స్వయం సహాయక మహిళా సంఘాల పొదుపు డబ్బులపై ..కొంతమంది కన్నేశారు. వారు నిరాక్ష్యరాసులు అవడంతో..వేలిముద్రలతో లక్షలు లక్షలు కాజేస్తున్నారు. ఇంత డబ్బు మాయమవుతున్నా జిల్లా యంత్రాంగం పట్టించుకోవట్లేదు. కూలీలకు వెళ్లి డబ్బులు కడుతున్నామని తమకి న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే... మహిళా పొదుపు సంఘాలు ఇటీవల అభివృద్ది చెందాయి. రోజూ రూపాయి చొప్పున రాష్ట్రంలో మొదలైన పొదుపు ఉద్యమం లక్షల రూపాయల రుణాలు తీసుకొని వ్యాపారాలు చేసే స్థాయికి మహిళలు ఎదిగారు. పొదుపు ఉద్యమం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందగా... ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వారికి సొంతమయ్యాయి.
కానీ.. చదువురాని నిరుపేద మహిళలను నిలువునా మోసం చేస్తూ కొందరు వారి కష్టాన్ని దోచుకుంటున్నారు. డీఆర్డీఏ సిబ్బంది చేసే మోసాలు అనంతపురం జిల్లాలో అనేకం వెలుగుచూస్తున్నాయి. తమ పేర్లతో లక్షల రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలు కొట్టేశారని గ్రామీణ ప్రాంతాల్లోని పొదుపు మహిళలు కన్నీటి పర్యంతమవుతున్నారు.
అనంతపురం జిల్లాలో 1851 గ్రామ ఐక్య పొదుపు సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లోని మహిళలు ప్రతినెలా కొంత మెత్తం పొదుపు చేసుకుంటే, దానికి సరిపడా మొత్తాన్ని బ్యాంకులు పావలా వడ్డీకి రుణం ఇస్తాయి. గ్రామ ఐక్య సంఘంలో 20 నుంచి 50 వరకు ఆ గ్రామంలో మహిళల జనాభానుబట్టి పొదుపు సంఘాలు ఉంటాయి. ప్రతి సంఘంలో పది మంది మహిళలు గ్రూప్గా ఉండి, అందరూ సంయుక్తంగా బ్యాంకు ఖాతా నిర్వహిస్తుంటారు.