ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జగన్ పాలనలో ఆపదలో 'అన్నపూర్ణ' - కుటుంబ స్వార్థ ప్రయోజనాలతో రాష్ట్రానికి అన్యాయం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 6, 2023, 10:42 PM IST

Updated : Nov 7, 2023, 12:39 PM IST

Jagan Vs Chandrababu Leadership Qualities: టీడీపీ అధినేత చంద్రబాబుతో పోలిస్తే.. జగన్ నాయకత్వ సామర్థ్యం ఏపాటో ఈ ఒక్క ఏడాదిలోనే తేటతెల్లమైంది. దేశానికే అన్నపూర్ణగా పేరొందిన కోస్తాంధ్రలో రైతులు కన్నీళ్లు పెట్టడం వైసీపీ సర్కారు వైఫల్యాన్ని కళ్లకు కడుతోంది. చంద్రబాబు ఆలోచనలన్నీ 'మనం.. మన ప్రాంతం' అన్నట్లుగా ఉంటే.. జగన్ ఆలోచనలు, అడుగులు మాత్రం 'నా.. నేను' అనే మార్గంలోనే ఉంటాయి.

Jagan_vs_chandrababu_Leadership_Qualites
Jagan_vs_chandrababu_Leadership_Qualites

Jagan Vs Chandrababu Leadership Qualities: టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టే ప్రతి పనిలోనూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే కనిపిస్తాయి. గోదావరి, కృష్ణా నదులున్నా.. ఎంతో ముందుచూపుతో చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు.. రాష్ట్రానికే తలమాణికం. కానీ, జగన్ ఆలోచనల్లో మాత్రం 'నా.. నేను' అనే స్వార్థమే కనిపిస్తోంది. కరవును అధిగమించే అపార అవకాశాలున్నా విఫలమయ్యారు. సాగు నీటి హక్కుల సాధనలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యం.. ప్రజల పాలిట శాపంగా మారింది.

హామీల మాయలో జనాన్ని మోసం చేసిన జగన్.. ఓట్లు వేయించుకుని అధికార దండం అందుకున్నారు. అప్పట్నుంచీ.. స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టారని జనం మండిపడుతున్నారు. ఈడీ, సీబీఐ కేసుల విచారణ తప్పించుకోవడం, బాబాయ్ హత్య కేసులో సోదరుడిని బయటపడేయడానికే.. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై మౌనం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Crops Drying Due to Lack of Irrigation: సాగునీరు అందక ఎండుతున్న పంటలు.. ఆత్మహత్యలే శరణ్యమంటున్న అన్నదాతలు

చంద్రబాబు విజన్..పట్టుదల, ప్రణాళిక, విజన్.. గొప్ప నాయకుల లక్షణాలు. సంపద సృష్టించడం.. దానిని తిరిగి ప్రజలకు పంచడం.. తద్వారా రాష్ట్రాభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయడం పాలకుల నైపుణ్యం. ఈ క్రమంలో గొప్ప విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబు దేశ వ్యాప్త గుర్తింపు పొందారనడంలో సందేహం లేదు. సైబరాబాద్ సృష్టికర్తగా.. తెలుగు యువతకు ఉన్నత విద్య, ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలను ప్రపంచవ్యాప్తం చేశారు.

డ్వాక్రా సంఘాల ఏర్పాటుతో గ్రామీణ మహిళల అభ్యున్నతికి బాటలు వేశారు. ఫలితంగా అక్షరజ్ఞానంలేని మహిళలు సైతం పొదుపు పథకాలు సద్వినియోగం చేసుకుని కుటుంబానికి వెన్నెముకగా నిలిచారు. ఇదంతా గత వైభవం. చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టినా 'మా, మనం'.. అనేది లక్ష్యంగా ఉంటుంది. నూతన రాజధానిగా అమరావతి ఎంపిక మొదలు.. నవ నిర్మాణాలతో పాటు రైతుల అభివృద్ధిని చంద్రబాబు కలగన్నారు. భవిష్యత్​ను ముందే ఊహించే ఆలోచనాపరుడైన ఆయన.. ఎంతో పట్టుబట్టి పట్టిసీమను పూర్తి చేశారు. గోదావరి జలాలను కృష్ణమ్మ ఒడికి చేర్చి అనుసంధానానికి తొలి అడుగు వేశారు.

