ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తగ్గిన దిగుబడి.. పెరిగిన ధర.. జీడిపప్పు పరిశ్రమకు గడ్డుకాలం

By

Published : May 14, 2022, 7:16 PM IST

Cashew Industry in Problems

Cashew Industry in Problems:జీడిపప్పు పరిశ్రమకు గడ్డుకాలం నడుస్తోంది. వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో దిగుబడి బాగా తగ్గాయి. నాణ్యమైన జీడిపప్పు సేకరించలేక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. రేట్లు పెరిగి.. వినియోగదారులు కూడా కొనలేకపోతున్నారు.

తగ్గిన దిగుబడి..పెరిగిన ధరలతో...జీడిపప్పు పరిశ్రమకు గడ్డుకాలం

Cashew Industry in Problems: బాపట్ల జిల్లా వేటపాలెం అనగానే జీడిపప్పు గుర్తొస్తుంది. ఎటుచూసినా జీడిగింజలు ఒలుస్తూ కళకళలాడే దుకాణాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ఈ ఏడాది వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా జీడి పూత మాడిపోయింది. మార్చిలో రావాల్సిన పంట ఏప్రిల్‌లో చేతికి వచ్చింది. గతేడాది ప్రారంభంలో బస్తా జీడిగింజల ధర 8వేల4వందల రూపాయలు ఉండగా.. ప్రస్తుతం జీఎస్టీ, రవాణా ఖర్చుతో కలిపి 10వేల రూపాయలకు పైగా చేరిందని వ్యాపారులు వాపోతున్నారు.

జీడిపప్పు పరిశ్రమలకు ఈ ఏడాది కలిసొచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ధరలు పెరిగాయి. విత్తనాల్లో నాణ్యత లేదు. దిగుబడి బాగా పడిపోయింది. నాణ్యమైన 100 కిలోల జీడిగింజల బస్తా నుంచి దాదాపు 28 కిలోల పప్పు వస్తుంటే.. ప్రస్తుతం 24 కిలోల వరకే వస్తోందని వ్యాపారులు అంటున్నారు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ధరలు పెంచితే... వినియోగదారులపై అధిక భారం పడుతుందేమోననే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.

"‌100కేజీలకు 28కేజీల జీడిపప్పు రావాలి. కానీ ఈ ఏడాది 24కేజీలే దిగుబడి వస్తుంది. దీంతో వ్యాపారులకు,తయారీ దారులకు ఇబ్బందిగా ఉంది. ధరలు కూడా బాగా పెరిగాయి." -వెంకటసుబ్బారావు, జీడిపప్పు వ్యాపారి.

" ప్రస్తుతం జీడిగింజల ధర మునుపెన్నడూ లేని విధంగా అధికంగా ఉంది. జీడి గింజల దిగుబడి కూడా చాలా పడిపోయింది. ప్రస్తుతం ఏంచేయాలో దిక్కుతోచని పరిస్థితి. "-నాగ శ్రీనివాసరావు, అధ్యక్షుడు, జీడిపప్పు వ్యాపారుల అసోసియేషన్ .

గతంలో భారీగా విత్తనాలు కొనుగోలు చేసి నిల్వచేసే వ్యాపారులు కూడా.. విత్తనాల్లో నాణ్యత లేకపోవడంతో ఇప్పుడు వెనుకాడుతున్నారు. జీడిపప్పు పరిశ్రమ.. కార్మికులతో ముడిపడి పనిచేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కార్మికులకు వేతనాలు ఇవ్వలేకపోతున్నామని వ్యాపారులు వాపోతున్నారు.

" గతంలో మేము ఒకేసారి 1000 నుంచి 500 బస్తాలు కొనుగోలు చేయగలిగే స్థోమత కలిగి ఉండేవాళ్లం. ప్రస్తుత పరిస్థితుల్లో 400కు మించి కొనలేకపోతున్నాం. ప్రస్తుతం జీడిపప్పు వ్యాపారుల పరిస్థితి చాలా గడ్డుగా ఉంది. " -బద్రీనాథ్‌, సెక్రటరీ, జీడిపప్పు వ్యాపారుల అసోసియేషన్.

"10-15 జీడిపప్పు పరిశ్రమలు ఉన్నాయి. గింజలు దొరకకపోవడంతో కొన్ని మాత్రమే పనిచేస్తున్నాయి. ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం. ధరలు పెరగటంతో ఇబ్బందులు పడుతున్నాం. " -నరేంద్రకుమార్, జీడిపప్పు వ్యాపారి

జీడి పరిశ్రమల్లో యంత్రాల కొనుగోలుకు ప్రభుత్వం సహకరిస్తే...పప్పు ఉత్పత్తి మరింత పెంచగలమని వ్యాపారులు..... ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details