ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జీవీఎంసీ పూర్వ కమిషనర్‌ హరినారాయణ్‌కు 3 నెలల జైలుశిక్ష

By

Published : May 14, 2022, 9:53 PM IST

Updated : May 15, 2022, 3:09 AM IST

హైకోర్టు

21:48 May 14

కోర్టు ధిక్కరణ కేసులో జైలుశిక్ష, జరిమానా విధించిన హైకోర్టు

High Court on GVMC Farmer Commissioner: కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ వీధి వ్యాపారులను ఖాళీ చేయించిన వ్యవహారంలో జీవీఎంసీ పూర్వ కమిషనర్ ఎం. హరినారాయణ్‌కు హైకోర్టు 3 నెలల జైలుశిక్ష, రూ. 2 వేల జరిమానా విధించింది. పెదగంట్యాడ కూడలి వద్ద బీసీ రోడ్డులో తమ సంఘ సభ్యులు నిర్వహిస్తున్న 70 దుకాణాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారని పెదగంట్యాడ కాయగూరలు, చిల్లర వ్యాపారుల సంఘం ఉపాధ్యక్షురాలు కె.కౌసల్య 2017లో హైకోర్టును ఆశ్రయించారు. తమకు వీధివ్యాపారుల గుర్తింపు కార్డులు ఉన్నాయని.. పన్నులు చెల్లిస్తున్నామన్న పిటిషనర్.. అధికారుల జోక్యాన్ని నిలువరించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ నేపథ్యంలో చట్ట నిబంధనలను అనుసరించకుండా పిటిషనర్ సంఘ విషయంలో జోక్యం చేసుకోవద్దని కార్పొరేషన్ అధికారులను హైకోర్టు ఆదేశించింది.

అయితే ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ అధికారులు చిల్లర దుకాణాలు, బడ్డీ కొట్టులను ధ్వంసం చేశారని.. జీవనాధారాన్ని దెబ్బతీశారని 2018లో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారించిన హైకోర్టు.. కోర్టు ధిక్కరణకు అప్పటి కమిషనర్ హరి నారాయణ్‌ను బాధ్యునిగా పేర్కొంటూ 3 నెలల జైలుశిక్ష, రూ. 2 వేల జరిమానా విధించింది. అప్పీలుకు వీలు కల్పిస్తూ తీర్పును 6 వారాలు నిలుపుదల చేసింది. అప్పీల్ దాఖలు చేయకపోయినా.. అప్పీల్లో స్టే రాకపోయినా జైలు శిక్ష అమలు చేసేందుకు వీలుగా జూన్ 16 సాయంత్రం 5 గంటలలోపు రిజిస్ట్రార్ జ్యుడీషియల్ ముందు లొంగిపోవాలని హరినారాయణ్‌ను న్యాయస్థానం ఆదేశించింది.

ఇదీ చదవండి: ఆ అధికారికి జైలు శిక్ష సరైందే...

Last Updated :May 15, 2022, 3:09 AM IST

ABOUT THE AUTHOR

...view details