ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Weather Update: 'జవాద్' ముప్పు.. తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం

By

Published : Dec 3, 2021, 8:43 AM IST

Updated : Dec 4, 2021, 3:19 AM IST

Weather Report: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా (జవాద్​గా పేరు పెట్టారు) మారింది. విశాఖకు 360, ఒడిశాలోని గోపాల్​పూర్​కు 470 కిలోమీటర్ల దూరంలో 'జవాద్' తుపాను కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాను ప్రభావంతో ఈరోజు, రేపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ముంచుకొస్తున్న 'జవాద్' ముప్పు
ముంచుకొస్తున్న 'జవాద్' ముప్పు

Jawad Cyclone: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత తీవ్రమై తుపానుగా మారింది. విశాఖకు 360, ఒడిశాలోని గోపాల్​పూర్​కు 470, పారాదీప్​కు 503 కిలోమీటర్ల దూరంలో 'జవాద్' తుపాను కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాను పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం గంటకు 25 కిలోమీటర్ల వేగంతో తుపాను తీరం వైపునకు కదులుతుందని పేర్కొంది. రేపు ఉదయానికి ఉత్తకోస్తాంధ్రకు దగ్గరగా వచ్చే అవకాశం ఉందని..,తీరానికి దగ్గరయ్యే కొద్దీ గాలుల తీవ్రత పెరగనుందన్నారు. తీరానికి వచ్చేకొద్దీ దిశ మార్చుకుని పూరీ వైపు వెళ్లే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తరకోస్తా తీరంలో అర్థరాత్రి నుంచి 45-65 కి.మీ., రేపు ఉదయం నుంచి 80-100 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ స్పష్టం చేసింది. పలుచోట్ల 20 సెం.మీ.కి పైగా వర్షపాతం, 3.5 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడే అవకాశం ఉందన్నారు.

విశాఖలో కంట్రోల్ రూమ్​లు..

విశాఖపట్నం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా విశాఖ కంట్రోల్‌ రూమ్‌ నెంబర్లు.. 0891-2590100, 2590102, 2750089, 2750090, 2560820కు ఫోన్ చేయాలని సూచించారు. జీవీఎంసీ, రెవెన్యూ, జలవనరుల శాఖ సిబ్బంది, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ మల్లికార్జున సూచించారు. తుపాను ప్రభావం దృష్ట్యా 3 రోజులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. విపత్తును ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు.

తుపాను రక్షణ చర్యల్లో భాగంగా విశాఖ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో 3 ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధం చేసిన అధికారులు.. జీవీఎంసీ పరిధిలో 21 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అలాగే తుపాను దృష్ట్యా పాఠశాలలకు మూడ్రోజులు సెలవు ప్రకటించారు. రెండ్రోజులు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు అనుమతిని నిలిపివేశారు.

విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తం

జవాద్ తుపాన్ వల్ల ఏర్పడే విద్యుత్ ప్రమాదాలు, అవాంతరాలకు సంబందించిన సమాచారాన్ని అందించేందుకు ఏపీఈపీడీసీఎల్ కంట్రోల్ రూమ్ నెంబర్లను ఏర్పాటు చేసింది. తుఫాన్ ప్రభావానికి తెగిపడిన విద్యుత్ వైర్లు, పడిపోయిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లపై పడిపోయిన చెట్లకొమ్మల పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. వాటి సమాచారాన్ని టోల్ ఫ్రీ నెం 1912 లేదా కంట్రోల్​ రూమ్ నెంబర్లకు ఫోన్ చేసి విద్యుత్ అధికారులు తెలియజేశారు.

విశాఖపట్నం కార్పొరెట్ కార్యాలయం -9440816373 / 8331018762 ; విశాఖపట్నం -7382299975; శ్రీకాకుళం -9490612633; విజయనగరం -9490610102; తూర్పుగోదావరి -7382299960; పశ్చిమగోదావరి -9440902926

చేపల వేటపై నిషేదం

శ్రీకాకుళం జిల్లాలో తుపాను ప్రభావం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అప్రమత్తం చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు.

పాఠశాలలకు సెలవు..

తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లాలో రెండు రోజులపాటు పాఠశాలలకు, అంగన్​వాడీలకు కలెక్టర్‌ సెలవు ప్రకటించారు. తుపాను సహాయక చర్యల ప్రత్యేక అధికారిగా కాంతిలాల్‌దండేను నియమించారు. ముందస్తు చర్యల్లో భాగంగా 12 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు విజయనగరానికి రానున్నట్లు స్పష్టం చేశారు.

41 రైళ్ల రద్దు..

బంగాళాఖాతంలో తుపాను హెచ్చరికలతో పలు ప్రాంతాలకు నడిచే 41 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. రేపు, ఎల్లుండి తిరిగే దూర ప్రాంత రైళ్లను అధికారులు రద్దు చేశారు. తెలుగు రాష్ట్రాల మీదుగా ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగించే సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. రైళ్ల రద్దు సమాచారాన్ని ప్రయాణికులకు ముందస్తుగా మొబైల్ సందేశం ద్వారా పంపనున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:

ceew report: వాతావరణ దుర్బలత్వ సూచీలో ఏపీ రెండోస్థానం..!

Last Updated : Dec 4, 2021, 3:19 AM IST

ABOUT THE AUTHOR

...view details