Falling Into Reservoir: కర్నూలు జిల్లా పాణ్యం మండలం గోరుకల్లు జలాశయంలో చేపలవేటకు వెళ్లి పుట్టి తిరిగి పడడంతో ఇద్దరు యువకులు నీళ్లలో మునిగారు. మంగళవారం సాయంత్రం నలుగురు యువకులు రెండు పుట్టీలలో చేపల వేటకు జలాశయంలోకి వెళ్లారు. ఉన్నట్లుండి బలమైన ఈదురు గాలులు రావడంతో ఒక పుట్టి తిరిగి బోల్తా పడింది. పుట్టిలో ఉన్న ఇద్దరు యువకులు నీళ్లలో పడిపోయారు. మరో పుట్టిలో ఉన్న యువకులు గ్రామానికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
ఆందోళన చెందిన స్థానికులు జలాశయం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకొని మరో పడవ సహాయంతో వారి వద్దకు వెళ్లారు. సురక్షితంగా వారిని బయటకు తీసుకువచ్చారు. స్థానికుల సమాచారంతో ఎస్సై సుధాకర్ రెడ్డి, పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని బయటపడ్డ యువకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. యువకులు సురక్షితంగా బయటపడడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఇద్దరు యువకులు జలాశయంలో గల్లంతయ్యారని వార్త సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో ఇతర గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున జలాశయం వద్దకు చేరుకున్నారు.