ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Gold Fraud: దుబాయ్ గోల్డ్ తక్కువ ధరకే.. ఫేస్​బుక్​లో ప్రకటన.. ఆ తర్వాత?

By

Published : Nov 4, 2021, 5:12 PM IST

బంగారం తక్కువ ధరంటే చాలు.. అదెలా అనే చిన్న లాజిక్ పక్కన పెట్టేసి ఎగబడిపోతారు కొందరు. వీరి అత్యాశే.. మరికొందరికి అవకాశంగా మారుతోంది. పోలీసులు ఎన్నిసార్లు అలెర్ట్ చేసినా ఫలితం ఉండడం లేదు. దుబాయ్ బంగారం తక్కువ ధరకే వస్తుందనే ఆశ కల్పించి కొల్లగొడుతున్న గ్యాంగ్​ను కాచిగూడ పోలీసులు అరెస్టు(Gold Fraud Gang Arrested by Hyderabad Police) చేశారు. సినిమా కథను తలపించే ఆ గ్యాంగ్ మోసాలను పోలీసులు(Hyderabad CP Anjani Kumar) కళ్లకు కట్టారిలా..

Gold Fraud
Gold Fraud

తక్కువ ధరకే బంగారం బిస్కెట్లు ఇస్తామంటూ రూ.లక్షలు కొల్లగొడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను కాచిగూడ పోలీసులు బుధవారం అరెస్ట్‌(Gold Fraud Gang Arrested by Hyderabad Police) చేశారు. నలుగురు నిందితులు మహ్మద్‌ రఫీక్‌, బింగి శ్రీనివాస్‌, రెడ్డిపాండురంగారావు, ఎం.అన్వేష్‌ కుమార్‌ల నుంచి రూ.20 లక్షల నగదు, నకిలీనోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌(Hyderabad CP Anjani Kumar) వెల్లడించారు.

దిల్లీ, ముంబయిలో ఉంటున్న వికాస్‌గౌతమ్‌, అమిత్‌పటేల్‌ పరారీలో ఉన్నారని వివరించారు. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ఈ ముఠా సభ్యుల పై 50కిపైగా కేసులున్నాయి. కర్ణాటకకు చెందిన మహ్మద్‌ రఫీక్‌, జగిత్యాల జిల్లా వాసి బింగి శ్రీనివాస్‌, పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన రెడ్డివారి పాండురంగారావు, మంచిర్యాలో ఉంటున్న అన్వేష్‌కుమార్‌లు పదేళ్ల క్రితం వేర్వేరు సందర్భాల్లో పరిచయమయ్యారు. మొదట బంగారం ప్రకటనలు చూసి వీరు మోసపోయారు. దీంతో మనమే మోసం చేద్దామని నిర్ణయించుకున్నారు.

కిలో బంగారంపై రూ. 5 లక్షలు తగ్గింపు

దుబాయ్‌(Dubai Gold) నుంచి నాణ్యమైన బంగారం తెప్పిస్తున్నామని తక్కువ ధరకే బిస్కెట్లు ఇస్తామంటూ మహ్మద్‌ రఫీక్‌ బృందం ఫేస్‌బుక్‌లో ప్రకటనలు ఇవ్వడం మొదలు పెట్టింది. దిల్లీకి చెందిన వికాస్‌గౌతమ్‌, ముంబయి వాసి అమిత్‌పటేల్‌ నమ్మి డబ్బుతో హైదరాబాద్‌కు వచ్చారు.

వీరి వద్ద బంగారం లేదని, మోసం చేస్తున్నారని గ్రహించారు. వారిని ప్రశ్నించగా మీరూ మాతో కలవండి అంటూ చెప్పారు. వికాస్‌ గౌతమ్‌, అమిత్‌పటేల్‌ ఫేస్‌బుక్‌లో ప్రకటనలు ఇస్తూ ఆకర్షించేవారు. వారితో మాట్లాడి కిలో బంగారం బిస్కెట్లు కొంటే మార్కెట్‌ ధర కంటే రూ.5లక్షలు తక్కువకే ఇస్తామంటూ చెప్పేవారు.

నైలాన్‌ సంచి.. నకిలీ కరెన్సీ..

బంగారు బిస్కెట్లు(Dubai Gold) కొనేవారి వద్దకు మహ్మద్‌ రఫీక్‌, శ్రీనివాస్‌, పాండురంగారావు, అన్వేష్‌ వెళ్తారు. నైలాన్‌ సంచి, నకిలీ కరెన్సీ కట్టలు, సూట్‌కేస్‌ తీసుకెళ్తారు. సూట్‌కేస్‌ను రెండు అరలుండేలా తయారు చేయించారు. బాధితుడి వద్దకు వెళ్లగానే నగదు చూపించాలని, దానిని తాము తెచ్చిన నైలాన్‌ సంచిలో భద్రపరిచి తాళం వేయాలని, ఒక తాళం బాధితుడు, మరో తాళం మా వద్ద ఉంటుందని చెబుతారు.

నగదు తీసుకున్నాక నైలాన్‌ సంచిలో నోట్ల కట్టలు పెట్టి దానికి తాళం వేస్తారు. తర్వాత సంచిని సూట్‌కేస్‌లోని పై అరలో పెట్టేస్తారు. సూట్‌కేస్‌ను బాధితుడికి అప్పగించాక బంగారం తెస్తామంటూ నటిస్తారు. ఒక నిందితుడు రూం తాళం పడిపోయింది.. బంగారం బిస్కెట్లు తెచ్చేందుకు ఆలస్యమవుతుందని బాధితుడి దృష్టి మళ్లించి సూట్‌కేస్‌ను కిందికీపైకి మార్చేస్తాడు.

