ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మార్గదర్శిపై మాట్లాడితే నోటీసులా..? సీఐడీపై ఎంపీ రఘురామ మండిపాటు

By

Published : Apr 12, 2023, 7:41 AM IST

MP RRR FIRES ON CID : రామోజీరావుకు, మార్గదర్శికి మద్దతుగా ఎవరైనా మాట్లాడితే సీఐడీ నోటీసులు జారీ చేస్తుందని సాక్షి దినపత్రిక ప్రచురించిన వార్త కథనంపై నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు తీవ్రంగా మండిపడ్డారు. అవినాష్‌రెడ్డికి మద్దతు ప్రకటించిన జగన్‌కి సీబీఐ నోటీసులు జారీ చేస్తే.. రామోజీరావుకు మద్దతు ప్రకటించిన తనకు సీఐడీ నోటీసులు జారీ చేయవచ్చని స్పష్టం చేశారు.

MP RRR FIRES ON SAKSHI PAPER
MP RRR FIRES ON SAKSHI PAPER

MP RRR FIRES ON CID : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి నిర్దోషి అని శాసనసభ వేదికగా సీఎం జగన్‌ తనకున్న వాక్‌ స్వాతంత్య్రాన్ని వినియోగించుకొని సమర్థిస్తే తప్పులేదు కానీ.. దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్న రామోజీరావు మంచి వారంటే తప్పా? అని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. ఆర్థిక నేరాల కేసులలో జగన్‌ అభియోగాలను ఎదుర్కొంటున్నారన్న ఆయన.. తమ పార్టీ నాయకులు.. జగన్‌ నిర్దోషి అని చెబుతున్నారని విమర్శించారు. సీఐడీ విధానం ప్రకారమైతే జగన్‌ నిర్దోషని పేర్కొన్న వారందరికీ సీబీఐ నోటీసులివ్వాలన్నారు.

అవినాష్‌రెడ్డికి మద్దతు ప్రకటించిన జగన్‌కి సీబీఐ నోటీసులు జారీ చేస్తే.. రామోజీరావుకు మద్దతు ప్రకటించిన తనకు సీఐడీ నోటీసులు జారీచేయవచ్చని స్పష్టం చేశారు. తమ ప్రాథమిక హక్కులను ప్రశ్నించే అధికారం సీఐడీకి లేదని ఎంపీ రఘురామ పేర్కొన్నారు. రామోజీరావు, మార్గదర్శి సంస్థ తప్పు చేసిందనే ఆధారాలు ఉంటే ఛార్జిషీటు దాఖలు చేసుకోవచ్చన్నారు. రామోజీరావుకు, మార్గదర్శికి మద్దతుగా ఎవరైనా మాట్లాడితే సీఐడీ నోటీసులు జారీ చేస్తుందని సాక్షి దినపత్రిక ప్రచురించిన వార్త కథనంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. సాక్షి దినపత్రిక తమను బెదిరించాలని చూస్తోందా?.. లేదంటే సీఐడీ చీఫ్‌ సంజయ్‌ ఈ విషయాన్ని నిజంగానే ఆ పత్రికకు చెప్పారా?అని ప్రశ్నించారు.

ఒకవేళ సీఐడీ చీఫ్‌ మాట్లాడాలి అనుకుంటే మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పాలన్నారు. అప్పుడు మీడియా ప్రతినిధులు కూడా ఆయనను ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుందని, కాబట్టి సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. సీఐడీ అధికారి ఈ విషయాన్ని చెప్పకముందే ప్రచురించి ఉంటే ముందు ఆ పత్రిక యాజమాన్యానికే సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని రఘురామ చెప్పారు. సాక్షి పత్రిక, సీఐడీ పోలీసులు బెదిరిస్తే ప్రజలంతా బెదిరిపోవాలా అని నిలదీశారు.

భావ ప్రకటన ప్రాథమిక హక్కు..ఆర్టికల్‌ 19 ప్రకారం భావ ప్రకటన అన్నది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అన్న విషయాన్ని ఏపీ అధికారులు, పాలకులు గుర్తుంచుకోవాలని రఘురామ హితవు పలికారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మంగళవారం తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రామోజీరావు వంటి విలువలు కలిగిన వ్యక్తి ఎటువంటి తప్పు చేయరని భావించి, ఆయనకు మద్దతుగా మాట్లాడితే తప్పేముందన్నారు. ‘‘సీఐడీ పోలీసుల వేధింపులను తాళలేక మార్గదర్శి సంస్థ ఆడిటర్‌ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. ఇదే విషయాన్ని ఛార్టర్డ్‌ అకౌంటెంట్లతో పాటు, న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. రామోజీరావును రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తున్న తీరును వివరిస్తూ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడైన ప్రొఫెసర్‌ శాస్త్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు’ అని గుర్తు చేశారు.

ఆ ఫొటో బయటకు రావడంపై విచారించాలి..:రామోజీరావును విచారిస్తున్న ఫొటో బయటికి ఎలా వచ్చిందన్న దానిపై ముందు విచారణ చేపట్టాలని సీఐడీ అధికారులను రఘురామ డిమాండ్‌ చేశారు. దీనిపై సాక్షి దినపత్రిక యాజమాన్యాన్ని ప్రశ్నించాలన్నారు. ‘‘ప్రాథమిక హక్కులను కాపాడుకోవడానికి అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. చట్టానికి రామోజీరావు అతీతుడా? అనే శీర్షికతో సాక్షి దినపత్రిక అర పేజీ కథనం ప్రచురించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో చేసిన చిట్‌ ఫండ్‌ చట్టాలు వైసీపీ ప్రభుత్వంలో చేసినవి కావని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. గత ప్రభుత్వాల హయాంలో చేసినవనే విషయం అందరికీ తెలిసిందే. మార్గదర్శి సంస్థ చిట్‌ పాడుకున్న ఖాతాదారునికి మొత్తం సొమ్మును ఇవ్వకుండా తమ వద్దనే డిపాజిట్‌ చేసుకుంటుందని, ఆ మొత్తం వేల కోట్ల రూపాయలని సాక్షి దినపత్రికలో రాశారు. ఈ విషయాన్ని సీఐడీ పోలీసులు సాక్షి దినపత్రికకు చెప్పారా? లేకపోతే స్వయంగా సాక్షి దినపత్రిక పరిశోధన చేసి వార్త రాసిందా? అటువంటి డిపాజిట్లు మొత్తం సొమ్ము కేవలం రూ.50-60 కోట్లు మాత్రమే. నాకు వివరాలన్నీ తెలుసు. సాక్షి దినపత్రిక నా వద్దకు వస్తే, వారి వద్దనున్న ఆధారాలతో పాటు, నా దగ్గర ఉన్న వివరాలపై చర్చిద్దాం’’ అని ప్రకటించారు.

వాలంటీర్ల నియామకాన్ని ప్రశ్నించిన సీజేఐ..:వాలంటీర్ల నియామక తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారని రఘురామ పేర్కొన్నారు. ‘వాలంటీర్ల నియామకం ఎలా? ఎందుకు జరిగిందని సీజేఐ ప్రశ్నించడమే కాకుండా, వారి నియామకంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించారా అని అడిగారు. ప్రభుత్వం తరఫున జీతాలను చెల్లిస్తూ, వారిని పార్టీ పనులకు వినియోగించుకుంటుందని, పార్టీ పనులు చేస్తే తప్పేం ఉందని కొంతమంది అధికారులు కూడా వ్యాఖ్యానించడం విస్మయాన్ని కలిగించే విషయం’ అని రఘురామ చెప్పారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details