ఆంధ్రప్రదేశ్

andhra pradesh

SSC Results: పదో తరగతి ఫలితాలు విడుదల.. తగ్గేదేలే అన్న బాలికలు..!

By

Published : Jun 6, 2022, 12:07 PM IST

Updated : Jun 6, 2022, 5:11 PM IST

SSC Results in andhra pradesh
ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల

12:04 June 06

పదో తరగతిలో 67.26 శాతం ఉత్తీర్ణత

పదో తరగతి ఫలితాలు విడుదల

SSC Results: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. గతంలో కంటే ఈసారి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం తగ్గింది. బాలికలు ఎక్కువ మంది ఉత్తీర్ణులై సత్తా చాటగా.. బాలురు వెనకబడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 71 పాఠశాలల్లో ఒక్క విద్యార్థీ పరీక్ష పాస్ కాలేదు. సున్నా ఫలితాలు వచ్చిన పాఠశాలల్లో 40 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వచ్చే నెల 6 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానుండగా.. ఈ పరీక్షల్లో పాసైన వారిని రెగ్యులర్ విద్యార్థులుగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ తర్వాత పలు పాఠశాలలు సరిగ్గా నడవకపోవడం వల్లే ఉత్తీర్ణత శాతం తగ్గిందని మంత్రి స్పష్టం చేశారు.

విజయవాడలో పదో తరగతి పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ సారి 6 లక్షల 15 వేల 908 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. మొత్తం 4 లక్షల 14 వేల 281 విద్యార్థులు పాస్ అయ్యారని మంత్రి బొత్స తెలిపారు. ఈసారి కూడా బాలికలు ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు. 2 లక్షల 11 వేల 460 మంది బాలికలు పాస్ కాగా.. 2 లక్షల 02 వేల 821 బాలురు పాస్ అయ్యారు. మొత్తం 67.26 శాతం మంది ఉత్తీర్ణత నమోదైంది. వీటిలో 70.70శాతం బాలికలు, 64.02 శాతం బాలురు పాస్ అయ్యారు. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 78.30 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అనంతపురం జిల్లాలో అత్యల్పంగా 49.70 ఉత్తీర్ణత శాతం నమోదైంది. 11 వేల 671 పాఠశాలల నుంచి విద్యార్థులు పరీక్షలు రాయగా.. 797 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి బొత్స తెలిపారు. 71 పాఠశాల్లో ఒక్కరూ పాస్ కాలేదు . అక్కడ ఉత్తీర్ణత శాతం సున్నాగా నమోదైంది. సున్నా ఫలితాలు వచ్చిన 71 పాఠశాలల్లో 31 ప్రైవేటు పాఠశాలలు, 40 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా 28 రోజుల్లోనే పది ఫలితాలు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. గతంలో కంటే ఈ సారి ఉత్తీర్ణత శాతం తగ్గిందన్న మంత్రి... ఫలితాలు తగ్గడానికి కారణాలపై ప్రభుత్వం విశ్లేషణ చేసిందని, కోవిడ్ తర్వాత కూడా సరిగ్గా పాఠశాలలు నడవకపోవడం వల్లే ఈ సారి ఉత్తీర్ణత శాతం తగ్గిందని మంత్రి స్పష్టం చేశారు. మార్కుల జాబితాలో ఈ సారి గ్రేడింగ్ లేదని, మార్కుల జాబితాపై ఫస్ట్, సెకండ్, పాస్ అనే కేటగిరీలు ఇస్తున్నామన్నారు. పది ఫలితాలపై ఎవరూ ప్రకటనలు ఇవ్వరాదని, కాదని ప్రకటనలు జారీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం విద్యార్థులు 15 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. జవాబు పత్రాల కోసం విద్యార్థులు దరఖాస్తు చేస్తే సమాధాన పత్రాల నకలు ఇస్తామన్నారు. వచ్చే నెల 6 నుంచి 15 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. రేపట్నుంచి సప్లమెంటరీ ఫీజు చెల్లింపు ప్రారంభమవుతుందన్నారు. ఈనెల 13 నుంచి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులు పెడుతున్నామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని విద్యార్థుల సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సప్లిమెంటరీ ఫలితాలు త్వరగా విడుదల చేసి.. రెగ్యులర్ విద్యార్థులతో పాటు సప్లిమెంటరీ విద్యార్థులు చదువుకునే అవకాశం కల్పిస్తామన్నారు. ఇప్పుడు జరిగే సప్లిమెంటరీ పరీక్షలో పాసైన వారిని రెగ్యులర్ విద్యార్థులుగా పరిగణిస్తామన్నారు. విద్యార్థులు సదవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఇప్పుడు జరిగే సప్లిమెంటరీలోనూ ఫెయిలై వచ్చే ఏడాది పరీక్షల్లో పాసైతే .. వారిని కంపార్టుమెంటల్​లో పాస్ అయినట్లు భావిస్తామన్నారు.

పరీక్షలకు హాజరైన విద్యార్థులు 6,15,900
ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు 4,14,000
మొత్తం ఉత్తీర్ణత శాతం 67.26
బాలికల ఉత్తీర్ణత శాతం 70.70
బాలుర ఉత్తీర్ణత శాతం 64.02
ఫలితాల్లో ప్రథమ స్థానం పొందిన జిల్లా ప్రకాశం (78.3శాతం)
ఫలితాల్లో ఆఖరి స్థానం పొందిన జిల్లా అనంతపురం (49.7శాతం)

ఇవీ చూడండి:

Last Updated : Jun 6, 2022, 5:11 PM IST

ABOUT THE AUTHOR

...view details