Farmers Worried on Crops Over Power Cuts in AP: రైతులను కలవరపెడుతున్న విద్యుత్ కోతలు.. ఎండిపోతున్న పంటలు..

జగన్ పాలనావైఫల్యం..ముఖ్యమంత్రి హోదాలో జగన్ చేపట్టే కార్యక్రమాలన్నీ 'నా.. నేను' అన్నట్లుగా ఉంటున్నాయి. నాలుగున్నరేళ్ల జగన్ పాలనలో.. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఒక్క కార్యక్రమమైనా చేపట్టారా..? ఒక చారిత్రక నిర్మాణమైనా పూర్తి చేశారా..? ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంసం.. ఇపుడు విశాఖ రుషికొండ శిఖరాగ్రానికి చేరింది. పునరుజ్జీవం పోసుకున్న నూతన రాష్ట్ర భవిష్యత్​కు బాటలు వేస్తూ.. చంద్రబాబు వేసిన అడుగులను తుడిచిపెట్టడం తప్ప జగన్ చేసిందేమిటి..?అని ఏపీ యువత ప్రశ్నిస్తోంది.

జగన్ కార్యక్రమాలన్నీ 'నా.. నేను' అన్నట్లుగా ఉంటున్నాయి. చంద్రబాబు అమరావతి ద్వారా సమాంతర అభివృద్ధిని ఆశించగా.. జగన్ మాత్రం.. మూడు రాజధానుల పేరిట.. విశాఖ విధ్వంసానికి పూనుకున్నారు. విశాఖలో పర్యాటక పేరుతో తనకోసం విలాస భవనాలు నిర్మించుకున్న ఆయన.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రైవేటు భవనాలను ఎంచుకున్నారు.

25మంది ఎంపీలు కేంద్రంలో కొండంత బలంగా ఉన్నా.. అటు రాజధాని, ఇటుపోలవరం నిర్మించలేకపోయారు. వ్యక్తిగత కేసులు, బాబాయ్ హత్య కేసులో సోదరుడిని రక్షించుకునేందుకు తరచూ దిల్లీ పర్యటనలు సాగిస్తున్నారనే విమర్శలు చెలరేగుతున్నా.. వాటిని తిప్పికొట్టే చర్యలు గాని, 'రాష్ట్రాభివృద్ధికే..'అని చెప్పే పనులు గానీ మచ్చుకైనా కనిపించడంలేదు.

ఒక్క సీజన్​లోనే తేటతెల్లం.. దక్షిణ భారత ధాన్యాగారమైన ఆంధ్రప్రదేశ్​లో ఈ ఏడాదిలో కరవు ఛాయలు కమ్ముకున్నాయి. దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులున్నా.. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పంటల సాగు 70శాతానికి పైగా నమోదైంది. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతోంది. కానీ, ఇక్కడ పరిస్థితులు పూర్తిగా భిన్నం. గతంలో మూడు పంటలు పండించిన డెల్టా రైతాంగం సాగునీరందక కన్నీరు పెడుతోంది. ఖరీఫ్ సీజన్​లో పచ్చని మాగాణి నెర్రెలు బారి పొలాలన్నీ బీళ్లను తలపిస్తున్నాయి.

