ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్​రోడ్డుకు గ్రహణం - వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 30, 2023, 10:48 PM IST

Mahatma Gandhi Inner Ring Road : రాష్ట్రంలో రహదారులు అధ్వాన్నంగా మారాయి. అడుగుకు ఒక్క గుంతతో ప్రయాణికుడి గమ్యస్థానాన్ని అగమ్యగోచరంగా మారుస్తున్నాయి. ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందోనని ప్రయాణికులు భయపడుతున్నారు. కనీసం ఇప్పుడైనా ప్రయాణికుల కష్టాలను అర్థం చేసుకొని వాటిని బాగు చేయాలని వారు కోరుకుంటున్నారు.

mahatma_gandhi_ring_road
mahatma_gandhi_ring_road

మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్​రోడ్డుకు గ్రహణం - తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

Mahatma Gandhi Inner Ring Road : లేడి లేచిన వెంటనే పరుగు అన్నటు.. ప్రస్తుత మానవ జీవితంలో ఉదయం నిద్ర లేచినప్పటీ నుంచి రాత్రి పడుకునే వరకు ఉరుకులు పరుగుల జీవితం. అలాంటి జీవితాలను గడుపుతున్నా మానవులకు సరైన రహదారి ఉండటం ఎంతో ముఖ్యం. కానీ రాష్ట్రంలో రహదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారాయి. రహదారుల నిర్మాణానికి గత ప్రభుత్వం చేపట్టిన పనులు.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.

అలాంటి పరిస్థితిలో ఉన్న రహదారై.. మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్​రోడ్డు. గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి ఈ రహదారి ఎంతో ముఖ్యమైనది. ఇది పూర్తి అయితే.. ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలకు పూర్తి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా.. అమరావతి, విజయవాడ, కర్నూలు, హైదరాబాద్​ వెళ్లే వారు నగరం చుట్టూ తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదు. నేరుగా ఆ దారిగుండా వెళ్లే.. చాలా సమయం ఆదా అవుతుంది. కానీ అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ నిర్మాణాన్ని ప్రారంభించడంలో చొరవ చూపడం లేదు. ఈ రహదారి పూర్తయితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఆ దిశగా అటు సీఆర్​డీఏ, ఇటు నగరపాలక సంస్థ అడుగులు వేయలేకపోతుంది. అసంపూర్తి పనులతో పాటు భూసేకరణ సమస్య కూడా కొలిక్కిరాలేదు. ఇలా అడుగడుగునా అడ్డంకులతో.. గుంటూరు మహాత్మగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డు మూడో దశ నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది.

People's problems with traffic jam :రోజూ ట్రాఫిక్ జామ్​తో.. నగరవాసుల కష్టాలు మాటల్లో చెప్పలేం. ఎంతో ముఖ్యమైన పనులకు వెళ్లాలనుకునేవారు పొరపాటున మహాత్మాగాంధీ ఇన్నర్​ రింగ్​ రోడ్డులో వస్తే.. పని వాయిదా వేసుకోవాల్సిందే. ఎందుకంటే వందలాది వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరి ఉంటాయి. గుంటూరు నగరానికి ఇన్నర్ రోడ్డును 2005లో అప్పటి వీజీటీఎం ఉడా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. ఈ దిశగా.. ప్రజలకు ట్రాఫిక్ నుంచి విముక్తి కల్పించాలనే సంకల్పంతోనే.. టీడీపీ పార్టీ హయాంలో మహాత్మాగాంధీ ఇన్నర్ రోడ్డుకు శ్రీకారం చుట్టారు. 2010-14 మధ్యకాలంలో.. ఆటోనగర్ నుంచి రెడ్డిపాలెం వరకు.. తొలిదశలో 4.7 కిలోమీటర్ల మేర అమరావతి రహదారిని అనుసంధానం చేస్తూ నిర్మాణాన్ని పూర్తి చేశారు. 2014 తర్వాత రూ. 29.08 కోట్లతో.. అమరావతి రోడ్డు నుంచి స్వర్ణభారతినగర్ వరకు రెండో దశలో 2 కిలోమీటర్ల రహదారిని పూర్తి చేశారు. 2014లో రాష్ట్రం విడిపోవడం.. రాజధాని రాకతో ఆ ప్రాంతం సీఆర్​డీఏ పరిధిలోకి వెళ్లింది. నగరంలోని ట్రాఫిక్ సమస్యలను తీర్చడం కోసం.. 2019లో సీఆర్​డీఏ రూ. 33 కోట్లు.. 80అడుగుల దూరం పూర్తి చేసేందుకు.. నిధులను మంజూరు చేసింది. రహదారి నిర్మాణానికి కావాల్సిన భూ సేకరణ సైతం పూర్తయింది. సీఆర్​డీఏ రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచి గుత్తేదారును ఎంపిక చేసి నిర్మాణ పనులు అప్పగించింది. కానీ ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలంటే ఒక చిక్కువచ్చి పడింది.

Obstacles to Road Construction :రింగ్​రోడ్డు మూడోదశ నిర్మాణాలు పూర్తి కావాలంటే.. స్వర్ణభారత్ నగర్​లో 382 ఇళ్లను తొలగించాల్సి ఉంది. వీటిలో బీ ఫారం పట్టాలు, ఆక్రమణ భూములు ఉండటంతో కొలిక్కిరావడం లేదు. రోడ్డు వల్ల ప్రభావితమయ్యే వారితో మున్సిపల్ కమిషనర్ కీర్తి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే చర్చలు జరిపారు. ఇంటి స్థలం పట్టాలు, రుణాలు మంజూరు చేయిస్తామని చెప్పినా.. స్థానికుల నుంచి సానుకుల స్పందన రావట్లేదనే మాట వినిపిస్తోంది. కొత్త ప్రణాళికా ప్రకారం..చాలా నష్టపోతామని.. గత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రోడ్డు నిర్మించాలని స్థానికులు ఆందోళనకు దిగడంతో సమస్య జఠిలంగా మారింది.

Benefits of Mahatma Gandhi Inner Road : మహాత్మాగాంధీ ఇన్నర్ రోడ్డు మూడో దశ నిర్మాణం పూర్తయితే.. విజయవాడ మార్గంలోని ఆటోనగర్ నుంచి పేరేచర్ల వరకు అనుసంధానం సులభమవుతుంది. నరసరావుపేట, హైదరాబాద్​ నుంచి విజయవాడ వైపు వెళ్లేవారు నేరుగా ఈ మార్గంలో ప్రయాణించడం వల్ల ట్రాఫిక్ రద్దీ నుంచి ఉపశమనం కలుగుతుంది. ప్రయాణ సమయం తగ్గడం వల్ల ఇంధనం కూడా ఆదా అవుతుంది. వివిధ నగరాలను వచ్చే వాహనాలు ఇన్నర్ రింగ్​రోడ్డులో వెళ్లిపోవడం వల్ల నగరంలోని ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది. మూడో దశ నిర్మాణం పూర్తయితే.. రాజధాని చుట్టూ ఉన్న ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. రాజధాని రాకతో నగరం విస్తరిస్తున్న వేళ ఈ మార్గం ప్రగతికి బాటలు వేస్తుంది.

ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉండే రోడ్డు నిర్మాణంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం.. ప్రయాణికులకు విసుగు తెప్పిస్తోంది. పెదపలకలూరు గుంతల దారిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ పనుల కోసం గుంటూరుకు రావాలంటే.. చుట్టూ తిరిగి రావాల్సి వస్తోందని మండిపడుతున్నారు. వీలైనంత త్వరగా రోడ్డు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details