దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సులో వివిధ సంస్థల వ్యవస్థాపకులు, సీఈవోలతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. విశాఖను స్టార్టప్ హబ్గా మారుస్తామని స్టార్టప్ సంస్థల ప్రతినిధులకు సీఎం జగన్ స్పష్టం చేశారు. విధానపరమైన నిర్ణయాలతో పాటు స్టార్టప్ల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఏపీలో విద్యారంగంలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నామని బైజూస్ సంస్థ ఉపాధ్యక్షుడు సుష్మిత్ సర్కార్ తెలిపినట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. బైజూస్ పాఠ్యప్రణాళికను కూడా ఏపీ విద్యార్ధులకు అందించేందుకు ముందుకు వచ్చినట్లు స్పష్టం చేశాయి.
మరోవైపు ఏపీలో చేపట్టిన సమగ్ర భూసర్వే రికార్డులను డిజిటల్గా భద్రపరిచేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు కాయిన్ స్విచ్ క్యూబర్ సంస్థ ముందుకొచ్చినట్లు సీఎంవో తెలిపింది. ఏపీ పర్యటకాభివృద్ధితో పాటు పర్యటక స్థలాలకు గుర్తింపు వచ్చేలా సహకారం అందిస్తామని ఈజ్ మైట్రిప్ సంస్థ ప్రతినిధులు కూడా సీఎంకు వివరించినట్టు స్పష్టం చేసింది.
పలు అంశాల్లో సహకారం
* రాష్ట్రంలో విద్యారంగానికి సంబంధించి అవసరమైన సహకారాన్ని అందిస్తామని బైజూస్ ఉపాధ్యక్షురాలు (పబ్లిక్ పాలసీ) సుష్మిత సర్కార్ వెల్లడించారు. ఏపీ విద్యకు సంబంధించి పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. బైజూస్ సీఈవో బైజూ రవీంద్రన్ సీఎం జగన్తో సమావేశమయ్యారు.