దుర్గగుడిలో ఈనెల 18న అవినీతి నిరోధకశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అప్పటినుంచి 5రోజులపాటు కొనసాగిన తనిఖీల్లో ప్రసాదాల కౌంటర్ల నుంచి అన్ని విభాగాల్లో సోదాలు చేశారు. నగదు కౌంటర్లలో ఉన్న లెక్కలను పరిశీలించారు. ఆలయంలోని పరిపాలన విభాగంలోనూ తనిఖీలు నిర్వహించారు. చీరల విభాగం, ఇంజినీరింగ్, సరకులు.. ఇలా అన్నింటికి సంబంధించిన ఫైళ్లు పరిశీలించారు. ఇటీవల వివాదాస్పదమైన సెక్యూరిటీ, శానిటేషన్ టెండర్లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఆలయానికి వచ్చే ఆదాయం, నిర్వహణ ఖర్చులు, ఉత్సవాలు, సిబ్బంది పదోన్నతులు ఇలా ప్రతి విషయానికి సంబంధించి జరుగుతున్న లోపాలపై ఆరా తీశారు. ఆదివారం రోజున దుర్గగుడిలోని కొందరు సిబ్బందిని గొల్లపూడిలోని అనిశా కార్యాలయానికి పిలిపించి విచారించారు. కీలకమైన ఫైళ్లను తెప్పించుకుని పరిశీలించారు. ఆలయంలో జరిగిన అవకతవకలపై సంబంధిత సిబ్బంది వాంగ్మూలాలు తీసుకున్నారు. ఐదు రోజుల తనిఖీలకు సంబంధించిన నివేదికను సిద్ధం చేసినట్లు సమాచారం. దీన్ని ప్రభుత్వానికి నివేదించనున్నారు.