వరి సాగు చేసిన రైతు ఉరి కొయ్యను ముద్దాడుతున్న దుస్థితి నెలకొంది. 'పంటలు ఎండిపోతున్నాయి.. ఆదుకోండి మహాప్రభో' అంటున్న.. అన్నదాత కేకలు పాలకుల చెవికెక్కడం లేదు. కృష్ణా జలాల పంపిణీలో అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నించకపోవడం, సమర్థ నాయకత్వ లేమి, ప్రణాళికా లోపం.. రైతాంగం పాలిట శాపంగా మారింది. చంద్రబాబు పూర్తిచేసిన పట్టిసీమే లేకపోతే.. తాగునీటికీ తిప్పలే.

ఉపాధి అభూత కల్పన..ఏదీ ఉపాధి కల్పన..? నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సమావేశానికి హాజరైన యువత.. ఉద్యోగాలు, ఉపాధి కల్పన, పరిశ్రమల ఏర్పాటుపై ఉసూరుమంది. 'ఉద్యోగాలు అంటే.. హైదరాబాద్​, బెంగళూరేనా..? మనకంటూ ఏమీ లేవా సార్' అంటూ ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని కంటతడి పెట్టడం.. ఉపాధి కల్పనపై వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలకు దర్పణం పడుతోంది.

జనవరి వస్తూ.. పోతున్నా జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడ..?

ఏమిటీ సామాజిక సాధికారత..?నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు అని చెప్పుకునే జగన్.. నిజంగా వారి మధ్యకు వెళ్లగలిగే సాహసం చేయగలరా..? వారిలో విద్య, ఉపాధి, శిక్షణ ఇచ్చిన వ్యక్తిగత నైపుణ్యం పెంపొదించే చర్యలు ఏమైనా చేపట్టారా..? తాము క్రైస్తవులమని చెప్పుకునే వైఎస్ కుటుంబ వారసత్వం నుంచి వచ్చిన జగన్.. ఆ బైబిల్​లో చెప్పినట్లుగా చేపలు పట్టి ఇవ్వడం కాదు.. చేపలు పట్టుకోవడం నేర్పాలన్న తత్వాన్ని ఆ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లో విత్తారా..! అనే ప్రశ్నలకు.. బిక్కమొహమే సమాధానంగా కనిపిస్తుందని చెప్పడానికి ఏ మాత్రం సందేహించనక్కర్లేదు.

సామాజికంగా ఎంపిక చేసిన కొందరిలో.. టీడీపీ అమలు చేసిన ప్రత్యేక రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల ద్వారా.. వ్యక్తులు, వ్యవస్థలుగా మారారని చెప్పడానికి అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. కానీ జగన్ అమలు చేసిన గుండు గుత్తా.. పథకాలతో డబ్బులను పంచడమే కనిపిస్తుంది. జగన్ ఇచ్చిన డబ్బులతో.. ఎవరైనా అభివృద్ధి చెందారా అని ప్రశ్నిస్తే.. మన తెలివితక్కువతనం బయటకు వస్తుందే తప్పా.. సమాధానం రాదు.

టీడీపీ అమలు చేసిన ప్రత్యేక రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలను తొక్కిపెట్టిన జగన్.. 'సామాజిక సాధికార యాత్ర' పేరుతో మరో మోసానికి తెరతీశారు. ఆ పార్టీ చేపట్టిన బస్సు యాత్రలు వెలవెలబోతుండగా.. జనం దృష్టి మళ్లించడానికి నాయకులు బూతులు కూడా మాట్లాడుతున్నారు. వైసీపీ పాలనలో కుట్ర పూరిత రాజకీయాలు.. తప్ప ప్రజా ప్రయోజనాలు కనిపించటం లేదు. 'జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం.. చంద్రబాబు చావడం ఖాయం' అంటూ ఎంపీ గోరెంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు ఆ ప్రణాళికలో భాగమే.

'ఆరోగ్యమిత్ర'లకు అన్నీ సమస్యలే! వేతన వెతలకు తోడు కొరవడిన ఉద్యోగ భద్రత

Last Updated :Nov 7, 2023, 12:39 PM IST

ABOUT THE AUTHOR

...view details