ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Huzurabad By Election Counting: హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు కౌంట్​డౌన్

By

Published : Nov 2, 2021, 6:50 AM IST

తెలంగాణలోని హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం నేడు తేలనుంది(Huzurabad By Election Counting). ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర రాజకీయాల్లో ఉప ఎన్నిక ఫలితం పెను మార్పులు సృష్టించబోతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంతకీ హుజూరాబాద్ బై ఎలక్షన్ కౌంటింగ్ ఎలా జరుగుతుంది. ఎన్ని రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు? ఎన్ని టేబుళ్లు ఏర్పాటు చేశారు? మొత్తం ఫలితం రావడానికి ఎంత సమయం పడుతుందో చూద్దాం.

huzurabad-by-election-result-will-be-announced-tomorrow
హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు కౌంట్​డౌన్

తెలంగాణలోని కరీంనగర్ ఎస్సారార్ కళాశాలలో జరిగే హుజూరాబాద్ ఉపఎన్నిక లెక్కింపు (Huzurabad By Election Counting) కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. సుమారుగా 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మూడంచెల్లో భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడమే కాకుండా కరీంనగర్-జగిత్యాల రహదారిలో వాహనాల దారి మళ్లింపుతో పాటు 144 సెక్షన్ విధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫలితాలు వెలువడిన తర్వాత గొడవలు తలెత్తకుండా కూడా ప్రత్యేక బలగాలను కరీంనగర్‌తో పాటు హుజూరాబాద్‌లో మోహరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ర్యాలీలు రోడ్‌షోలు నిర్వహించకూడదని ఆంక్షలు విధించినట్లు సీపీ తెలిపారు. స్ట్రాంగ్ రూమ్​ల వద్ద కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. సీసీ కెమెరాల నిఘా నీడన స్ట్రాంగ్ రూమ్​కు భద్రత కల్పించారు. వీవీప్యాట్ తరలింపు వార్తల గందరగోళంతో ఈసీ మరింత జాగ్రత్త పడుతోంది.

22 రౌండ్లు..

హుజూరాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్ (Huzurabad By Election Counting) ఉదయం 8 గంటలకు ప్రారంభమైనా... మొదటి అరగంట పాటు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తం 753 మంది ఓటర్ల పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంల లెక్కింపు ఉంటుంది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం రెండు హాళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో హాల్లో ఏడు టేబుల్స్ చొప్పున మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఉపఎన్నిక కౌంటింగ్ మొత్తం 22 రౌండ్లలో కొనసాగనుంది. ఒక్కో రౌండ్​కు 20 నుంచి 30 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ఎక్కువ మంది అభ్యర్థులు ఉండటం వల్ల తుది ఫలితం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

మొదట హుజూరాబాద్ మండలం..

మొదట హుజూరాబాద్ మండలంలోని 14 గ్రామాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల లెక్కింపు (Huzurabad By Election Counting) జరుగుతుంది. హుజూరాబాద్​లోని పోతిరెడ్డిపేట తొలి గ్రామం కాగా, కమలాపూర్ మండలం శంభునిపల్లి చివరి గ్రామం ఓట్ల లెక్కింపు జరగనుంది. ఓట్ల లెక్కింపు సమయంలో రాజకీయ పార్టీల అభ్యర్థులు పంపించిన ఏజెంట్ల సమక్షంలో లెక్కింపు జరుగుతుందని ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ లెక్కింపు చేపట్టినట్లు ఆయన వివరించారు.

సాయంత్రానికి పూర్తి ఫలితం...

హుజూరాబాద్ ఉపఎన్నిక (Huzurabad By Election Counting) ఓట్ల కౌంటింగ్ సిబ్బంది... సూపర్ వైజర్లకు శిక్షణ పూర్తైంది. ఎలాంటి సాంకేతిక సమస్య రాకుండా జాగ్రత్త పడుతున్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత మొత్తం ఫలితం తేలనుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో 86.64 శాతంగా పోలింగ్ నమోదైంది. రికార్డ్ స్థాయిలో పోలింగ్​తో భాజపా తెరాసలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎగ్జిట్‌ పోల్స్ భాజపాకు అనుకూలంగా వచ్చాయి. అయితే ఫలితం తమకే అనుకూలంగా ఉంటుందని తెరాస ధీమాగా ఉంది.

ఇదీ చూడండి:

Badvel By-Poll: నేడు బద్వేలు ఉప ఎన్నిక కౌంటింగ్.. ఏర్పాట్లు పూర్తి

ABOUT THE AUTHOR

...view details