ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జగన్ 'బాదుడే బాదుడు'తో.. ప్రజలు అల్లాడుతున్నారు: చంద్రబాబు

By

Published : Apr 13, 2022, 6:50 PM IST

Updated : Apr 13, 2022, 8:53 PM IST

ముఖ్యమంత్రి జగన్ 'బాదుడే బాదుడు' చర్యలతో ప్రజలు విలవిల్లాడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు
చంద్రబాబు

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ తన అసమర్థ పాలనతో పేదలపై పన్నులు వేస్తూ, ఛార్జీలు పెంచుతూ ప్రజలను పీక్కుతుంటున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే కరెంట్ ఛార్జీలు, చెత్త పన్నులు, ప్రాపర్టీ టాక్స్​లతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు అల్లాడుతున్నారని వాపోయారు. ఇలాంటి సమయంలో పేదలు, మద్య తరగతి ప్రజలు ఎక్కవగా వినియోగించే ప్రజా రవాణా ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెంచటం దారుణమన్నారు. ప్రభుత్వం తన 'బాదుడే బాదుడు' కార్యక్రమంతో రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తుందో అర్థం కావట్లేదన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచారని విమర్శించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తరువాత సంస్థకు అండగా నిలవాల్సింది ప్రభుత్వమేనన్న చంద్రబాబు.. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

"'బాదుడే బాదుడు' చర్యలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుతో పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం. డీజిల్ సెస్ పేరుతో చేసిన ఛార్జీల పెంపును వెనక్కి తీసుకోవాలి. అధికారంలోకి వచ్చాక రెండోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. విలీనం అయ్యాక ఆర్టీసీకి అండగా నిలవాల్సింది ప్రభుత్వమే. ప్రతి వారం ఛార్జీలు, పన్నులు పెంచడం అలవాటుగా మారింది. ఇప్పటికే విద్యుత్‌, చెత్త, ప్రాపర్టీపై పన్నుల భారం వేశారు. పెరిగిన నిత్యావసరాల ధరలతో ప్రజలు అల్లాడుతున్నారు." -చంద్రబాబు, తెదేపా అధినేత

రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలు: ఆర్టీసీ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహించనున్నట్లు చంద్రబాబు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. నిరసన కార్యక్రమంలో భాగంగా రేపు అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లోని బస్ స్టేషన్లు, కాంప్లెక్స్‌ల ఎదుట ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

ప్రయాణికులపై అదనపు భారం:డీజిల్ సెస్‌ పేరుతో ఏపీఎస్​ఆర్టీసీ ప్రయాణికుల ఛార్జీలను పెంచింది. పల్లెవెలుగు బస్సుల్లో రూ.2, ఎక్స్​ప్రెస్​ బస్సుల్లో రూ. 5, ఏసీ బస్సుల్లో రూ.10 చొప్పున డీజిల్ సెస్ వసూలు చేయనుంది. వీటికి అదనంగా అన్నింటిపైనా రూపాయి చొప్పున సేఫ్టీ సెస్సు విధించింది. అలాగే పల్లెవెలుగు బస్సుల్లో ఇప్పటిదాకా రూ.8 ఉన్న కనీస ఛార్జీని రూ.10 పెంచిన ఆర్టీసీ.. రూ.2 డీజిల్ సెస్సు, రూ.1 సేఫ్టీ సెస్సు విధించింది. ఇవన్నీ కలిపితే కనీస టికెట్ ధర రూ.13 అవుతుండగా.. చిల్లర సమస్య రాకుండా అంటూ కనీస ఛార్జీని రూ.15 చేసింది.

ఇదీ చదవండి: ఆర్టీసీ ప్రయాణికులపై అదనపు భారం.. డీజీల్ సెస్ పేరుతో ఛార్జీల పెంపు

Last Updated :Apr 13, 2022, 8:53 PM IST

ABOUT THE AUTHOR

...view details