ఆంధ్రప్రదేశ్

andhra pradesh

pepper crop in manyam: మన్యంలో కాసులు కురిపిస్తున్న మిరియాలు...

By

Published : Sep 19, 2022, 8:17 AM IST

Pepper crop

Pepper crop: సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన మిరియాలకు ప్రపంచ దేశాల్లో గిరాకీ ఉంది. కాఫీలో అంతరపంటగా విశాఖ మన్యానికి పరిచయమైన ఈ మిరియాలు గిరిజనులకు లాభాలను ఆర్జించిపెడుతున్నాయి. ప్రధాన పంట అయిన కాఫీకంటే రెట్టింపు లాభాలను ఈ పంట ద్వారా పొందుతుండటంతో రైతులు మిరియాల సాగుపై ఆసక్తి కనపరుస్తున్నారు. కేంద్ర కాఫీ బోర్డు, ఐటీడీఏలు కాఫీ తోటల్లో అంతరపంటగా మిరియాల సాగును ప్రోత్సహిస్తున్నాయి.

Pepper crop in AP: ప్రపంచవ్యాప్తంగా మిరియాల సాగు, విస్తీర్ణం, వినియోగం, ఎగుమతుల్లో భారత దేశం మొదటి స్థానంలో ఉంది. సంప్రదాయ సాగు ప్రాంతాలైన కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో వీటి ఉత్పత్తి అధికంగా ఉంది. సంప్రదాయేతర ప్రాంతం అయినా అల్లూరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులు, నేల, శీతల వాతావరణం వంటివి అనుకూలంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చింతపల్లి, గూడెంకొత్తవీధి, పాడేరు, అరకు, అనంతగిరి వంటిప్రాంతాల్లో కాఫీలో అంతరపంటగా మిరియాల సాగు జరుగుతోంది.

ప్రస్తుతం మన్యంవ్యాప్తంగా 1.56 లక్షల ఎకరాల్లో కాఫీ సాగు జరుగుతుండగా అందులో అంతరపంటగా మిరియాలు 50 వేల ఎకరాల్లో వేస్తున్నారు. ఏటా 3,300 మెట్రిక్‌ టన్నుల మిరియాల ఉత్పత్తి జరుగుతోంది. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏటా ఉద్యాన నర్సీరీల ద్వారా 9లక్షల మిరియాల మొక్కలను సిద్ధం చేసి గిరిజన రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

*కేజీ కాఫీ గింజల ధర మార్కెట్‌లో రూ. 100 వరకూ ఉంటే అదే కేజీ మిరియాల ధర రూ. 500 వరకూ ఉంది. ప్రధాన పంట అయిన కాఫీ కంటే నాలుగైదు రెట్లు ధరలు పలుకుతుండటంతో రైతులూ క్రమేణా మిరియాల సాగుపట్ల ఆసక్తి పెంచుకున్నారు.

*ఎకరా విస్తీర్ణంలో కాఫీతోటల ద్వారా 150 కేజీల కాఫీని ఉత్పత్తి చేస్తున్నారు. అదే తోటల్లో అంతరపంటగా వేసిన మిరియాల వల్ల వంద కేజీల దిగుబడి వస్తోంది. అంటే సగటున ఎకరాకు ఒక్కో రైతుకు కాఫీ వల్ల ఏడాదికి రూ.15,000, మిరియాల వల్ల రూ. 50వేల వరకూ ఆదాయం వస్తోంది. కాఫీ తోటల్లో అంతర పంటలుగా మిరియాలతోపాటు కమలా, నేరేడు, సీతాఫలం, జాఫ్రా, అనాసపనస వంటివి పండిస్తున్నారు. ఇవి కాఫీ తోటలకు ఇటు నీడనిస్తూనే రైతులకు ఉద్యాన ఫలాలను అందిస్తున్నాయి.

ప్రభుత్వ ప్రోత్సాహం..

మన్యంలో కాఫీ సాగుకు సంబంధించి గత ప్రభుత్వం పదేళ్ల కాల వ్యవధితో కూడిన భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దీనికోసం గిరిజన ఉపప్రణాళిక ద్వారా రూ.526.160 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. 2015-2016లో మొదలైన ఈ ప్రాజెక్టు కాలపరిమితి 2024-2025 వరకూ అమల్లో ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 1.50 లక్షల ఎకరాల్లో కాఫీ సాగుకు అదనంగా వచ్చే ఐదేళ్లలో మరో లక్ష ఎకరాల్లో కాఫీ తోటల విస్తరణ లక్ష్యంగా ప్రాజెక్టు అమలవుతోంది. కాఫీతోపాటు అనుసంధానంగా అంతరపంట అయిన మిరియాల సాగునూ ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా ఏడాదికి పదివేల ఎకరాల చొప్పున కాఫీ తోటలను విస్తరించుకుంటూ వెళుతున్నారు.

జాతీయ ఉద్యాన మిషన్‌ సహకారంతో..
కేరళలోని కాలికట్‌లో అఖిల భారత సుగంధ ద్రవ్య పరిశోధనా కేంద్రం ఉంది. చింతపల్లి కేంద్రంగా ప్రత్యేకంగా సుగంధ ద్రవ్య పంటలపై పరిశోధనల నిమిత్తం ఉద్యాన పరిశోధనా స్థానం పనిచేస్తోంది. దీని పరిధిలో సుగంధ ద్రవ్య సమన్వయ పరిశోధనా పథకాన్ని అమలు చేస్తున్నాం. ఇందులో భాగంగా మిరియాల్లో కొన్ని మేలురకాలను గుర్తించి వాటిని అభివృద్ధిపర్చి రైతులకు అందిస్తున్నాం.

మిరియాల్లో 17 రకాలు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మన్యానికి అనుకూలమని అధిక దిగుబడిని ఇచ్చేవిగా గుర్తించి వాటిని సిఫార్సు చేస్తున్నాం. పన్నియూర్‌-1, 2, 3, 5, 6, 7, 8, 9 రకాలతోపాటు శ్రీకర, శుభకర, పంచమి, పౌర్ణమి, మలబారు ఎక్సెల్‌, శక్తి, గిరిముండా, ఐఐఎస్‌ఆర్‌ దీపమ్‌, ఐఐఎస్‌ఆర్‌ శక్తి వంటి రకాలను మేలైనవిగా గుర్తించాం. - డాక్టర్‌ శివకుమార్‌, పరిశోధనా స్థానం శాస్త్రవేత్త

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details