ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శితో ఏపీ సీఎస్ భేటీ - శ్రీశైలం ఏపీ ఆధీనంలో ఉన్నా తెలంగాణ నీటి విడుదల చేస్తోందని ఫిర్యాదు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 2, 2023, 10:01 PM IST

AP CS Jawahar Reddy complaint on Telangana govt కృష్ణా జలాలను తెలంగాణ రాష్ట్రాం ఇష్ఠానుసారంగా వాడుకుంటుందని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఏపీలో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. ప్రాజెక్టుల్లోని నీటిని తెలంగాణ మాత్రం విద్యుత్ ఉత్పత్తి కోసం వాడుకుంటుందని ఆరోపించింది. కృష్ణా జలాల పంపిణీ, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ అంశంపై ఢిల్లీ నుంచి జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశానికి హజరైన ఏపీ సీఎస్ విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన వాటా విడుదల చేయకుండా తెలంగాణ అడ్డుకుంటోందని సీఎస్ తెలిపారు.

cs_jawahar_meeting
cs_jawahar_meeting

CS Jawahar Reddy Meeting with Central Hydropower Department Secretary:నాగార్జున సాగర్‌ జలాలు విడుదలపై తలెత్తిన వివాదం నేపథ్యంలో కృష్ణా జలాల పంపిణీ, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపైకేంద్ర జలశక్తిశాఖఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేయగా ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా ఈ సమావేశానికి హాజరు కాలేమని తెలంగాణా సీఎస్ స్పష్టం చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తమ అభ్యంతరాలను కేంద్ర కార్యదర్శికి వివరించారు. కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి దేవశ్రీముఖర్జీ నేతృత్వంలో నిర్వహించిన భేటీలో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు.

సాగర్ కుడికాలువ నుంచి నీరు తీసుకోవడం ఆపాలి - ఏపీకి కృష్ణా బోర్డు అదేశం

ఈ ఏడాది కృష్ణానదికి అనుకున్నంత నీరు రాకపోయినా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కోసం శ్రీశైలం ప్రాజెక్ట్‌ నుంచి విచక్షణరహితంగా నీటిని విడుదల చేస్తోందని సీఎస్ కేంద్ర జలశక్తిశాఖ దృష్టికి తీసుకెళ్లారు. అదే నీటిని నాగార్జునసాగర్‌ నుంచి వినియోగించుకుంటూ 2 విధాలా లాభం పొందుతోందన్నారు. పునర్విభజన చట్టంలో హక్కుగా ఏపీ వినియోగించుకోవాల్సిన నీటిని తెలంగాణా అడ్డుకుంటోదని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ ఏపీ చేతిలో ఉన్నా ఎడమ వైపున ఉన్న విద్యుత్ కేంద్రాన్ని తెలంగాణా తీసేసుకుందని ఫిర్యాదు చేశారు. వాస్తవానికి శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం ఏపీలోని కర్నూలు ఛీఫ్ ఇంజనీర్ ఆధీనంలో ఉండాలని స్పష్టం చేశారు.

నాగార్జున సాగర్‌ డ్యాం వద్ద మళ్లీ టెన్షన్​ - భారీగా పోలీసుల మోహరింపు

నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ కుడి భాగం ఏపీ భూభాగంలో ఉన్నా ఈ ప్రాజెక్ట్‌ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుందని జలశక్తిశాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల నీటి విడుదల కోసం ప్రతిసారీ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాల్సి వస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం దురుద్దేశంతోనే శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని విడుదల చేస్తోందన్నారు. కేఆర్​ఎంబీ నుంచి ఎలాంటి ఆదేశాలు లేకున్నా విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని ఎలా విడుదల చేస్తారని సీఎస్ జవహర్‌రెడ్డి అభ్యంతర వ్యక్తం చేశారు. దీనివల్ల శ్రీశైలం నుంచి ఏపీ వాటా నీటిని వాడుకునేందుకు అవకాశం లేకుండా పోతోందన్నారు.

నాగార్జునసాగర్ వివాదం - మరోమారు తెరపైకి కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టు స్వాధీనం అంశం

కాబట్టి నాగార్జున్‌సాగర్‌కుడివైపు ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని కేఆర్​ఎంబీ సూచనల మేరకు నీటిని విడుదల చేసుకుంటామని సీఎస్ జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా ప్రాజెక్ట్‌లపై కేంద్రం కేఆర్​ఎంబీ పరిధిని నిర్ణయించేంత వరకు శాంతిభద్రతలను అదుపులో ఉంచడం కోసం ఏపీపోలీసులను నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌ వద్ద మోహరిస్తామని వెల్లడించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌లు రెండింటినీ కేఆర్​ఎంబీకి అప్పగించేందుకు ఏపీ అంగీకరించినా తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసిందని సీఎస్ జలశక్తిశాఖ దృష్టికి తీసుకెళ్లారు.

తాగునీటి అవసరాల కోసం 5 టీఎంసీలులు కావాలని ఇప్పటికే కేఆర్​ఎంబీకి ఇండెంట్‌ ఇచ్చామని బోర్డు నిర్ణయం వెలువరించే వరకు సాగర్‌ నుంచి నీటి విడుదలను నిలిపివేసేందుకు అంగీకరిస్తున్నట్లు జలశక్తిశాఖకు తెలిపారు. డిసెంబరు 6 తేదీన ఢిల్లీలో జలశక్తి శాఖ రెండు రాష్ట్రాలతో నిర్వహించే సమావేశానికి హాజరవుతామని ఆయన వెల్లడించారు. కేఆర్​ఎంబీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి విశాఖకు తరలించేలా బోర్డు ఛైర్మన్‌ను ఆదేశించాలన్న ఏపీ విజ్ఞప్తకి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి అంగీకరించినట్లు తెలిసింది.

కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శితో ఏపీ సీఎస్ భేటీ - శ్రీశైలం ఏపీ ఆధీనంలో ఉన్నా తెలంగాణ నీటి విడుదల చేస్తోందని ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details