ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP Leaders Protests Against Punganur Incident: పుంగనూరు ఘటనపై.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణుల ఆందోళనలు

By

Published : Aug 5, 2023, 5:25 PM IST

Updated : Aug 5, 2023, 8:24 PM IST

TDP Leaders Protests Against Punganur Incident: చంద్రబాబు పర్యటనలో వైసీపీ రాళ్ల దాడి ఘటనపై తెలుగుదేశం శ్రేణులు భగ్గుమన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, శ్రేణులు నిరసనలు చేపట్టాయి. వైసీపీ నాయకులు తీరును తీవ్రంగా తప్పుబట్టారు. నిరసనలు తెలుపుతున్న టీడీపీ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పలువురిని స్టేషన్​కు తరలించారు.

TDP_Leaders_Protests_Against_Punganur_Incident
TDP_Leaders_Protests_Against_Punganur_Incident

TDP Leaders Protests Against Punganur Incident: పుంగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుకునేందుకు.. వైసీపీ శ్రేణుల విఫలయత్న దాడిపై, టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్త నిరసనలకు దిగాయి. రాష్ట్రాభివృద్దిపై చంద్రబాబు చెబుతున్న వాస్తవాలను జీర్ణించుకోలేకే, మంత్రి పెద్దిరెడ్డి ఆదేశంతోనే వైసీపీ కార్యకర్తలు దాడులకు దిగారని ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డి అవినీతి-అక్రమాలు.. ప్రజలకు తెలియజేస్తామని టీడీపీ నేతలు ప్రతిజ్ఞ చేశారు. చంద్రబాబు సభలను అడ్డుకుంటే, తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు. టీడీపీ చేపట్టిన ఈ నిరసనల ర్యాలీలకు కొన్ని ప్రాంతాల్లో పోలీసులు వ్యాహాత్మకంగా అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసనలకు దిగిన టీడీపీ నేతలను కట్టడి చేసేలా వ్యవహరించారు. కొందరిని అదుపులోకి తీసుకోగా, మరికొందరిని నిరసనలకు దిగకుండా అడ్డుకున్నారు. అయితే, ఈ ఘటనలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అధికార పార్టీకి బానిసల్లా మారారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే, వైసీపీ తొత్తులుగా వ్యవహరించిన వారిపై చర్యలకు డిమాండ్ చేస్తామని టీడీపీ నేతలు అంటున్నారు.

చంద్రబాబు పర్యటనలో పుంగనూరు ఘటనను ఖండిస్తూ వైసీపీ అరాచక పాలన నశించాలంటూ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు బృందాలుగా ఏర్పడి విడతల వారీగా నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. మొదటగా అంబేద్కర్ సర్కిల్​లో నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వగా పోలీసులు అనుమతి లేదంటూ ఆంక్షలు విధించారు.

తెలుగుదేశం పార్టీ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి అంబిక లక్ష్మీనారాయణ, పట్టణ అధ్యక్షుడు డి రమేష్ కుమార్ ఇతర నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. దీంతో కొంతమంది టీడీపీ శ్రేణులు అంబేడ్కర్ కూడలి వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్​కు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. పోలీసులు ఆందోళన కారులను అదుపులోకి పోలీస్ స్టేషన్​కు తరలించారు.

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లకుంట అంజన్నప్ప ఆధ్వర్యంలో మరి కొంతమంది శ్రేణులు ఎన్టీఆర్ కూడలి వద్దకు చేరుకొని నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ కొనసాగించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన ర్యాలీని ఎన్టీఆర్ కూడలి నుంచి.. అంబేడ్కర్ కూడలి వరకు కొనసాగించి రోడ్డుపై బైఠాయించి ఆందోళన కొనసాగించారు. టీడీపీ శ్రేణులను పోలీసులు బలవంతంగా వాహనాలలో స్టేషన్​కు తరలించారు.

Tension at Punganur in Chandrababu Tour: రావణకాష్టంలా పుంగనూరు.. చంద్రబాబును అడ్డుకునేందుకు పోలీసుల యత్నం

TDP Leaders Fires on Punganur Incident: అనంతపురం జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులపై పోలీసులు ఆంక్షలు విధించారు. పుంగనూరులో టీడీపీ శ్రేణులపై రాళ్లదాడిని నిరసిస్తూ అనంతపురం జిల్లాల్లో శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చారు. పోలీసులు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు చేశారు. మాజీ మంత్రి పరిటాల సునీత.. చెన్నెకొత్తపల్లిలో నిరసన తెలపటానికి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా నిరసనలు తెలపటానికి వెళుతున్నామని చెప్పినా పోలీసులు వినకపోవటంతో పరిటాల సునీత జాతీయ రహదారిపై కార్యకర్తలతో కలిసి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై ఆమె మండిపడ్డారు.

రాష్ట్రంలో అరాచక పాలనకు పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన దాడులు నిదర్శనమని అనంతపురంలోని టీడీపీ బీసీ సెల్ నాయకులు అన్నారు. పుంగనూరులో వైసీపీ కార్యకర్తల దాడిని ఖండిస్తూ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉరవకొండలో టీడీపీ శ్రేణులు.. పార్టీ కార్యాలయం నుంచి నిరసన ర్యాలీ నిర్వహించారు. పెద్దిరెడ్డి నీకు రోజులు దగ్గర పడ్డాయి అనే పోస్టర్లతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్లాక్ టవర్ వద్ద ధర్నా నిర్వహించారు. పోలీసులు టీడీపీ శ్రేణులను అడ్డుకున్నారు.

Tension in annamaiya district: రణరంగంగా మారిన పుంగనూరు.. టీడీపీ శ్రేణులకు గాయాలు.. పలు వాహనాలు ధ్వంసం..

గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో: తెలుగుదేశం అధినేత చంద్రబాబు కాన్వాయ్ పై దాడిని నిరసిస్తూ విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ సర్కిల్ వద్ద నిరసన చేపట్టారు. రాళ్లు , కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారని, చివరకు ఎస్పీ సైతం వైసీపీకి వత్తాసు పలికారని ఆయన మండిపడ్డారు. వ్యవస్థలన్నింటినీ జగన్ మోహన్ రెడ్డి తన ఇష్టానుసారానికి వాడుకుంటున్నారని విమర్శించారు.

గత నాలుగేళ్ల నుంచి బాధితులపైనే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారన్నారు. చంద్రబాబు పర్యటన మూడు రోజులు ముందే జిల్లా ఎస్పీకి తెలుసని.. ఆయన పర్యటన ఉందని తెలిసినప్పటికీ ఎందుకు వైసీపీ నాయకులను జెండాలతో అనుమతించారని నిలదీశారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదని గద్దెరామ్మోహన్‌ తెలిపారు.

పలాసలో గౌతు శిరీష: రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని.. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష మండిపడ్డారు. వైసీపీకు ఓటమి తప్పదని తెలిసే.. ప్రతిపక్షాలను భయపెట్టాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పుంగనూరులో జరిగిన రాళ్ల దాడికి నిరసనగా.. శ్రీకాకుళం జిల్లా పలాసలో గౌతు శిరీష ర్యాలీకి పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయం వద్దకు సుమారు 30 మంది పోలీసులు చేరుకుని.. శిరీష నిరసనకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇంతలో డీఎస్పీ వచ్చి.. శిరీషతో మాట్లాడి.. ఒక్కరే నిరసన తెలిపేందుకు అనుమతిచ్చారు. అనంతరం ఆమె మహాత్మా గాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు పూల దండలు వేసి.. అక్కడ నిరసన తెలిపారు.

Chittoor SP Rishanth Reddy On Punganur Issue: 'పుంగనూరు ఘటనకు కారకులైన వారు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు'

చంద్రబాబు పర్యటనలో జరిగిన దాడిని ఖండిస్తూ కృష్ణా జిల్లా పామర్రులో టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. టీడీపీ శ్రేణుల చేతుల్లో ఉన్న మంత్రి పెద్దిరెడ్డి ఫొటోలను పోలీసులు లాక్కునే ప్రయత్నం చేయగా ప్రతిఘటించారు. అంతకుముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పామర్రు టౌన్ వీధుల్లో టీడీపీ ఇంఛార్జి వర్ల కుమార్ రాజా ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు.

చంద్రబాబు కాన్వాయ్ పై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అరాచక శక్తులకు టీడీపీ బయపడే ప్రసక్తే లేదని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం అన్నారు. పుంగనూరులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో కొందరు దాడికి ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి మచ్చ అన్నారు.

Chandrababu Fires on Minister Peddireddy: ఈ రోడ్డు మీ తాత జాగీరా.. పుంగనూరుకు మళ్లీ వస్తా: చంద్రబాబు

టీఎన్​ఎస్​ఎఫ్ నిరసన:సత్యసాయి జిల్లా హిందూపురంలో టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థి విభాగ ఆధ్వర్యంలో వాల్మీకి కూడలి వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డికి, ముఖ్యమంత్రి జగన్​కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. పోలీసులు టీఎన్ఎస్ఎఫ్ నాయకులను అదుపులోకి తీసుకొని స్టేషన్​కు తరలించారు. అయితే అధికార వైసీపీ చేపట్టిన ర్యాలీని పోలీసులు ముందుండి నడిపించడం విమర్శలకు దారితీస్తోంది. అంబేద్కర్ కూడలి వద్ద ఒకటో పట్టణ సీఐ వైసీపీ కార్యకర్తల్లో కలిసిపోయి దగ్గరుండి కార్యక్రమాన్ని వీక్షించడం విడ్డూరంగా మారింది.

ప్రతిపక్ష పార్టీకి అనుమతి నిరాకరణ.. అధికార పార్టీకి దగ్గరుండి ర్యాలీ జరిపించడం ఎంతవరకు సమంజసం అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పెనుకొండలోని అంబేడ్కర్ కూడలిలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు టీడీపీ శ్రేణులను బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించారు.

TDP leaders fire on Minister Peddireddy: చంద్రబాబు పర్యటనలతో దిక్కుతోచని వైసీపీ.. అల్లర్ల వెనుక ఉద్దేశం అదే : టీడీపీ

TDP Leaders Protests Against Punganur Incident: పుంగనూరు ఘటనపై.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణుల ఆందోళనలు
Last Updated : Aug 5, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details