ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రజాధనం, ప్రభుత్వ ఉద్యోగులతో పార్టీ ప్రచారమా? : ఎంపీ రఘురామకృష్ణరాజు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 9, 2023, 7:22 PM IST

Updated : Nov 9, 2023, 9:00 PM IST

MP Raghurama Krishnam Raju Allegations on YCP: వైసీపీ ప్రభుత్వంపై ఎంపీ రఘురామకృష్ణరాజు మరో సారి విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రచారంలో అధికారులను కూడా భాగస్వామ్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు, అధికారులు... ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి జగన్‌కే ఓటేయండని ప్రచారం చేయబోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఖర్చుతో ప్రచారాలు చేయడంపై కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం వేస్తానని రఘురామ తెలిపారు.

mp_raghurama_krishnam_raju
mp_raghurama_krishnam_raju

MP Raghurama Krishnam Raju Allegations on YCP: దీపావళి అనంతరం మరో దీపావళి పండుగ రాబోతుందని... ఎంపీ రఘురామకృష్ణరాజు వెల్లడించారు. చంద్రబాబుపై పెట్టిన కేసులన్నీ క్లియర్ అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఫైబర్ గ్రిడ్, రింగ్ రోడ్డు... ఇలా ఏ కేసులో కూడా చంద్రబాబు మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం రాదని రఘురామ తెలిపారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ, ప్రభుత్వం ఒకటే అన్న సజ్జల వ్యాఖ్యలపై ఎంపీ రఘురామ స్పందించారు. ప్రభుత్వం, పార్టీ ఒక్కటే అన్న సకల శాఖల మంత్రి సజ్జల అద్భుతమైన నిర్వచనం ఇచ్చారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని జగన్ ఎందుకు కావాలి అనేది ప్రచారం మొదలుపెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3.25 లక్షల మంది వాలంటీర్లు, అధికారులు... ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి జగన్‌కే ఓటేయండని ప్రచారం చేయబోతున్నారని ఆరోపించారు. ఆ ప్రచారంలో ప్రభుత్వ అధికారులను కూడా భాగస్వామ్యం చేయడాన్ని తప్పుబట్టారు. సామాజిక న్యాయమంటే ఇదేనా సార్ అంటూ ఎద్దేవా చేశారు. తలపై మెడ ఉన్న ఏ ఒక్కరూ ఇలా చేయరని ఎద్దేవా చేశారు.

ఎంపీ రఘురామ అభిమానుల బైక్ ర్యాలీ.. కారణమా అదేనా..!

ఒకపక్క చంద్రబాబు, మరోపక్క జగన్ ఫొటోలు వేసి ప్రభుత్వ ఖర్చుతో ప్రచారాలు చేయడంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఖర్చుతో 24 పేజీల బుక్‌లెట్‌ ప్రచురించి ఇంటింటికీ పంచుతున్నారని పేర్కొన్నారు. అలా చేస్తే అధికార దుర్వినియోగం చేసినట్లు కాదా అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం వేస్తానని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో సీఎం, కుటుంబ సభ్యులపై వ్యతిరేక పోస్టులు పెడితే సంబంధిత బాధ్యుల ఆస్తులు జప్తు చేస్తామని సీఐడీ చీఫ్ అనడం తగదని హితవు పలికారు. ఏ ప్రకారం ఆస్తులు జప్తు చేస్తారని ప్రశ్నించారు. ఇది కేవలం పరువు నష్టం కిందకు మాత్రమే వస్తుందని సీఐడీకి తెలియదా అంటూ ఎద్దేవా చేశారు. గత సీఎం, కుటుంబ సభ్యులపై అసెంబ్లీలో ఎమ్మెల్యేలే మాట్లాడితే అభినందనలా...? అదే అమెరికాలో ఓ పిచ్చికుక్క చంద్రబాబుకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో మొరుగుతుంటే సీఐడీ చీఫ్ సంజయ్ ఎందుకు అరెస్టు చేయరని ప్రశ్నించారు.

ఇటీవల రాష్ట్రానికి రెండు ఐఏఎస్ పోస్టులు వస్తే నాన్ రెవెన్యూకి చెందిన ఇద్దరు రెడ్డిలను ఎంపిక చేసి ఐఏఎస్‌లుగా పదోన్నతి ఇచ్చారని తప్పుపట్టారు. బీసీ, ఎస్‌సీ, ఎస్టీ, మైనారిటీ, ఇతర వర్గాల్లో నిజాయితీపరులు, సమర్థులు లేరా అంటూ ప్రశ్నించారు. రెడ్డి కులస్థులే సమర్థులా అని మండిపడ్డారు. మరోవైపు, వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన సామూహిక సాధికార బస్సు యాత్రపై సైతం విమర్శలు గుప్పించారు. జనం లేరని, బస్సుయాత్ర అంతా విఫలమైందని రఘురామ కృష్ణరాజు ఎద్దేవా చేశారు.

సీఎం జగన్ స్టే తెచ్చుకోకుండా సీబీఐ విచారణ ఎదుర్కోగలడా? : రఘురామ

Last Updated :Nov 9, 2023, 9:00 PM IST

ABOUT THE AUTHOR

...view details