Husband killed wife and children: హైదరాబాద్ చందానగర్లో విషాదం చోటుచేసుకుంది. పాపిరెడ్డి కాలనీలో భార్య, ఇద్దరు పిల్లలను చంపి భర్త ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. కుటుంబకలహాలే ఇందుకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. శుక్రవారం రాత్రి నిద్రలో ఉండగా టైలరింగ్ కత్తెరతో హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటికి గడియ పెట్టి ఉండటంతో మూడు రోజులుగా విషయం బయటకు రాలేదు.
09:42 October 17
భార్యా పిల్లలను చంపేసి భర్త ఆత్మహత్య
దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తలుపులు తీసి చూడగా ఈ ఘోరం వెలుగుచూసింది. నాగరాజు సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని భార్య సుజాత ఇద్దరు పిల్లలు కూతురు రమ్యశ్రీ విగత జీవులుగా కనిపించారు. నాగరాజే భార్యా, పిల్లలను కత్తితో పొడిచి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు.
సంగారెడ్డి జిల్లా పొట్లంపాడు గ్రామం నుంచి వచ్చి నాగరాజు చందానగర్లో కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య సుజాత కుట్టుపని పని చేసి కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటోంది. నాగరాజు పిల్లలు 11ఏళ్ల కుమారుడు సిద్ధప్ప ఐదోతరగతి, ఏడేళ్ల రమ్యశ్రీ రెండో తరగతి చదువుతున్నారు. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నాగరాజు సైకోలా ప్రవర్తించే వాడని.. అతనే భార్య, పిల్లలను చంపి ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కూడా అక్కడ లభించిన ఆధారాలను బట్టి అదే నిర్ధారించారు.
ఇవీ చదవండి: