అనంతపురం జిల్లా హిందూపురం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. సడలింపులతో కూడిన లాక్ డౌన్ పర్యవేక్షణ ఎలా కొనసాగుతుందో అడిగి తెలుసుకున్నారు. విధినిర్వహణలో పోలీస్ సిబ్బంది కరోనా వైరస్ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సమావేశంలో చర్చించారు. ఫిర్యాదుల కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చేవారిని ఏ విధమైన జాగ్రత్తలు తీసుకొని లోపలికి రానివ్వాలో సూచించామన్నారు. నిత్యావసరాలకు మినహా ప్రజలెవరూ బయటకు రాకూడదని పేర్కొన్నారు. పని లేక పోయినా బయట తిరిగే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.
హిందూపురం పట్టణంలో కంటోన్మెంట్ జోన్లుగా కొనసాగుతున్న ప్రాంతాలలో ఏ విధమైన భద్రత చర్యలు చేపట్టాలో చర్చించామని ఎస్పీ తెలిపారు. కంటైన్మెంట్ జోన్లలో ఎలాంటి లాక్ డౌన్ సడలింపులు ఉండవని వారికి కావాల్సిన నిత్యావసర సరకులు వారి ఇంటి వద్దకే వచ్చేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. మిగిలిన ప్రాంతాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే సడలింపులు ఉంటాయని స్పష్టం చేశారు. ఆపై రోడ్డుమీద తిరిగే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.