ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Bogus Votes in AP: ఇబ్బడిముబ్బడిగా బోగస్‌ ఓట్లు.. ఏ బూత్​ చూసినా అవే

By

Published : Jun 21, 2023, 8:46 AM IST

Fake Votes in AP: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండంతో ఇబ్బడిముబ్బడిగా దొంగ ఓట్లు చేర్చుతున్నారు. ఒక్కో నియోజకవర్గంలో వేలకు వేలు ఓట్లు పుట్టుకొస్తున్నాయి. ఒకే ఇంటి నెంబర్‌ పేరుతో వందకు పైగా ఓట్లు ఉన్న దాఖలాలు వెలుగుచూస్తున్నాయి. వైసీపీ సానుభూతిపరులు, వాలంటీర్ల పేరిట రెండు, మూడేసి ఓట్లు ఉంటుండగా.. అదే సమయంలో విపక్షాలకు చెందిన వారి ఓట్లు గల్లంతవ్వడం ఆందోళన కలిగిస్తోంది.

Fake Votes in AP
Fake Votes in AP

ఇబ్బడిముబ్బడిగా బోగస్‌ ఓట్లు.. ఏ బూత్​ చూసినా అవే

Fake Votes in AP: రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో భారీగా దొంగ ఓట్లు నమోదవుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం కీలక నేతలు ఉన్న నియోజకవర్గాల్లో మరింత ఎక్కువగా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఏ బూత్‌లో చూసినా దొంగఓట్లు ఇబ్బడిముబ్బడిగా చేర్చారు. నియోజకవర్గంలో వేలల్లో బోగస్‌ ఓట్లున్నా అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గ్రామ, వార్డు వాలంటీర్లు, వైసీపీ నాయకుల కుటుంబసభ్యులకు రెండు, మూడేసి ఓట్లున్నాయి. అదే సమయంలో విపక్షాల సానుభూతి ఓటర్లకు సమాచారం ఇవ్వకుండా ఓటు హక్కు తీసేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ‘ఈటీవీ-ఈటీవీ భారత్​’ పరిశీలించగా బోగస్‌ ఓట్ల బాగోతం వెలుగులోకి వచ్చింది.

టీడీపీ సానుభూతిపరులైతే చాలు నోటీసులు లేకుండానే తొలగింపు: నర్సీపట్నం నియోజకవర్గంలో చనిపోయిన, డబుల్‌ ఎంట్రీలు, శాశ్వత వలసలు, బోగస్‌, ఊరితో సంబంధం లేని ఓట్లు మొత్తంగా 17వేల 401 జాబితాలో దర్శనమిస్తున్నాయి. ఈ ఓట్లపై గత సంవత్సరం ఫిర్యాదులందినా 2వేల 443 ఓట్లు మాత్రమే తొలగించారు. ఈ తొలగించిన ఓట్లలో చనిపోయినవారివే అధికంగా ఉన్నాయి. వైసీపీ నాయకులు, వాలంటీర్లకు రెండేసి ఓట్లు ఉన్నట్లు దృష్టికి వచ్చినా తొలగించట్లేదు. ఇక టీడీపీ సానుభూతిపరుల ఓట్లపై ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా నోటీసులు ఇవ్వకుండానే తొలగించేస్తున్నారు. నర్సీపట్నంలో ఉంటున్న సుర్ల గంగునాయుడు వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి రెండు ఓట్లు ఉండగా..పెట్ల అచ్చియ్యనాయుడికి మూడు ఓటరు గుర్తింపు కార్డులతో, మూడు పోలింగ్‌ బూత్‌లలో ఓటు హక్కు ఉంది. చోడవరం నియోజకవర్గంలోని రోలుగుంటలో రొంగల అనంతలక్ష్మి భాస్కర్‌కు రెండేసి ఓట్లు ఉన్నాయి.

వారికేమో రెండేసి ఓట్లు.. వారివి పెద్దసంఖ్యలో తొలగింపు: వైసీపీ సానుభూతిపరులకు రెండేసి ఓట్లు ఉండగా.. విపక్షాలకు చెందిన వారి ఓట్లు పెద్ద సంఖ్యలో తొలగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గత సర్పంచ్‌ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్న చాలామంది ఓట్లు ఇప్పుడు ఓటర్‌ జాబితాలో కనిపించడం లేదు. ఎలాంటి సమాచారం, నోటీసులు ఇవ్వకుండానే ఓట్లు తొలగించేస్తున్నారు. ఉపాధి కోసం తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి ఓట్లను జాబితా నుంచి తీసివేస్తున్నారు. బోగస్‌ ఓట్లపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు గతేడాది డిసెంబరులో ఆర్డీవోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. బోగస్‌ ఓట్లపై క్షేత్రస్థాయిలో విచారణ చేసి తొలగిస్తున్నామని.. త్వరలో బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత.. అభ్యంతరకర ఓట్లుంటే తొలగిస్తామని ఆర్డీవో జయరాం తెలిపారు. సామాన్యుల ఓట్లే కాదు.. గత పురపాలక ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీ చేసిన అభ్యర్థుల ఓట్లు తొలగించడం విశేషం.

Votes Deletion Across the State: విపక్షాల ఓట్లు తొలగిస్తున్న అధికారులు.. వైసీపీ సానుభూతిపరులకు మాత్రం రెండు ఇంటిపేర్లతో రెండేసి ఓట్లు నమోదు చేస్తున్నారు. వివాహమై అత్తాంటికి వెళ్లగా అక్కడ కొత్త ఇంటిపేరుతో కొత్తగా ఓటుహక్కు కల్పించినా.. గతంలో తల్లిగారి ఇంటిపేరిట ఉన్న ఓటు మాత్రం తొలగించడం లేదు. రెండు ఇంటిపేర్లతో రెండు ఓట్లు అలాగే ఉంచుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details