ఆంధ్రప్రదేశ్

andhra pradesh

huzurabad bypoll: ముగిసిన హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌

By

Published : Oct 30, 2021, 8:01 PM IST

తెలంగాణలోని హుజూరాబాద్ ఉపఎన్నిక చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఓట్లు వేసేందుకు జనం పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. రాత్రి 7 గంటల వరకు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు 76.26 శాతం పోలింగ్ నమోదయింది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు.

Huzurabad by election polling ends
ముగిసిన హుజూరాబాద్​ ఉపఎన్నిక

చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు మినహా హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సుమారు 12 గంటల పాటు పోలింగ్​ సాగింది. సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్‌ కేంద్రాల్లో క్యూలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల వరకు 76.26 శాతం పోలింగ్ నమోదయింది. హుజూరాబాద్‌లో 2018 ఎన్నికల్లో 84.5 శాతం పోలింగ్‌ నమోదవ్వగా.. ఈసారి దానికి మించే అవకాశం ఉంది. నవంబర్‌ 2న ఉపఎన్నికల ఓట్ల లెక్కించనున్నారు.

భాజపా అభ్యర్థి మాజీ మంత్రి ఈటల రాజేందర్​ కమలాపూర్‌లోని పోలింగ్​ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​ తన స్వగ్రామం ఇన్మంత్​లో సతీమణితో కలిసి ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

చెదురుమదురు ఘటనలు..

పోలింగ్​ సందర్భంగా నియోజకవర్గంలోని పలు చోట్ల చిన్న చిన్న ఘటన జరిగాయి. వీణవంక మండలంలో పలుచోట్ల అధికార తెరాస, భాజపా శ్రేణుల మధ్య వాగ్వాదాలు జరిగాయి. గులాబీ పార్టీ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ కమలం పార్టీ నాయకులు ఆందోళనలకు దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు... పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు.

చల్లూరులో వాగ్వాదం

వీణవంక మండలం చల్లూరులో భాజపా శ్రేణులు ఆందోళన చేపట్టాయి. మార్కెట్ ఛైర్మన్ బాలకిషన్‌రావు ఇంట్లో డబ్బులు పంచుతున్నారని భాజపా నేతలు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో చల్లూరులో భాజపా, తెరాస శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది.

కౌన్సిలర్ ఇంటి ఎదుట ఆందోళన

జమ్మికుంట 28వ వార్డులో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెరాస కౌన్సిలర్ దీప్తి ఇంట్లో డబ్బులు పంచుతున్నారని భాజపా శ్రేణులు నిరసనకు దిగారు. దీప్తి ఇంటి ఎదుట భాజపా శ్రేణులు ఆందోళనకు దిగారు. డబ్బులు స్వాధీనం చేసుకోవాలంటూ రోడ్డుపై బైఠాయించారు. భాజపా శ్రేణుల ఆందోళనతో స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది.

తెరాస వర్సెస్ భాజపా

వీణవంక మండలం కోర్కల్‌లో... తెరాస, భాజపా శ్రేణుల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్‌ కేంద్రం వద్ద సర్పంచ్‌ ప్రచారం చేస్తున్నారని... భాజపా అభ్యంతరం తెలిపింది. సర్పంచ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో... పోలీసులు ప్రవేశించి ఇరు వర్గాలను చెదరగొట్టారు.

శ్రీరాములపల్లిలో ఘెరావ్

హుజూరాబాద్ నియోజకవర్గం.. శ్రీరాములపల్లిలో తెరాస నేతను భాజపా శ్రేణులు అడ్డుకున్నారు. గజ్వేల్ మార్కెట్ ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్‌ను... భాజపా కార్యకర్తలు ఘెరావ్‌ చేశారు. స్థానికేతరులు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. భాజపా అభ్యంతరంతో... తెరాస నేత మాదాసు శ్రీనివాస్‌ వెళ్లిపోయారు.

ఇదీచూడండి:Badvel bypoll: ముగిసిన బద్వేలు ఉపఎన్నిక పోలింగ్‌..

ABOUT THE AUTHOR

...view details