ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆ భవనాలు పాఠశాలలకు ఇస్తాం.. హైకోర్టులో ప్రభుత్వం

By

Published : Dec 22, 2022, 4:41 PM IST

Chief Secretary K Jawahar Reddy: పాఠశాల ఆవరణలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డితోపాటు.. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పంచాయితీ రాజ్ శాఖ సెక్రటరీ హైకోర్టులో హాజరయ్యారు. పాఠశాలల ఆవరణల్లో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాలను పాఠశాల వినియోగానికి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వాధికారులు హైకోర్టుకు తెలిపారు.

హైకోర్టులో  జవహర్ రెడ్డి
Chief Secretary K Jawahar Reddy

Jawahar Reddy appeared in the High Court: పాఠశాల ఆవరణలో సచివాలయాల నిర్మాణం కేసులో ముగ్గరు ఐఏఎస్​లు హైకోర్టుకు హాజరయ్యారు. సీఎస్ జవహర్ రెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పంచాయితీ రాజ్ శాఖ సెక్రటరీలు న్యాయస్థానానికి హాజరయ్యారు. పాఠశాల ఆవరణలో నిర్మించిన భవనాలను.. పాఠశాల వినియోగానికి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు కోర్టుకు తెలిపారు. నిర్మించిన భవనాలు పాఠశాలకు ఏ విధంగా ఉపయోగపడతాయో చూడాలని ధర్మాసనం తెలిపింది.

దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేసింది. పాఠశాల ఆవరణలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు నిర్మిస్తున్నారంటూ దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. నిర్మాణాలను నిలిపివేయాలని గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చింది. ధర్మాసనం ఆదేశాలతో నేడు కోర్టుకు సీఎస్ హాజరయ్యారు.

అసలేం జరిగిందంటే: పాఠశాలల ప్రాంగణాల్లో ఎలాంటి నిర్మాణాలకు వీల్లేదని 2020 జూన్‌ 11న హైకోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ.. నిర్మాణాలు కొనసాగిస్తున్నారని పేర్కొంటూ.. 2021లో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రభుత్వ పాఠశాలల స్థలాల రక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకునే నిమిత్తం సూచనలు, సలహాలు ఇచ్చేందుకు కోర్టుకు సహాయకులుగా సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తిని నియమించింది. పాఠశాలల్లో నిర్మాణాల తొలగింపునకు ఏం చర్యలు తీసుకున్నారో, ప్రస్తుత పరిస్థితి ఏమిటో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

239 పాఠశాలల్లో సచివాలయాలు: నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి నిర్మాణాల తొలగింపు విషయంలో ఎలాంటి పురోగతి లేదన్నారు. సీఎస్‌ సమావేశం నిర్వహిస్తున్నారు, పర్యవేక్షిస్తున్నాం.. అని చెప్పడం తప్ప చర్యలు శూన్యమని పేర్కొన్నారు. అధికారుల తీరు తీవ్ర అసంతృప్తికి, ఆవేదనకు గురి చేస్తోందన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. వివిధ శాఖలతో ముడిపడి ఉన్న వ్యవహారం కాబట్టి కోర్టు ఆదేశాల అమలులో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమేనని తెలిపారు. 239 పాఠశాలల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు ప్రారంభించామని, 63 చోట్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. మిగిలినచోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. గుత్తేదారులకు 40 కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. మిగిలిన పనులకు 22 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు. నిర్మాణాలు పూర్తయితే సంబంధిత పాఠశాలలైనా వినియోగించుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు.

ఈ వాదనలపై న్యాయమూర్తి స్పందిస్తూ.. విద్యార్థులు చదువుకునే వాతావరణం చెడిపోకూడదనే ఉద్దేశంతో పాఠశాలల ప్రాంగణాల్లో ఇతర నిర్మాణాలు వద్దని ఆదేశాలిచ్చామని గుర్తుచేశారు. ఆ ఉత్తర్వుల జారీ తర్వాత కూడా సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు నిర్మించారని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ చేసినవి కాబట్టి అవి అక్రమ నిర్మాణాలేనని స్పష్టంచేశారు. ప్రభుత్వ ఖజానా నుంచి గుత్తేదారులకు సొమ్ము చెల్లించడం అక్రమమేనన్నారు. బాధ్యులైన అధికారుల నుంచి ఆ సొమ్మును రాబడతామని తేల్చిచెప్పారు. వివరణ ఇచ్చేందుకు ఈ నెల 22న తమ ముందు హాజరుకావాలని సీఎస్‌ను ఆదేశించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details