ఆంధ్రప్రదేశ్

andhra pradesh

భోగి పరమార్థం.. తెలుగు లోగిళ్లలో ఆనందోత్సాహం

By

Published : Jan 13, 2021, 5:59 AM IST

Updated : Jan 13, 2021, 7:50 AM IST

ముంగింట్లో ఆహ్వానించే అందమైన రంగవల్లులు, క్రిమికీటకాలను పారదోలే గొబ్బెమ్మలు, వేకువనే నిద్రలేపే హరిదాసు సంకీర్తనలు, చెడును దహించే నులివెచ్చని భోగి మంటలు, పురాణ ఇతిహాసాలను కళ్లకు కట్టే బొమ్మల కొలువులు..! వరుసలు కలుపుతూ పలకరింపులు..! చిన్ననాటి దోస్తులతో ముచ్చట్లు..! నోరూరించే నేతి అరిసెలు..! ఇది కదా సంక్రాంతి సందడంటే..! తెలుగువారి ముచ్చటైన మూడురోజుల వేడుక వచ్చేసింది. భోగి భాగ్యాలు తెచ్చేసింది.! చెడు ఆలోచనల్ని దహించివేసి.... మంచిని ఆహ్వానించే భోగి మంటలు.. తెలుగులోగిళ్లకు జ్వాలా తోరణాలయ్యాయి.

bhogi-festival-celebrations-in-andhra-pradhesh
తెలుగు లోగిళ్లలో భోగి సందడి... ఆకట్టుకుంటున్న బొమ్మల కొలువులు


లేలేత మంచుతెరల్లో నులివెచ్చని మంటలు వేకువ చీకట్లను చీల్చే కాంతి కిరణాలు ఇవిగో ఇవే భోగిపండుగకు ఆహ్వానం పలికే జ్వాలాతోరణాలు! తెలుగువారి ముచ్చటైన మూడురోజుల పండుగలో ముందుగా సందడి తెచ్చేదే భోగి.! ఇళ్లముందు వేసే భోగి మంటలతో ఈ పండుగ మొదలవుతుంది. తెల్లారకముందే లేస్తారు. ఆవుపేడతో చేసిన పిడకలు, తాటాకులు, ఇతర చెట్ల కర్రలను ఒకచోట వేసి మంటలు వేస్తారు. ఊర్లో ఉన్నవాళ్లు, ఊళ్ల నుంచి వచ్చినవాళ్లు, చిన్నాపెద్దా అంతా చుట్టూచేరి చలి మంటలు కాచుకుంటారు.

పాత చెడు ఆలోచనలను వదిలించుకుని కాలంతోపాటు వచ్చే మార్పులకు అనుగుణంగా మనసును సిద్ధం చేయడమే భోగిమంటల పరమార్థం. అందుకే పాత కుర్చీలు,బల్లలు మంటల్లో వేస్తుంటారు. సూర్యుడి సంక్రమణంలో దక్షిణాయనానికి..ఆఖరిరోజు భోగి! దక్షిణాయనంలో తాము ఎదుర్కొన్న బాధలను భోగి మంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ప్రసాదించమని ప్రజలు ప్రార్థిస్తారు. లేలేత మంచుతెరల్లో జ్వలించే నులివెచ్చని మంటలు మదిలోని నిరాశానిస్పృహల చీకట్లను చీల్చే కాంతిపుంజాల్లాంటివని కూడా పండితులు ప్రవచిస్తుంటారు.

ఇక భోగిమంటలయ్యాక తలస్నానం చేసి కొత్తబట్టలు కట్టుకుంటారు. ఆ తర్వాత కొత్త బియ్యంతో చేసే పులగం తినడం సంప్రదాయం. కొత్త బియ్యం, పెసరపప్పు,.. నెయ్యి, మిరియాలు జోడించి వండే పులగం.. చలికాలంలో జీర్ణశక్తిని ప్రేరేపిస్తుందని పెద్దలు చెప్తారు. అందుకే నేటితరం పిల్లలు వింతగా చూసినా.. పెద్దవాళ్లు దాని విశిష్టతను చెప్పిమరీ పులగం తినిపిస్తారు.

భోగినాడు సాయంత్రం సందడంతా బొమ్మల కొలువుదే. ఇంట్లో ఉండే బొమ్మలన్నీ పోగేస్తారు. వాటిని వరుసలో చేరుస్తారు. కొందరైతే పురాణ ఇతిహాసాలు ప్రతిబింబించేలా బొమ్మలను కొలువుదీరుస్తారు.. దేవుడి పాటలు పాడి ఆశీస్సులు కోరుకుంటారు.

ఇక భోగిపండుగ గురించి చెప్పుకోవాల్సిన మరో విశిష్టత పిల్లలకు భోగి పళ్లు పోయడం. సూర్యుడి రంగు ఎరుపు, ఆకారం గుండ్రం.! అలాంటి రంగు ఆకారాన్ని పోలి ఉన్న... రేగి పళ్లను చిన్నారుల తలపై పోయడం వల్ల మేథాశక్తి, ఆరోగ్య శక్తి లభిస్తాయని విశ్వాసం. అందుకే

రేగిపళ్లతోపాటు పూలరేకులు, చిల్లర నాణేలతో కలిపి 3సార్లు సవ్య, అపసవ్య దిశలో తిప్పి... పిల్లల తలపై పోస్తారు. ఇప్పుడైతే పిల్లల సరదా కోసం చాక్లెట్లు కూడా కలిపిపోస్తున్నారు. భోగిపళ్లు పోయడంద్వారా ..పిల్లలకుండే దిష్టి దోషాలు కూడా తొలగుతాయని విశ్వాసం. ఏకాలంలో దొరికేవి ఆకాలంలోనే తినాలి. ఇప్పుడు మాత్రమే దొరికే రేగిపళ్లలోని గుజ్జుతింటే పిల్లలకు అజీర్తి, మలబద్ధకం కూడా పోతుందని కూడా చెప్తుంటారు.

ఇలాంటి ప్రాముఖ్యత ఉన్న భోగిపండుగను తెలుగువారు వివిధ రాష్ట్రాల్లో స్థానిక సంస్కృతీ సంప్రదాయాల ఆధారంగా జరుపుకొంటారు. భౌగోళిక సరిహద్దుల్ని బట్టి ఈ రీతులు మారినా..... ప్రతిచోటా భోగి మంటలు మాత్రం తప్పనిసరిగా ఉంటాయి.

ఇదీచదవండి.

'కమిటీపై ఆధారపడలేం.. నిరసనలు కొనసాగిస్తాం'

Last Updated :Jan 13, 2021, 7:50 AM IST

ABOUT THE AUTHOR

...view details