ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Telangana CM KCR: ఏకగ్రీవ పంచాయతీలకు నిధులు ఇస్తామని చెప్పలేదు: సీఎం కేసీఆర్

By

Published : Oct 1, 2021, 1:07 PM IST

గత ప్రభుత్వాల హయాంలో ఎన్నో పంచాయతీలు దివాళా తీశాయని శాసనసభ సమావేశాల్లో (Assembly 2021) ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్​ (CM KCR in assembly sessions) ఆరోపించారు. ఒక వ్యక్తిపై సగటున రూ.650 ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ హయాంలో పదేళ్లలో వ్యక్తిపై సగటున రూ.4 మాత్రమే ఖర్చు చేశారని స్పష్టం చేశారు.

KCR Speech in Assembly 2021
KCR Speech in Assembly 2021

ఏకగ్రీవమైన గ్రామాలకు ప్రత్యేకంగా నిధులు ఇస్తామని చెప్పలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్((CM KCR in assembly sessions news))​ స్పష్టం చేశారు. భట్టి విక్రమార్క శాసనసభలో లేవనెత్తిన అంశంపై కేసీఆర్​ వివరణ ఇచ్చారు. కాంగ్రెస్‌ హయాంలో పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ముఖ్యమంత్రి మండిపడ్డారు.

పంచాయతీ గ్రాంట్లు ఆపవద్దని చాలాసార్లు చెప్పినట్లు పేర్కొన్నారు. వ్యక్తిపై సగటున రూ.650 ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో పదేళ్లలో వ్యక్తిపై సగటున రూ.4 మాత్రమే ఖర్చు చేశారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో సర్పంచులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో సర్పంచులకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. రాష్ట్రంలో సర్పంచులు గౌరవంగా బతుకుతున్నారని చెప్పారు. మన గ్రామాలను చూసి పొరుగు రాష్ట్రాలు ఆశ్చర్యపోతున్నాయన్న కేసీఆర్​.. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయో సభ్యులకు తెలియదా? అని ప్రశ్నించారు. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే కేంద్రం నిధులు విడుదల చేస్తోందని ప్రకటించారు. కొన్నిచోట్ల వనరులు ఉంటాయి.. మరికొన్నిచోట్ల వనరులు ఉండవని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో భూముల అమ్మకం ద్వారా ఆదాయం సమకూరుతుందని ఉద్ఘాటించారు. అన్ని పంచాయతీలకు సమన్యాయం జరగాలని ఆలోచిస్తున్నామన్నారు.


ప్రశ్న: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగితే... అందులో 1935 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ప్రోత్సాహక నిధులు రూ.193 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయా? పెండింగ్‌ ఉంటే ఇస్తామని లేదంటే ఇవ్వబోమని చెప్పండి. - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

జవాబు: ఏది చేసినా ధైర్యంగా చేస్తాం.. ఆచరణలో చూపిస్తాం. ఏకగ్రీవ గ్రామాలకు నిధులు ఇస్తామని చెప్పలేదు. నూతన పంచాయతీరాజ్ చట్టంలోనే ఈ అంశం లేదు. కొత్త చట్టం చదివారో లేదో నాకు తెలియదు... దాని ప్రకారమే మేం నిధులు ఇస్తున్నాం. - సీఎం కేసీఆర్

గత ప్రభుత్వాల హయాంలో ఎన్నో పంచాయతీలు దివాళా తీశాయని ఆరోపించారు. గత ప్రభుత్వాల హయాంలోని బకాయిలు ఇప్పటికీ ఉన్నాయన్న కేసీఆర్​.. నిధులు మళ్లింపు అనేది అవాస్తవమన్నారు. పంచాయతీరాజ్ చట్టంలో భాగంగానే జీవోలు జారీ చేశారని తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై సభలో చర్చించాలని సూచించారు. ఇంటింటికి తాగునీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. స్వయంగా కేంద్రమంత్రే లోక్‌సభలో ప్రస్తావించారని గుర్తు చేశారు. మిషన్ భగీరథ ద్వారా అద్భుతంగా నీరు వస్తోందని స్పష్టం చేశారు. అవాస్తవాలు చెప్పడానికి ఆస్కారమే లేదని వివరించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లాలని ఆకాంక్షించారు.

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను గత ప్రభుత్వాలు నెరవేర్చలేదన్న కేసీఆర్​... తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన చరిత్ర తమదేనని చెప్పారు. ఆర్థిక సంఘం సిఫార్సు ద్వారా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధికి సమానంగా నిధులు ఇస్తున్నామని ప్రకటించారు. గ్రామాల రూపురేఖలను మార్చేస్తున్నామని తెలిపారు. సభ ఆమోదంతో చట్టాలు చేసి అమలు చేస్తున్నామన్నారు. ప్రతి గ్రామానికి పంచాయతీరాజ్ కార్యదర్శులను నియమించామని పేర్కొన్నారు. తెలంగాణకు సమీపంలో ఏ రాష్ట్రం కూడా లేదని వెల్లడించారు. ప్రజల మధ్య, గ్రామగ్రామాన చర్చ జరగాలని సూచించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై విస్తృతంగా ప్రత్యేక చర్చ జరగాలని కోరారు.

తాము ఏం చేసినా ఒక విధానం ప్రకారమే చేస్తామని సీఎం కేసీఆర్​ తెలిపారు. సర్పంచులకు అన్ని హక్కులు కల్పించి స్వేచ్ఛ ఇచ్చామని గుర్తు చేశారు. పన్నులు వసూలు చేసుకునే బాధ్యతను పంచాయతీలకే అప్పగించామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో సర్పంచులకు ప్రత్యామ్నాయ వ్యవస్థను తయారు చేశారని విమర్శించారు. గతంలో కలుషిత నీరు తాగి మరణాలు సంభవించాయని ఆరోపించారు. సర్పంచులు చాలా ధైర్యంగా పని చేసుకుంటున్నారని ఈ సందర్భంగా సభలో పేర్కొన్నారు. పంచాయతీలకు ఎన్ని నిధులు కేటాయించామో సభకు తెలుపుతామన్నారు. పంచాయతీలకు ఇచ్చిన నిధుల వివరాలన్ని సభ ముందు ఉంచుతామని వెల్లడించారు. నయా పైసా సహా అన్ని లెక్కలు సభ ముందు ఉంచుతామన్నారు.

ఇదీ చూడండి:పవన్ కల్యాణ్ రాష్ట్రానికే గుదిబండగా తయారయ్యారు: మంత్రి సురేశ్​

ABOUT THE AUTHOR

...view details