ఆంధ్రప్రదేశ్

andhra pradesh

"జగన్ రెడ్డి 3 రాజధానుల ముచ్చట తెచ్చి... అమరావతిలో కుంపటి పెట్టారు"

By

Published : Sep 10, 2022, 6:31 PM IST

Updated : Sep 10, 2022, 10:26 PM IST

tdp leaders on padayatra: రాజధాని విషయంలో ప్రభుత్వంపై తెదేపా నేతలు తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల మధ్య విధ్వేషాలు సృష్టించాలని చూస్తున్నారని విమర్శించారు. జగన్ రెడ్డి మూడు రాజధానుల ముచ్చట తెచ్చి అమరావతిలో కుంపటి పెట్టారని మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. అమరావతి మహిళా రైతులు చేపడుతున్న పాదయాత్రకు అడ్డంకులు సృష్టించడం సరికాదని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తెలిపారు. పాదయాత్రకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని హెచ్చరించారు. వైకాపా రాబందులు మరోసారి రాజధానిపై పడ్డారని తెదేపా అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ దుయ్యబట్టారు. అమరావతి రైతుల పాదయాత్రను 3 రాజధానులపై దండయాత్ర అంటూ అవమానిస్తున్నారన్నారు.

tdp
మహా పాదయాత్రపై తెదేపా

tdp leaders on padayatra: జగన్ రెడ్డి మూడు రాజధానుల ముచ్చట తెచ్చి అమరావతిలో కుంపటి పెట్టారని మాజీ మంత్రి జవహర్ దుయ్యబట్టారు. అధికారంలోకి రాకముందు భూములిచ్చిన రైతుల త్యాగాన్ని పొగిడి అధికారంలోకి వచ్చాక వారిని ఇబ్బందులపాలు చేశారని మండిపడ్డారు. ప్రాంతాలవారీ చిచ్చు పెట్టకూడదని చెబుతూనే చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. హైకోర్టు అమరావతి పనులు 6నెలల్లో ప్రారంభించమంటే నేటివరకు ప్రారంభించలేదని జవహర్‌ ఆక్షేపించారు. అమరావతి రైతుల కౌలు విషయంలో మోసం చేశారన్నారు. గతంలో అమరావతి రైతులను ప్రజలు పూలపాన్పుపై నడిపించడాన్ని గుర్తుంచుకోవాలన్నారు. జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల నేడు ఆంధ్రప్రదేశ్​కు రాజధాని లేకుండా పోయిందన్నారు. సీపీఎస్ అనాలోచిత నిర్ణయమని ఒప్పుకొన్నట్లే.. అమరావతి రాజధాని విషయంలో కూడా అనాలోచిత నిర్ణయమని ఒప్పుకోవాలని జవహర్‌ తెలిపారు.

పాదయాత్రకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం సరికాదు: వంగలపూడి అనిత

అమరావతి మహిళ రైతులు చేపడుతున్న పాదయాత్రకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం సరికాదని తెలుగు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తెలిపారు. ప్రజాస్వామ్యంలో తమకు అన్యాయం జరిగితే నిరసన తెలిపే హక్కు ఉందని వివరించారు. పాదయాత్ర ద్వారా మహిళా రైతులు దైవదర్శనం చేసుకునేందుకే వెళ్తున్నారని అన్నారు. అమరావతి రాజధానిపై కులం రంగు పులమటం దారుణమన్నారు. గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రకు తెదేపా ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా బందోబస్తు కల్పించారని గుర్తు చేశారు. అమరావతి మహిళలు చేస్తున్న పాదయాత్రకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని హెచ్చరించారు.

నేటికీ ఒక్క ఇటుకపెట్టలేదు: గ్రీష్మ

వైకాపా రాబందులు మరోసారి రాజధానిపై పడ్డారని తెదేపా అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ దుయ్యబట్టారు. అమరావతిని ఎడారి, గ్రాఫిక్స్ అంటూ అవమానించారన్న ఆమె... ఇటువంటి భూములనే అమ్ముకోవాలని, తాకట్టు పెట్టి అప్పులు తేవాలని జగన్ రెడ్డి ప్రయత్నించారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక తెదేపా కట్టిన భవనాల్లోనే ప్రభుత్వాన్ని నడుపుకొంటున్నారన్నారు. హైకోర్టు... 6నెలల్లో రాజధాని పూర్తిచేయాంటే నేటికీ ఒక్క ఇటుకపెట్టలేదని గ్రీష్మ మండిపడ్డారు. అమరావతి ప్రాంత రైతులు చేసే పాదయాత్రను మూడు రాజధానులపై దండయాత్ర అంటూ అవమానిస్తున్నారన్నారు. అమరావతి రాజధానిగా ఉంటేనే ఉమ్మడి 13జిల్లాల అభివృద్ధి సాధ్యమని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకుతినేందుకు ఏపీని మూడు ముక్కలుగా చేసి, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని వైకాపా ప్రయత్నిస్తోందని విమర్శించారు. అమరావతిని ఎంత అణిచివేస్తే అంత ఉవ్వెత్తున వేగంగా అభివృద్ధి చెందుతుందని జగన్ రెడ్డి గుర్తించాలని కావలి గ్రీష్మ స్పష్టంచేశారు.

మహా పాదయాత్రపై తెదేపా

ఇవీ చదవండి:


Last Updated : Sep 10, 2022, 10:26 PM IST

ABOUT THE AUTHOR

...view details