DEBTS IN AP: 2021 మార్చి నెల చివరి వరకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను విశ్లేషించిన కాగ్.. పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఏపీ అప్పుల పరిస్థితిపై పై కాగ్ గిరీష్ చంద్ర ముర్ము తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రిజర్వు బ్యాంకు కూడా అనేక అంశాలను తప్పుబట్టింది. ఆంధ్రప్రదేశ్కు అప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వివిధ బ్యాంకులను కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరించింది. రుణాలను భరించే సామర్థ్యం ఏపీకి లేదని.. రుణం తీసుకుని పాత అప్పులు తీరుస్తున్నారని కాగ్ ఆక్షేపించింది. తీసుకున్న రుణాలను ఆస్తుల సృష్టికి, అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించాలని.. రుణాలపై వడ్డీలు చెల్లించేందుకు, రోజు గడిచేందుకు అప్పు తీసుకోవడం ఆర్థిక అస్థిరతకు దారితీస్తుందని హెచ్చరించింది.
సరైన వ్యూహం లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలకు తగ్గనున్న నిధులు: 2020-21 ఆర్థిక సంవత్సరం చివరికి మొత్తం బకాయిలు జీఎస్డీపీలో 35 శాతానికి మించకూడదని ఎఫ్ఆర్బీఎమ్(FRBM) చట్టం చెబుతోందన్న కాగ్.. 2021 మార్చి 31 నాటికి అప్పులు 35.30శాతం ఉన్నాయని తేల్చింది. బడ్జెట్లో చూపించకుండా బయటి నుంచి తీసుకునే రుణాలనూ పరిగణిస్తే ఇది 44.04 శాతం అవుతుందని స్పష్టం చేసింది. 2021 మార్చి 31 నాటికి ఉన్న పరిస్థితుల ప్రకారం రాబోయే ఏడు సంవత్సరాలలో 45.74 శాతం అంటే.. లక్షా 23వేల 640 కోట్ల రూపాయల అప్పులు తీర్చాలని స్పష్టం చేసింది. దీనికి సరైన వ్యూహం లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తగ్గిపోతాయని రాష్ట్రాన్ని కాగ్ హెచ్చరించింది.
అప్పులు తీర్చేందుకే కొత్త రుణాలు:2019-20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ రుణాల్లో 71.71 శాతం మొత్తం పాత రుణాలు తీర్చేందుకే సరిపోయిందని.. 7.76శాతం నిధులు మాత్రమే ఆస్తుల సృష్టికి ఉపయోగించారని ఆందోళన వెలిబుచ్చింది. 2020-21 సంవత్సరంలో తీసుకున్న రుణాల్లో 77.12శాతం పాత అప్పులు తీర్చడానికి, 8.91శాతం మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేశారని చెప్పింది.
బడ్జెట్లో చూపకుండా పెద్ద మొత్తంలో రుణాలు: ప్రతి సంవత్సరం రాష్ట్ర అప్పులు పెరుగుతూనే ఉన్నాయన్న కాగ్.. రెవెన్యూ వ్యయాన్ని భరించేందుకు రుణాల మొత్తాన్ని ప్రభుత్వం వాడుకుంటోందని విశ్లేషించింది. తీసుకున్న రుణాల్లో 81శాతం రెవెన్యూ ఖర్చులకే వాడుతున్నందున.. ఆస్తుల కల్పనకు ఆటంకం కలుగుతున్నట్లు తెలిపింది. బడ్జెట్లో చూపకుండా పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంటూ.. మొత్తం అప్పులను ఏపీ తగ్గించి చూపుతోందని కాగ్ కుండబద్దలు కొట్టింది.
పీడీ ఖాతాలను తగ్గించాలి: పీడీ ఖాతాలకు పెద్ద మొత్తంలో నిధులు బదిలీ చేసినట్లు చూపుతున్నా.. నిధులు మాత్రం అక్కడ లేవు. దీని వల్ల సంబంధిత శాఖల సిబ్బంది ఖర్చు చేయడానికి కుదరడం లేదు. రాష్ట్రంలో భారీగా రెవెన్యూ లోటు కనిపిస్తుంటే, బడ్జెట్ కేటాయింపుల్లో మూడో వంతు మొత్తం పీడీ ఖాతాల్లో మిగిలిపోయినట్లు చూపుతున్నారని చెప్పింది. సంఘటిత నిధి నుంచి పీడీ ఖాతాలకు బదిలీ చేసి, వాస్తవంగా వాటిని ఖర్చు చేయడం లేదని తేల్చింది. వీటిపై శాసనపరమైన పరిశీలన లోపించిందని... బడ్జెట్ ప్రక్రియ పవిత్రతను కాపాడుకునేందుకు పీడీ ఖాతాలను తగ్గించడం అవసరమని కాగ్ తన నివేదికలో పేర్కొంది.
అది ఏపీ ఫైనాన్షియల్ కోడ్కు విరుద్ధం: రాష్ట్ర పథకాలు, కార్యకలాపాల అమలుకు పీడీ నిర్వాహకుల వద్ద నిధులను ఉంచడం... ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్కు విరుద్ధమని స్పష్టం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులు లేకుండానే 7 వ్యవహారాల్లో లక్షా 6 వేల 280 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని కాగ్ తప్పు బట్టింది. కేంద్ర పథకాలకు అందిస్తున్న నిధులను పీడీ ఖాతాలకు మళ్లించి, రాష్ట్ర ప్రభుత్వం సరిగా వినియోగించుకోవడం లేదన్న కాగ్.. దీనివల్ల కేంద్ర పథకాలు సరిగా అమలు కావట్లేదని పేర్కొంది.
కాగ్కు చెప్పని గ్యారంటీ రుణాల మొత్తం: ప్రభుత్వ గ్యారంటీతో తీసుకునే రుణాల అంశం రహస్యంగానే ఉంటోంది. గ్యారంటీ రుణాల మొత్తం ఎంతన్నది వెల్లడించబోమని, బడ్జెట్ పుస్తకాల్లోనే చెబుతామని సాక్షాత్తూ సీఎంకు ఆర్థికశాఖ కార్యదర్శిగా ఉన్నవారూ ప్రకటిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు గ్యారంటీ రుణాలు ఎన్ని తెచ్చారో కాగ్ ప్రతి నెలా అడుగుతున్నా.. ప్రభుత్వం మాత్రం సమాధానం చెప్పడం లేదు. 2021 డిసెంబర్ తర్వాత ఈ లెక్కలను నవీకరించలేదు. రుణాలు, కార్పొరేషన్ల ఖాతాలు, ఖర్చులపై లెక్కలు ఆడిట్ చేసి.. కంపెనీస్ ఆఫ్ రిజిస్ట్రార్ వద్ద సమర్పించిన దాఖలాలు లేవు.