ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇసుక దొంగలు.. వైకాపాకు చెందిన వారే: రాజధాని రైతులు

By

Published : Jul 28, 2021, 7:56 AM IST

హైకోర్టు సమీపంలోనే.. కొందరు దుండగులు రాజధాని నిర్మాణానికి నిల్వ చేసిన డంప్‌ నుంచి ఇసుక తరలించారు. ట్రాక్టర్లు, జేసీబీలతో తోడుకుపోయారు. వైకాపాకు చెందిన వ్యక్తులే ఈ పని చేశారని రాజధాని రైతులు ఆరోపించారు. అమరావతి కోసం పోరాడుతున్న రైతులపై కేసులు పెడుతున్న పోలీసులు.. ఇసుక దొంగలపై ఎందుకు కేసులు పెట్టట్లేదని ప్రశ్నించారు.

illegal sand mining at nalgonda
అమరావతి రైతుల ధర్నా

రాజధాని అమరావతిలోని రహదారిని తవ్వేసి కంకర తరలించుకుపోయిన ఘటనను ఎవరూ మరువక ముందే.. తాజాగా మరో దందా వెలుగు చూసింది. హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయాలు, రాజధాని నిర్మాణం కోసం గత ప్రభుత్వ హయాంలో నిల్వ చేసిన ఇసుకపై అక్రమార్కుల దృష్టి పడింది. రెండేళ్లుగా నిర్మాణాలు ఆగిపోవడంతో అక్కడున్న ఇసుకను రాత్రికి రాత్రే జేసీబీలతో లారీలు, ట్రాక్టర్లలో నింపి దుండగులు తరలించేశారు. నేలపాడులోని హైకోర్టు భవనానికి సమీపంలోనే ఈ చోరీ ఘటన జరిగింది. లారీల్లో ఇసుక తరలించుకుపోతున్న విషయాన్ని సోమవారం రాత్రి కొందరు స్థానికులు గుర్తించటంతో ఈ దారుణం వెలుగుచూసింది.

ఇసుక దోపిడీ జరిగిన ప్రాంతానికి అమరావతి దళిత ఐకాస నాయకులు మంగళవారం చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఐకాస కన్వీనర్‌ గడ్డం మార్టిన్‌, ఇతర నాయకులు ముళ్లముడి రవికుమార్‌, చిలకా బసవయ్య, పులి చిన్నా, పూల రవి, బేతపూడి సుధాకర్‌, రామారావు, రైతులు ఇడుపులపాటి సీతారామయ్య, గాంధీ తదితరులు ఇదంతా వైకాపాకు చెందిన నాయకుల పనే అని ఆరోపించారు. ముఖ్యమంత్రి డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. డంప్‌ నుంచి తరలించుకుపోగా మిగిలిన ఇసుకను చూపించారు. అలాగే.. లారీలు, ట్రాక్టర్లు అక్కడ నడిచాయని చెప్పేందుకు వీలుగా ఆయా వాహన చక్రాల గుర్తులను విలేకర్లకు చూపించారు. 50 నుంచి 60 లారీల ఇసుక తరలించారని ఆరోపించారు. ఇసుక దొంగలపై కేసు పెట్టాలని తుళ్లూరు పోలీసులకు దళిత ఐకాస నేతలు ఫిర్యాదు చేశారు.

ముఖ్యమంత్రి అనుచరులే దోచేశారు: దళిత ఐకాస నాయకులు

మరావతిని నాశనం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి కూల్చివేతలకు పాల్పడుతుంటే.. స్థానికంగా ఉండే ఆయన అనుచరులు రాజధానిలోని రోడ్లను తవ్వేసి కంకర దోచుకోవటం, నిర్మాణాల కోసం నిల్వ చేసిన ఇసుక తరలించేయటం లాంటివి చేస్తున్నారని దళిత ఐకాస కన్వీనర్‌ గడ్డం మార్టిన్‌, ఇతర నాయకులు ఆరోపించారు. అమరావతిని నామరూపాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.

అమరావతి కోసం పోరాడుతున్న రైతులపై కేసులు పెడుతున్న పోలీసులు.. ఇసుక దొంగలపై ఎందుకు కేసులు పెట్టట్లేదని ప్రశ్నించారు. హైకోర్టుకు సమీపంలోనే ఇసుక దోచుకు వెళ్తుంటే నివారించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. రైతులకు ఇచ్చిన ప్లాట్ల హద్దురాళ్లను తొలగించేసి మరీ ఇసుక తరలించుకు పోయారని.. ఇలాంటి చర్యలు అమరావతిపై విషం చిమ్మటమేనని ఆరోపించారు. రోడ్డుకు ఇరువైపులా నాటిన చెట్లను సైతం వైకాపాకు చెందిన నాయకులు నరికి వేస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చూడండి:

Flash: మాజీ మంత్రి దేవినేని వర్గీయులపై రాళ్ల దాడి

ABOUT THE AUTHOR

...view details