ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Nagarjuna sagar : నిండు కుండల్లా జలాశయాలు.. సాగర్ 20 గేట్లు ఎత్తిన అధికారులు..

By

Published : Aug 11, 2022, 12:25 PM IST

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్​కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు.. సాగర్ 20 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. వరద ఇలాగే కొనసాగితే మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

నాగార్జునసాగర్
నాగార్జునసాగర్

నాగార్జునసాగర్​కు క్రమంగా వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం నుంచి 3.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు రావడంతో.. తెల్లవారుజామున ప్రాజెక్టు 20 క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. పైనుంచి వచ్చే వరద ఇలాగే కొనసాగితే.. మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని.. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

ప్రస్తుతం నాగార్జునసాగర్​కు 4.27 లక్షల క్యూసెక్కుల ఇన్​ ఫ్లో వస్తుండగా.. 3.31 లక్షల క్యూసెక్కుల ఔట్​ ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి సామర్థ్యం 305.39 టీఎంసీలుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 588.90 అడుగులుగా ఉంది.

మరోవైపు రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలన్నీ జలకళతో నిండుకుండలను తలపిస్తున్నాయి. భారీగా వస్తున్న వరద ప్రవాహాలతో ప్రాజెక్టుల గేట్లు తెరుచుకుంటున్నాయి. గోదావరి, కృష్ణా నదుల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. పర్యవసానంగా భద్రాచలం వద్ద బుధవారం సాయంత్రం రెండో ప్రమాద హెచ్చరిక 48 అడుగులు దాటి 50.60 అడుగుల మట్టం వద్ద 12.91 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. గత నెలలో నీట మునిగి ఇంకా తేరుకోని గ్రామాల ప్రజలు తాజా వరదతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సింగూరు, శ్రీరామసాగర్‌, ప్రాణహితల నుంచి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత మేడిగడ్డ బ్యారేజీ 85 గేట్లు ఎత్తి 8.57 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.

కృష్ణాలో అటు ఆలమట్టి, ఇటు తుంగభద్రల నుంచి భారీ వరద ప్రవాహం కొనసాగుతుండడంతో బుధవారం రాత్రి 9 గంటలకు శ్రీశైలంలో పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తితో పాటు పది గేట్లు ఎత్తి 3,79,460 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

పులిచింతల వద్ద అప్రమత్తత

ఎగువ నుంచి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సాగర్‌ నుంచి నీటి విడుదల పరిమాణాన్ని లక్ష నుంచి 3లక్షల క్యూసెక్కులకు పెంచే అవకాశముందని తెలపటంతో పులిచింతల అధికారులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ జెన్‌కో జల విద్యుత్కేంద్రంలో 70 మెగావాట్ల విద్యుదుత్పాదన ప్రక్రియ యథావిధిగా కొనసాగుతోంది.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details