ఆంధ్రప్రదేశ్

andhra pradesh

హైకోర్టులో జీవో నెంబర్‌ 1పై విచారణ.. నేటికి వాయిదా

By

Published : Jan 23, 2023, 4:20 PM IST

Updated : Jan 24, 2023, 7:17 AM IST

హైకోర్టులో జీవో నెంబర్‌ 1పై విచారణ.. నేటికి వాయిదా

High Court GO No 1: రోడ్‌షోలు, ర్యాలీలు నిషేధిస్తూ.. ప్రభుత్వం ఇటీవల తెచ్చిన జీవోనంబర్‌-1ను వెకేషన్‌ బెంచ్‌.. అత్యవసరంగా విచారించడాన్ని.. హైకోర్టు ధర్మాసనం ఆక్షేపించింది. వెకేషన్‌ బెంచ్‌ వ్యవహరించిన తీరు సరికాదని.. ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇవాళ కూడా.. జీవో నంబర్‌-1పైలో హైకోర్టులో విచారణ కొనసాగనుంది.

హైకోర్టులో జీవో నెంబర్‌ 1పై విచారణ.. నేటికి వాయిదా

High Court GO No 1: సంక్రాంతి సెలవుల సమయంలో.. ఎలాంటి అంశాలపై విచారించాలో పేర్కొంటూ హైకోర్టు ఇచ్చిన నోటిఫికేషన్‌కు విరుద్ధంగా.. జీవో 1పై వెకేషన్‌ బెంచ్‌ విచారణ జరిపిందని.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర నేతృత్వంలోని.. ధర్మాసనం ఆక్షేపించింది. ఇది హైకోర్టు సీజేను అవమానించడమేనని ఘాటు వ్యాఖ్య చేసింది. ఇదే పద్ధతిని కొనసాగనిస్తే.. ప్రతి వెకేషన్‌ జడ్జి.. డిఫ్యాక్టో ప్రధాన న్యాయమూర్తిలా భావించి విచారణలు చేపడతారని, ఇలాంటి చర్య న్యాయ వ్యవస్థకు మంచిది కాదని.. ఘాటుగా పేర్కొంది. ఇది తేలిగ్గా తీసుకునే.. వ్యవహారం కాదంది.

ప్రధాన న్యాయమూర్తికే సొంతమైన అధికారాల విషయంలో తాను కచ్చితంగా వ్యవహరిస్తానని సీజే తేల్చి చెప్పారు. జీవో నంబర్‌-1ను సవాల్‌ చేస్తూ.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వేసిన పిటిషన్‌ను ఈనెల 12న వెకేషన్‌ బెంచ్‌ విచారణ జరిపింది. ఆ జీవో.. పోలీసు యాక్ట్‌లోని సెక్షన్‌ 30కి విరుద్ధంగా ఉందంటూ నెల 23 వరకూ.. సస్పెండ్‌ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో.. ఈ అంశంపై సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

అసలు.. ఆ జీవోపై అత్యవసరంగా విచారించాలని వెకేషన్‌ బెంచ్‌ను కోరాల్సిన అవసరం ఏమొచ్చిందని.. పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని.. ధర్మాసనం ప్రశ్నించింది. కొంత సమయం వేచి చూస్తే ఆకాశమేమీ ఊడిపడదు కదా,..? అని ప్రశ్నించింది. గందరగోళ పరిస్థితులకు, వ్యవస్థకు చెడ్డపేరు తెచ్చేందుకు కారణమయ్యారని తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. మధ్యంతర ఉత్తర్వులు పొందిన ఈ పది రోజుల్లో కార్యక్రమాలేమీ చేయలేదు కదా అని ప్రశ్నించింది.

‘అడ్మినిస్ట్రేటివ్‌, పాలసీ నిర్ణయాలపై వెకేషన్‌ బెంచ్‌ విచారణ చేపట్టకూడదని హైకోర్టు పేర్కొన్నప్పటికీ.. ప్రభుత్వ నిర్ణయాలు పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉంటే వెకేషన్‌ బెంచ్‌ విచారణ చేపట్టవచ్చని.. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. సమావేశం.. ఎక్కడ నిర్వహించుకోవాలనే హక్కు నిర్వాహకులకే ఉండాలని,.. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోజాలదన్నారు.

జీవో నంబర్‌-1కు రాజ్యాంగ బద్ధత లేదని,..దాని అమలును నిలిపివేయాలని కోరారు. ఐతే.. ఊరేగింపులు, పాదయాత్రలు, రోడ్‌ షోలపై నిషేధం విధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని.. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ హైకోర్టుకు వివరించారు. హైకోర్టు నోటిఫికేషన్‌కు విరుద్ధంగా.. వెకేషన్‌ బెంచ్‌ విచారణ జరిపిందని,.. ఆ వ్యాజ్యానికి విచారణ అర్హత లేదనే విషయాన్ని బెంచ్‌ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా,.. కనీసం వాదనలు వినిపించే అవకాశం ఇవ్వలేదన్నారు. అత్యవసర విచారణ కోసం.. కృత్రిమ కారణాలను పిటిషనర్‌ తెర పైకి తెచ్చారని అడ్వకేట్‌ జనరల్‌ చెప్పారు.

ఈ సందర్భంగా సీజే స్పందిస్తూ.. ‘సీజే ఉత్తర్వులకు విరుద్ధంగా వెకేషన్‌ బెంచ్‌ విచారణ జరిపిందని,.. ఆ రోజు ఏం జరిగిందో.. రిజిస్ట్రీ ఎప్పటికప్పుడు తనకు చెప్తూనే ఉందన్నారు. ఏమీ తెలియదనుకోవడం పొరపాటే’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. మరోవైపు.. ఇదే జీవోను సవాలు చేస్తూ టీడీపీ నేత కొల్లు రవీంద్ర,.. పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ దాఖలు చేసిన.. వేర్వేరు వ్యాజ్యాలపైనా విచారణ జరుపుతామంటూ.. జస్టిస్‌ జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం ఇవాళ్టికి వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

Last Updated :Jan 24, 2023, 7:17 AM IST

ABOUT THE AUTHOR

...view details