బాధితుడు ఇచ్చిన నగదున్న సంచిని తీసుకుని నకిలీ కరెన్సీతో ఉన్న నైలాన్‌ సంచిని ఇచ్చేస్తాడు. గంటలో వస్తామంటూ వెళ్లిపోతారు. నెల క్రితం కాచిగూడలో ఉంటున్న అబ్దుల్‌ అఫ్రోజ్‌ వీరితో ఫోన్‌లో కిలో బంగారం రూ.40 లక్షలకు ఇస్తామంటూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈక్రమంలోనే అబ్దుల్‌ ఇంటికి వెళ్లి సూట్‌కేస్‌ మార్పిడి చేసి రూ.40 లక్షలు కొట్టేశారు.

ఒక్కో నేరస్థుడు.. ఒక్కో నేపథ్యం..

బంగారం బిస్కెట్లు తక్కువ ధరకే ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఒక్కో నేరస్థుడికి ఒక్కో నేపథ్యం, నేరచరిత ఉంది. ఉత్తర కర్ణాటకలోని సిర్సికి చెందిన రఫీక్‌(45) ముస్లిం కుటుంబంలో జన్మించాడు. తరువాత రెడ్డిగా మార్చుకున్నాడు. సెకెండ్‌ హ్యాండ్‌ కార్ల వ్యాపారిగా చలామణి కాసాగాడు. నౌకర్‌సాబ్‌ అనే మరో వ్యక్తితో కలిసి బెదిరింపులు, వసూళ్లకు పాల్పడడంతోపాటు సిర్సి, హుబ్లి ప్రాంతాల్లోని అడవుల్లో గంధపు చెట్లనూ విక్రయించేవాడు. ఏడాది క్రితం అతడిపై కేసు నమోదైంది. అతడి బృందంలోని ఇతర సభ్యుల వివరాలివీ..

బింగి శ్రీనివాస్‌..

జగిత్యాల జిల్లా శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన బింగి శ్రీనివాస్‌(55) కొన్నేళ్లు సొంతూరులో ఉన్నాక ముంబయికి వెళ్లాడు. స్థానికంగా చిన్నాచితకా వ్యాపారాలు చేశాక తెలుగువారు అధికంగా నివసించే భివాండి చేరుకున్నాడు. అక్కడ ప్రస్తుతం స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు. ముంబయిలో ఉంటున్న అమిత్‌పటేల్‌ అలియాస్‌ గుజ్జర్‌తో అతడికి స్నేహం ఉంది.

రెడ్డి పాండురంగారావు...

ఆల్విన్‌ కాలనీ, కూకట్‌పల్లిలో నివసిస్తున్న రెడ్డి పాండురంగారావు అలియాస్‌ పాండు (53) తొమ్మిదేళ్లుగా రఫీక్‌తో స్నేహం కొనసాగిస్తున్నాడు. బంగారం తక్కువ ధర మోసాలతోపాటు ఇతర కేసుల్లోనూ నిందితుడు. ఎనిమిదేళ్లలో ఇతడిపై యాభైకి పైగా కేసులు నమోదయ్యాయి. ఏపీలోని పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, సామర్లకోట, విశాఖపట్నం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, పెనుగొండ తదితర ప్రాంతాల్లోనూ నేరాలకు పాల్పడ్డాడు. రఫీక్‌ బృందంతో పాటు సమాంతరంగా ముఠా ఏర్పాటు చేసుకున్నాడు. తాటికాయల రమేష్‌, దాసరి ఆంజనేయులు, నల్లశ్రీను, దుర్గాప్రసాద్‌తో కలిసి నేరాలు చేశాడు.

మాల్రాజ అన్వేష్‌ కుమార్‌...

మంచిర్యాలకు చెందిన అన్వేష్‌ కుమార్‌ అలియాస్‌ కిరణ్‌(32) అక్కడే ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ చెప్పిన కొందరు వ్యక్తులను నమ్మి రూ.లక్షలు పోగొట్టుకున్నాడు. అనంతరం ఫేస్‌బుక్‌ ద్వారా అమిత్‌ పరిచయమవడంతో.. రెండు, మూడేళ్ల నుంచి అతడితో స్నేహం కొనసాగిస్తూ రఫీక్‌ బృందంలో సభ్యుడయ్యాడు. బంగారం బిస్కెట్లు కావాలంటూ ఫోన్‌చేసిన వ్యక్తులకు వద్దకు బింగిశ్రీనివాస్‌, పాండులతో కలిసి వెళ్లేవాడు. బాధితుడి దృష్టి మళ్లించేవాడు.

బీ అలెర్ట్.. మీ పరిసరాల్లోనూ ఇటువంటి గ్యాంగ్​లు తిరుగుతూనే ఉండి ఉండొచ్చు! వారి మాటల వలలో మిమ్మల్ని బంధించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉండొచ్చు! ఎవరైనా తక్కువ ధరకే అంటే.. అదెలా అనే లాజిక్ మిస్ కాకండి. అసలు వారితో మాట్లాడే ప్రయత్నమే చేయకండి. అత్యాశకు పోకండి.. ఓ సారి ఆలోచించండి... ఏమైనా సందేహమొస్తే వెంటనే పోలీసులను సంప్రదించండి.

ఇదీ చదవండి

Lady constable suicide: మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య..ఏమైంది..?

Cheating: ఆరేళ్లలో రెట్టింపు చేస్తామని... రూ.10కోట్ల మేర టోకరా

ABOUT THE AUTHOR

...view details