ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చరిత్రలో నిలిచిపోయేలా నిర్మాణాలు జరగాలి: సీఎం జగన్

By

Published : Sep 30, 2020, 4:35 PM IST

Updated : Sep 30, 2020, 6:32 PM IST

అన్ని ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉండాలని.. చరిత్రలో నిలిచిపోయేలా నిర్మాణాలు జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మూడేళ్లలో ఆస్పత్రుల నిర్మాణాలు పూర్తికావాలని అధికారులను ఆదేశించారు. వైద్య, ఆరోగ్యశాఖ ఆస్పత్రుల్లో 'నాడు-నేడు'పై సీఎం సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రుల్లో తప్పనిసరిగా సెంట్రలైజ్డ్‌ ఏసీ ఉండాలన్న ముఖ్యమంత్రి.. వైద్యులు ఇబ్బంది పడకుండా ఉన్నప్పుడే చక్కగా సేవలందించగలుగుతారని పేర్కొన్నారు. అవసరమైతే సౌర విద్యుత్‌ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సౌర విద్యుత్‌ వ్యవస్థ వల్ల యూనిట్‌ విద్యుత్‌ రూ.2.50కే వస్తుందని వివరించారు. 7 దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో ఆస్పత్రుల రూపురేఖలు మారబోతున్నాయని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు.

CM Jagan Review On Nadu-Nedu Works In Hospitals
సీఎం జగన్

వైద్య, ఆరోగ్య శాఖ ఆస్పత్రులలో నాడు–నేడు కార్యక్రమం అమలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్ రెడ్డి సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి, హెల్త్‌ మెడికల్‌ హౌసింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ‌ఎండీ వి.విజయరామరాజు, పలువురు అధికారులు పాల్గొన్నారు. నాడు–నేడు కార్యక్రమంలో ఆస్పత్రుల్లో చేపడుతున్న మార్పులతో పాటు, కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలల ప్రస్తుత పరిస్థితిని అధికారులు సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు.

ఈ సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి కీలక అదేశాలు జారీ చేశారు. అన్ని ఆస్పత్రులలో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉండాలని ఆదేశించారు. వాటి నిర్మాణ విషయంలో ఎక్కడా రాజీపడొద్దని సూచించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు అక్కడ కార్పొరేట్‌ లుక్‌ కనిపించాలని స్పష్టం చేశారు. చరిత్రలో నిల్చిపోయే విధంగా వాటి నిర్మాణం జరగాలని, మూడేళ్లలో అన్ని ఆస్పత్రుల నిర్మాణాలు పూర్తి కావాలని సీఎం సూచించారు. ఆ ఆస్పత్రులలో యంత్రాలు, ఉపకరణాల నిర్వహణ బాధ్యత ఏడేళ్ల పాటు అప్పగించాలని నిర్దేశించారు.

ఏసీలు, లిఫ్ట్‌లు, ఎలక్ట్రికల్, నాన్‌ ఎలక్ట్రికల్‌ ఉపకరణాలు, ఫైర్‌ కంట్రోల్‌ ఎక్విప్‌మెంట్‌ నిర్వహణ అప్పగించాలని స్పష్టం చేశారు. తద్వారా ఏ సమస్య తలెత్తినా వెంటనే పరిష్కారం అవుతుందన్నారు. ఆస్పత్రిలో తప్పనిసరిగా సెంట్రలైజ్డ్‌ ఏసీ ఉండాలని.. అప్పుడే డాక్టర్లు ఇబ్బంది పడకుండా చక్కగా సేవలందించగలుగుతారని పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో అవసరం అయితే సౌర విద్యుత్‌ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని... దీనివల్ల యూనిట్‌ విద్యుత్‌ కేవలం రూ.2.50 కే వస్తుందని సీఎం వివరించారు.

దాదాపు 7 దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో ఆస్పత్రుల రూపురేఖలు మారబోతున్నాయని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం, పులివెందులలో వైద్య కళాళాలలకు సంబంధించి భూసేకరణతో పాటు, అవసరమైన అన్ని పనులు పూర్తయ్యాయని, టెండర్ల ఖరారుకు జ్యుడీషియల్‌ రివ్యూకు పంపిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. బాపట్ల, విజయనగరం, ఏలూరు, అనకాపల్లి, మార్కాపురం, మదనపల్లె, నంద్యాల మెడికల్‌ కాలేజీల టెండర్ల జ్యుడీషియల్‌ ప్రివ్యూ అక్టోబరులో జరుగుతుందని చెప్పారు.

నరసాపురం, రాజమహేంద్రవరం, పెనుకొండ, అమలాపురం, ఆదోని మెడికల్‌ కాలేజీల టెండర్లను నవంబరు నెలలో జ్యుడీషియల్‌ ప్రివ్యూకు పంపిస్తామని అధికారులు వివరించారు. సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయగూడెం, దోర్నాలలోని ఐటీడీఏల పరిధిలో ఏర్పాటు చేయనున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు సంబంధించి అంచనాలు సిద్ధమయ్యాయని వివరించారు. రంపచోడవరంలో ఏర్పాటు చేయనున్న ఆస్పత్రిని పవర్‌ పాయింట్‌ ద్వారా చూపారు.

వీలైనంత త్వరగా ఆయా ఆస్పత్రుల పనులు కూడా మొదలవుతాయని అధికారులు చెప్పారు. పాడేరులో వైద్య కళాశాలతో పాటు, ఐటీడీఏల పరిధిలో ఏర్పాటు చేస్తున్న మళ్టీస్పెషాలిటీ ఆస్పత్రుల పనులను సీఎం జగన్, అక్టోబరు 2న ప్రారంభిస్తారని అధికారులు వివరించారు.

ఇదీ చదవండి:

భావితరాలూ ఈ అప్పులను తీర్చలేరు: యనమల

Last Updated : Sep 30, 2020, 6:32 PM IST

ABOUT THE AUTHOR

...view details