ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Farmers on Cheeni Crop Prices: దళారుల అవతారం ఎత్తిన వ్యాపారులు.. నోటిమాటతోనే ధర నిర్ణయం.. లబోదిబోమంటున్న 'చీనీ' రైతులు

By

Published : Jun 24, 2023, 1:37 PM IST

Cheeni Crop Price Issue in Anantapur: శ్రమనే పెట్టుబడిగా పెట్టి పంట పండించిన రైతుల్ని దోచుకోవడమే అధికారంలో ఉన్నవారి పనిగా కనిపిస్తోంది. కర్షకుడి కష్టాన్ని ఎన్ని రకాలుగా దోచుకోవచ్చో.. అన్ని విధానాలనూ అనుసరిస్తున్నారు. తాజాగా అనంతపురం పండ్ల మార్కెట్‌ యార్డులో.. వ్యాపారులే దళారుల అవతారం ఎత్తారు. రైతులు తీసుకొచ్చిన చీనీ పంటకు.. వేలం లేకుండా ధర నిర్ణయిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధరలతో సంబంధం లేకుండా.. కేవలం నోటి మాటలతో ఇష్టమొచ్చిన ధరలు చెబుతున్నారు.

Cheeni Crop Price Issue in Anantapur
Cheeni Crop Price Issue in Anantapur

Cheeni Crop Price Issue in Anantapur: అనంతపురం పండ్ల మార్కెట్ యార్డులో మండీ వ్యాపారులే దళారుల అవతారం ఎత్తారు. రైతులు తీసుకొచ్చిన చీనీ పంటకు వేలం లేకుండా ధర నిర్ణయిస్తున్నారు. పంట అమ్మితే కనీసం పెట్టుబడి రావడం లేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇవాళ ఉదయం మండీ వ్యాపారులను రైతులు నిలదీశారు. అధిక ధరలకు అమ్ముకోవాలని మార్కెట్​కు వస్తే ఇక్కడ మాత్రం మండీ వ్యాపారులు, ఇతర రాష్ట్ర వ్యాపారులను రానీయకుండా ధర నిర్ణయించడం ఏంటని ప్రశ్నించారు. కేవలం మండీ నిర్వహిస్తున్న వారు ధర ఏ విధంగా నిర్ణయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురి మధ్య వాదన చెలరేగి.. ధరలు నిర్ణయించడాన్ని అరగంట పాటు ఆపేశారు.

ఈ క్రమంలో అనంతపురం పండ్ల మార్కెట్లో మండీ వ్యాపారులు.. తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి మార్కెట్​కు పండ్లను తీసుకువస్తే ఇక్కడ మండీ వ్యాపారులు ఒక సిండికేట్​గా మారి బయట వ్యాపారులను రానీయకుండా తక్కువ ధరను నిర్ణయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధరలతో సంబంధం లేకుండా... కేవలం నోటి మాటలతో ఇష్టమొచ్చిన ధరలు చెబుతున్నారని మండిపడుతున్నాకు. మార్కెట్‌లో టన్ను చీనీ ధర 40 వేలు నడుస్తుండగా అనంతపురం పండ్ల మార్కెట్‌లో మాత్రం కేవలం 12 వేలు, 13 వేలు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇతర రాష్ట్రాల వ్యాపారులను మార్కెట్‌లోకి రాకుండా మండి వ్యాపారులు అడ్డుకుంటున్నారని రైతులు ఆరోపించారు. దీంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్​లో నుంచి రైతులు వెళ్లిపోయిన తర్వాత బయట వ్యాపారులను పిలిపించి ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. దీనిపైన జిల్లా కలెక్టర్ విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. మార్కెట్ యాడ్ చైర్మన్ ఒక్క రోజు కూడా రైతులు బాధలు వినిన పాపాన పోలేదన్నారు. కేవలం వ్యాపారస్తులు లాభపడేలా, రైతులు నష్టపోయేలా మార్కెట్లో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకొని రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

"మూడు ఎకరాల్లో చీనీ చెట్లు నాటుకున్నాము. అవి అమ్ముకోడానికి మార్కెట్​కు తీసుకొచ్చాం. మొన్నటివరకూ టన్ను చీనీ ధర 40వేలు, 50వేల రూపాయలు ఉంటే.. ఈరోజు 14వేలు అంటున్నారు. ఇక్కడికి పండ్లు తీసుకురావాలంటే రవాణా ఖర్చు 10వేల అవుతోంది. మేము పెట్టిన పెట్టుబడి ఏంటో మాకు తెలుసు. బయట ఉన్న రేటుకు చీనీలను కొనకుండా తమకు నచ్చిన రేట్లు వేస్తున్నారు."-రైతులు

ABOUT THE AUTHOR

...view details