ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Peddireddy on smart meters: పొంతనలేని వివరణలు.. తప్పుడు లెక్కలతో తికమక

By

Published : Oct 26, 2022, 7:08 AM IST

Minister Peddireddy on smart meters: వ్యవసాయ మీటర్లపై ఈనాడు పత్రికలో .. "రైతు చేనుకు కడప మీటరు" శీర్షికతో ప్రచురించిన కథనంపై.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంతన లేని వివరణ ఇచ్చారు. తప్పుడు లెక్కలతో తికమక పెట్టే ప్రయత్నం చేశారు. రైతుల్ని తప్పుదారి పట్టించేందుకే అబద్ధపు రాతలు రాశారంటూ ఎదురుదాడికి దిగారు.

Minister Peddireddy
వ్యవసాయ మీటర్లపై మంత్రి పెద్దిరెడ్డి

వ్యవసాయ మీటర్లపై మంత్రి పెద్దిరెడ్డి

Minister Peddireddy on smart meters: రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల పేరుతో.. ప్రభుత్వం భారీ మొత్తాన్ని వెచ్చించనుందని.. కనీవినీ ఎరుగని రీతిలో.. ఒక్కో మీటరు ఏర్పాటు, అనుబంధ పరికరాలు, ఐదేళ్ల నిర్వహణకు సుమారు 35 వేల రూపాయలు ఖర్చు చేయనుంది అంటూ 'ఈనాడు' కథనంలో వచ్చిన అంశాలపై.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. పొంతన లేని అంశాలు చెబుతూ.. విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఈ నెల 12న విద్యుత్ రంగంపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్ష కోసం రూపొందించిన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌లో.. ఇప్పటికే గుత్తేదారులకు లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ జారీ చేశామని.., బడ్జెట్ కేటాయింపులకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఒప్పందాలు పూర్తి చేస్తామని అధికారులు చెప్పింది వాస్తవం కాదా..? ఎప్పుడో టెండర్లు రద్దు చేసి ఉంటే మరి ముఖ్యమంత్రికి అలా ఎందుకు చెప్పినట్లు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సెప్టెంబర్‌ 29న మంత్రి పెద్దిరెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశం పీపీటీలో కూడా డిస్కంలవారీగా ఎన్ని మీటర్లు పెడుతోంది, ఎంత ఖర్చు చేస్తోందీ వివరిస్తూ.. 2021 సెప్టెంబర్‌ 29న సీపీడీఎల్​ పరిధిలోను, 2021 అక్టోబర్‌ 4న ఎస్​పీడీసీఎల్​ పరిధిలోనూ.. గుత్తేదారులకు షరతులతో కూడిన లెటర్ ఆఫ్ అగ్రిమెంట్‌లు జారీ చేసినట్లు పేర్కొన్న విషయం వాస్తవం కాదా..? మరి ఇంకెప్పుడు టెండర్లు రద్దు చేసినట్లు? ఈ నెల 12న సీఎం సమీక్ష ముగిసిన తర్వాత రద్దు చేశారా? లేక ఈనాడులో కథనం ప్రచురించాక రద్దు చేశారా? టెండరు గడువు వారం రోజులు పొడిగిస్తామని.., కావాలంటే ఎవరైనా పాల్గొనవచ్చని మంత్రి సవాల్ చేశారు. అసలు గడువు పొడిగించడానికి మళ్లీ టెండర్లు పిలిచిందెప్పుడు?

వాస్తవానికి ఈ నెల 12న జరిగిన ముఖ్యమంత్రి సమీక్ష సమావేశానికి పీపీటీ తయారు చేసింది.. విద్యుత్‌ శాఖ అధికారులే. అందులో.. 18 లక్షల 63వేల 8 స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు.. 6 వేల 480.34 కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పింది వాస్తవం కాదా. ఆ లెక్కన ఒక్కో మీటరుకు 34 వేల 787.28 రూపాయల చొప్పున ఖర్చు అవుతున్నట్లే కదా! ఒక వేళ అది వాస్తవం కాదనుకుంటే.. అధికారులు ముఖ్యమంత్రికే తప్పుడు లెక్కలు ఇస్తున్నట్లా? గత నెలలో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష నిర్వహించినపుడు.. అధికారులు ఆయనకు అందజేసిన వివరాల ప్రకారం చూసినా.. ఎస్​పీడీసీఎల్​ పరిధిలో ఒక్కో మీటరుకు 34 వేల 777.63 రూపాయలు, సీపీడీసీఎల్​ పరిధిలో ఒక్కో మీటరుకు 34 వేల 857.20 రూపాయలు ఖర్చవుతుందని చెప్పింది వాస్తవం కాదా?

విడివిడిగా లెక్కలు చెప్పి.. తక్కువ ఖర్చు పెట్టినట్లు చూపే ప్రయత్నం చేసిన పెద్దిరెడ్డి.. 'ఈనాడు' కథనంలో వాస్తవాలు లేవని చెప్పే ప్రయత్నం చేశారు.

వాస్తవానికి స్మార్ట్‌ మీటర్లకు సంబంధించి మీటరు ధర, అనుబంధ పరికరాల ధర, నిర్వహణ వ్యయం.. అని డిస్కంలు మూడు రకాలుగా అంచనాలు రూపొందించాయి. సమాచార హక్కు చట్టం కింద అడిగితే.. మీటరు వ్యయం 6 వేల రూపాయలుగా, అనుబంధ పరికరాల ధర 14 వేల రూపాయలుగా అంచనా వేశామని ఎస్​పీడీసీఎల్పేర్కొంది. మీటరు నెలవారీ రీడింగులకు, నిర్వహణకు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని.. స్పష్టం చేసింది. సీఎం సమావేశం కోసం ఇచ్చిన పీపీటీ ప్రకారం చూస్తేనే.. ఒక్కో మీటరుకు మొత్తం 34 వేల 748.28 ఖర్చవుతోంది. దానిలో మీటరు ఖర్చు 6 వేలు తీసేస్తే అనుబంధ పరికరాలు, నిర్వహణకు 28 వేల 784.28 ఖర్చవుతున్నట్లా? దేనికి దానికి విడివిడిగా లెక్కలు చెప్పినంత మాత్రాన ఖర్చు తగ్గిపోతుందా..?

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details