ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'భూములెందుకు అమ్ముతున్నారు.. ఆ హక్కు మీకెక్కడిది..?'

By

Published : Jul 23, 2020, 3:23 AM IST

High Court Serious Comments On Jagan's Government
హైకోర్టు

ఈ-వేలం ద్వారా ప్రభుత్వం చేపట్టిన భూముల విక్రయాన్ని సవాలు చేస్తూ... దాఖలైన వ్యాజ్యాల్లోని అంశాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రజా భూములకు ప్రభుత్వాలు సంరక్షకులుగా మాత్రమే ఉండాలని పేర్కొంది. ఆ భూముల్ని ఎందుకు విక్రయిస్తున్నారు, ఆ హక్కు ఎక్కడిదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. భూముల్ని విక్రయించకపోతే ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నారా అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం ఏమైనా దివాలా తీసే స్థితిలో ఉందా అని నిలదీసింది. భూముల్ని అమ్ముకుంటూ పోతే భవిష్యత్తులో అవసరం అయినప్పుడు భూములెక్కడ దొరుకుతాయని నిలదీసింది.

ఈ-వేలం ద్వారా భూముల విక్రయాన్ని సవాలు చేస్తూ... దాఖలైన వ్యాజ్యాల్లోని అంశాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం భూముల్ని విక్రయిస్తే, రాబోయే ప్రభుత్వం అదే విధానాన్ని అనుసరించే అవకాశం ఉంది కదా అని... ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ప్రభుత్వాలు మారుతుంటాయని... ప్రజా ఆస్తుల సంరక్షణ వాటి బాధ్యత అని స్పష్టం చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ బి.కృష్ణమోహన్​తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. విశాఖ, గుంటూరు జిల్లాల్లో ప్రభుత్వం విక్రయించ తలపెట్టిన భూముల్లో గతంలో ప్రైవేటు వ్యక్తులు ప్రజాప్రయోజనం కోసం ఇచ్చినవి ఉన్నాయని... ఈ నేపథ్యంలో విక్రయాన్ని అడ్డుకోవాలని కోరుతూ సామాజిక ఉద్యమకారుడు, జర్నలిస్ట్ తోట సురేశ్ బాబు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. భూముల విక్రయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో మరికొన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలన్నీ హైకోర్టులో విచారణకు వచ్చాయి.

ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ... తాజాగా కౌంటర్ దాఖలు చేశామన్నారు. విచారణకు సమయం కావాలని కోరారు. ప్రభుత్వ భూములను వేలం ద్వారా విక్రయించడాన్ని పిటిషనర్లు సవాలు చేశారని కోర్టుకు తెలిపారు. ఆ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ... అవి ప్రభుత్వ భూములెందుకు అవుతాయని ప్రశ్నించింది. అవి ప్రజా (పబ్లిక్) భూములని స్పష్టం చేసింది. గవర్నమెంట్, పబ్లిక్ భూములకు చాలా వ్యత్యాసం ఉందని... ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించింది. ఓ న్యాయవాది స్పందిస్తూ... ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం అంటూ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒకవైపు భూముల్ని సేకరిస్తూ.. మరోవైపు ప్రభుత్వ పథకాల అమలు కోసమని ప్రజా ఆస్తులను విక్రయిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.

ఇదీ చదవండీ... ఆస్తుల వేలం కొత్తది కాదు: మిషన్ బిల్డ్ ఏపీ డైరెక్టర్

ABOUT THE AUTHOR

...view details