ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మరీ వారిపై కేసులు ఉండవా.. సీఎంను ప్రశ్నించిన నారా లోకేశ్

By

Published : Sep 9, 2022, 3:16 PM IST

Nara Lokesh questioned CM Jagan : మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ జగన్‌ అవగాహన లేకుండా హామీలిచ్చారని సజ్జల, బొత్స చెబుతుంటే వారిపై కేసులు ఎందుకు పెట్టటం లేదని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.

Etv Bharat
Etv Bharat

Nara Lokesh Reaction On Botsa comments : సీపీఎస్ రద్దుపై బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ముఖ్యమంత్రి జగన్‌ అవగాహన లేకుండా హామీలిచ్చారని సజ్జల, బొత్స బహిరంగంగా చెబుతుంటే వారిపై ఎందుకు కేసులు పెట్టట్లేదని సీఎంను నిలదీశారు. జగన్ రెడ్డి పాలనా వైఫల్యాలపై సోషల్ మీడియాలో చిన్న విమర్శ చేస్తేనే.. తెలుగుదేశం కార్యకర్తలపై దేశద్రోహం కేసులు బనాయించి ఎలా వేధిస్తారని ప్రశ్నించారు.

Ministers committee discussions on CPS: సీపీఎస్‌ రద్దుపై తాము తొందరపడి హామీ ఇచ్చామని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. సీపీఎస్‌ రద్దు చేసి, పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. సీపీఎస్‌ రద్దుపై ఉద్యోగులు ఆందోళన కొనసాగిస్తే తామేం చేయలేమని స్పష్టం చేశారు. సీపీఎస్‌ కంటే మెరుగ్గా గ్యారంటీ పింఛను పథకం (జీపీఎస్‌)ను తీసుకొచ్చామని, దానిలోనూ మరిన్ని సదుపాయాలు పెంచుతున్నట్లు ఉద్యోగ సంఘాలకు వెల్లడించారు. మంత్రుల ప్రతిపాదనను ఉద్యోగ సంఘాల నాయకులు ముక్తకంఠంతో తిరస్కరించారు. పాత పింఛను విధానమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో సీపీఎస్‌పై సచివాలయంలో బుధవారం జరిగిన చర్చలు ఎలాంటి నిర్ణయం వెలువడకుండానే ముగిశాయి. సీపీఎస్‌పై సచివాలయంలో బుధవారం ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక శాఖ, జీఏడీ అధికారులు సమావేశమయ్యారు.

కనీస పింఛను రూ.10 వేలు:ప్రభుత్వం జీపీఎస్‌లో కొన్ని మార్పులు చేసి, సమావేశంలో ప్రతిపాదించింది. కనీస పింఛను, పదవీ విరమణ తర్వాత ఈహెచ్‌ఎస్‌ సదుపాయం, పింఛనుదారు మరణిస్తే జీవిత భాగస్వామికి పింఛను చెల్లింపులాంటి 5 అంశాలను కొత్తగా తీసుకొచ్చింది. జీపీఎస్‌లో ఎన్ని మార్పులు తీసుకొచ్చినా అంగీకరించబోమనీ, ఓపీఎస్‌ ఇవ్వాల్సిందేననీ ఉద్యోగులు స్పష్టం చేశారు. సీపీఎస్‌ రద్దు చేస్తే కేంద్రంతో ఇబ్బందులు వస్తాయని.. ఓపీఎస్‌ అమలు చేస్తున్న రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌లు ఆరు నెలల్లో మళ్లీ వెనక్కి వస్తాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నట్లు ఉద్యోగులు వెల్లడించారు. సీపీఎస్‌, జీపీఎస్‌పైనే చర్చలు అని చెప్పడంతో ఏపీ ఐకాస అమరావతి, సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం (సీపీఎస్‌యూఎస్‌), సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (సీపీఎస్‌ఈఏ)లు సమావేశాన్ని బహిష్కరించాయి. ఈ నెల 11న నిర్వహించాల్సిన చలో విజయవాడను పోలీసుల నియంత్రణ కారణంగా వాయిదా వేస్తున్నట్లు సీపీఎస్‌ఈఏ వెల్లడించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details