని తెలిపింది. కానీ అది అంత తేలిక కాదంది.
తేల్చిచెప్పిన పీఈజీ: శ్రీకాకుళం ప్రాజెక్టుపై రాష్ట్ర ఆర్థికశాఖ పరిధిలోని ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ సంస్థ పీఈజీతో ఈ అధ్యయనం చేయించింది. శ్రీకాకుళంలో విస్తృతంగా అధ్యయనం చేసిన పీఈజీ సంస్థ నివేదిక ఆధారంగానే.. స్మార్ట్మీటర్లపై డిస్కంల వైఖరిని, టెండర్ల ప్రక్రియలోని లోపాలను ఎండగడుతూ, తీవ్రంగా పరిగణిస్తూ ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గత సంవత్సరం సెప్టెంబరు, అక్టోబరుల్లో లేఖలు రాశారు. దాంతో గుత్తేదారులకు భారీగా ధరలు చెల్లించేలా అప్పటికే పిలిచిన టెండర్లను డిస్కంలు రద్దు చేసి.. మరోసారి టెండర్లకు వెళ్లాయి. ప్రభుత్వం ఇప్పటివరకూ ఈ నివేదికను రహస్యంగా ఉంచింది.
శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్టు ద్వారా కచ్చితమైన ఫలితాలు రావాలన్నా, అది విజయవంతమైందో లేదో తెలియాలన్నా.. కనీసం రెండు నుంచి మూడేళ్ల పాటు పరిశీలన, డేటా అవసరమని పీఈజీ తేల్చిచెప్పింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా వ్యవసాయ మోటార్లకు స్మార్ట్మీటర్లను అమర్చాలనుకుంటే.. ముందుగా కొన్ని పైలట్ ప్రాజెక్టులు చేపట్టి తరువాత ఫలితాలు అధ్యయనం చేశాకే ముందుకెళ్లాలని సూచించింది.
ధర ఎక్కువే: ప్రస్తుతం ఐఆర్ మీటర్ల కన్నా స్మార్ట్ మీటర్లకు ఖర్చు ఎక్కువ అన్న ప్రయాస్ సంస్థ.. ఐఆర్ మీటర్ ధర 2 వేల 500 రూపాయలు ఉంటే, స్మార్ట్ మీటర్ ధర 3 వేల 600 రూపాయలుగా ఉందని తెలిపింది. స్మార్ట్ మీటర్లకు ప్రత్యేకమైన సాఫ్ట్వేర్, డేటా స్టోరేజి ఎలిమెంట్ కావాలని.. ఐఆర్ మీటర్ల నిర్వహణకు అవసరమైన సాఫ్ట్వేర్ కన్నా దాని ధర చాలా ఎక్కువని పేర్కొంది. మీటర్ రీడింగ్కయ్యే ఖర్చు ఒక్కటే.. ఐఆర్ మీటర్లకు సంబంధించిన నిర్వహణ వ్యయమని వెల్లడించింది. స్మార్ట్ మీటర్లకు డేటా కమ్యూనికేషన్ ఛార్జీలు, డేటా హోస్టింగ్ ఛార్జీలు అదనం కాగా.. స్మార్ట్ మీటర్లకు మంచి డేటా కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండాలని పేర్కొంది.
వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చేందుకు భారీ మొత్తంతో మూలధన, నిర్వహణ వ్యయం అవసరమని.. వ్యవసాయ పంప్సెట్లు విసిరేసినట్టుగా అక్కడక్కడా ఉండటం, మీటర్లపై ఎండావానా వంటి ప్రకృతి శక్తుల ప్రభావం, జీఎస్ఎం నెట్వర్క్ సమస్యలు వంటివి ఉండనే ఉంటాయంది. స్మార్ట్మీటర్లతో బిల్లింగ్, కలెక్షన్ సామర్థ్యం పెరుగుతుందన్నది నిజమే కానీ గడువు ప్రకారం ఆటోమేటిక్గా బిల్లులు జారీ చేయడం, చెల్లించనివారి కనెక్షన్లు తొలగించడం, బిల్లు కట్టాక పునరుద్ధరించడం వంటి చర్యల ద్వారానే అది నెరవేరుతుందంది. వ్యవసాయ పంప్సెట్లకు అలా చేయడం అసాధ్యమన్న పీఈజీ నివేదిక.. అంత భారీ వ్యయంతో స్మార్ట్మీటర్లు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు దాని వల్ల ఏ మేరకు అదనపు ప్రయోజనాలుంటాయన్నది ముందుగా మదింపు చేయాలంది.
వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని మెరుగైన విధానాల్లో ఎలా లెక్కించాలన్న దానిపైనే ప్రభుత్వం ఎక్కువ దృష్టిపెట్టాలని.. రైతులు ఎంత విద్యుత్ వినియోగించారో అంతే మొత్తాన్ని ప్రభుత్వం నుంచి డిస్కంలకు వారి ఖాతాల ద్వారా బదిలీ చేయడమన్నది అంత తెలివైన పనికాదని పేర్కొంది. ఆ ఖాతాల్ని రైతులు ఎప్పుడూ వినియోగించరని.. డిస్కంలు నష్టాలు తగ్గించుకోవాలంటే దీనికి బదులు, వేరే విధానాలు అనుసరించాలని తేల్చిచెప్పింది.
మీటర్ల వైఫల్యం 21 శాతం?: శ్రీకాకుళంలో ప్రారంభించిన పైలట్ ప్రాజెక్టులో అన్నీ సక్రమంగా ఉన్న మీటర్ రీడింగ్ నమోదు 45 నుంచి 55 శాతమే ఉందని పీఈజీ నివేదిక చెప్పింది. అదే రాష్ట్రంలో గృహ వినియోగానికి సంబంధించిన వ్యాలీడ్ మీటర్ రీడింగ్ 95 శాతంగా ఉన్నట్లు తెలిపింది. మీటర్ల వైఫల్యం 21 శాతంగా ఉందని పేర్కొంది. ప్రతి నెలా సుమారు 300 వరకూ మీటర్లను మార్చాల్సి వస్తోందని ఏపీఈపీడీసీఎల్ సిబ్బందే చెప్పారని.. మీటర్లు ఆగిపోవటం, కాలిపోవడం, రీడింగ్ ఒక్కసారిగా జంప్ అవడం, పడిపోవడం వంటి పలు సమస్యలు ఎక్కువగా కనిపించాయని పేర్కొంది. ఈ లెక్కన ఐదేళ్లలో ఒక్క జిల్లాలోనే 18 వేల మీటర్లను మార్చాల్సి వస్తుందని తెలిపింది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో కేవలం 22 శాతం మంది వినియోగదారులకు సంబంధించే మొత్తం 12 నెలలూ రీడింగ్ నమోదు చేయగా.. శ్రీకాకుళంలో అమర్చిన 28,463 మీటర్లలో.. సక్రమంగా పనిచేస్తున్న స్థితితో ఉన్న మీటర్ల నుంచి తీసుకున్న రీడింగ్ 55 శాతమే. 28 శాతం మీటర్లలో సున్నా రీడింగ్, లేదా రీడింగ్ నమోదు కాకపోవడం వంటివి ఉన్నాయని తెలిపింది. డోర్ లాక్ చేసినవి, స్తంభించిపోయినవి, ఇతర కేటగిరీలకు చెందినవి 17 శాతం ఉన్నట్లు నివేదిక పేర్కొంది.