Amaravati Farmers Maha Padayatra: పల్లె, పట్టణం తేడా లేదు. ఊరూ వాడా భేదం లేదు. రాజధాని రైతుల మహా పాదయాత్ర మార్గమంతా అదే స్పందన.. అదే ఉత్సాహం. అమరావతి రైతులకు మద్దతుగా రాష్ట్ర ప్రజలు నిలవాలన్న అభిలాషను వ్యక్తం చేస్తూ.. అన్ని వర్గాల ప్రజలు రాజధాని రైతు దండు వెంట కదులుతున్నారు. అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని ముక్తకంఠంతో నినదించారు.
రాజధాని రైతుల మహా పాదయాత్ర ఐదో రోజున బాపట్ల జిల్లా కొల్లూరు నుంచి ఉత్సాహంగా ప్రారంభమైంది. రైతులతో పాటు రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, వివిధ వర్గాల ప్రజలు పాదయాత్రలో పాల్గొన్నారు. కొల్లూరులో రైతులు బస చేసిన కల్యాణ మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్ర మొదలుపెట్టారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి మూడు రాజధానుల అంశాన్ని మరోసారి ప్రస్తావించడంపై రైతులు మండిపడ్డారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ ఐకాస నేత పువ్వాడ సుధాకర్ నల్ల చొక్కా ధరించి యాత్రలో పాల్గొన్నారు. సీఎం వ్యాఖ్యలు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా, ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చేలా ఉన్నాయని సుధాకర్ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి తెలియని వారు పాలకులుగా ఉండటం ప్రజల దురదృష్టమన్నారు. ప్రభుత్వం వద్ద రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు ఉన్నాయా అని మరో ఐకాస నేత గద్దె తిరుపతిరావు, ఇతర రైతులు ప్రశ్నించారు.