ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CM Jagan: కొవిడ్ వ్యాప్తిపై మరింత అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్

By

Published : Jun 21, 2021, 7:25 PM IST

ఆంక్షలు సడలిస్తున్నందున కొవిడ్ వ్యాప్తి చెందకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ (cm jagan) ఆదేశించారు. ఇకపై అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలంతా కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని.. ఎక్కడా నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. రాష్ట్రంలో జరిగిన వాక్సినేషన్​పై సంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. త్వరలో చేపట్టే మరో మెగా డ్రైవ్ (mega vaccination drive) కు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజలకు వైద్యం అందించడంలో కార్పొరేట్ ఆస్పత్రులతో పోటీ పడాలని దిశానిర్దేశం చేశారు. కొత్త వైద్య కళాశాలల పనులు యుద్ధ ప్రాతిపదికన జరగాలని తెలిపారు. పనుల జరుగుతున్న తీరును అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సత్వరమే పూర్తిచేయాలన్నారు

cm jagan review on nadu nedu works
cm jagan review on nadu nedu works

కొవిడ్ నివారణ సహా ఆస్పత్రుల్లో నాడు- నేడు అంశాలపై సీఎం జగన్ (cm jagan) సమీక్షించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షకు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని , సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతం సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. తొలుత కొవిడ్‌ నియంత్రణ, నివారణ చర్యలతో పాటు వాక్సినేషన్‌పై అధికారులతో సీఎం చర్చించారు. తూర్పు గోదావరి జిల్లాలో తప్ప.. అన్నిజిల్లాల్లో పాజిటివిటీ రేటు తగ్గిందని అధికారులు సీఎంకు నివేదించారు.

తగ్గిన కేసులు.. పెరిగిన రికవరీ రేటు..

రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు మరింత తగ్గుముఖం పట్టాయని అధికారులు సీఎంకు తెలిపారు. పాజిటివిటీ రేటు (covid positivity rate in ap) 5.65 శాతం ఉందన్నారు. రికవరీ రేటు 95.93 శాతానికి చేరిందన్నారు. రాష్ట్రంలో 2655 ఐసీయూ, 13,824 ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆరోగ్య శ్రీ కవరేజీ కింద ఆస్పత్రుల్లో 91.48 శాతం బెడ్లు ఉన్నాయని.. ఇక్కడ ఆరోగ్యశ్రీ (aarogyasri) కింద రోగులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. 104 కాల్ సెంటర్ కు వస్తోన్న కాల్స్ గణనీయంగా తగ్గాయని, ప్రస్తుతం రోజుకు 1506 కాల్స్ వస్తున్నాయని చెప్పారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 7,056 బెడ్లు భర్తీ అయ్యాయన్నారు. బ్లాక్‌ ఫంగస్‌ యాక్టివ్‌ కేసులు (black fungus active cases) 2772 ఉన్నాయని పేర్కొన్నారు. వీరిలో 922 మందికి సర్జరీలు చేసినట్లు వివరించారు. పొరుగు రాష్ట్రాల్లో కొవిడ్‌ నియంత్రణ కోసం విధించిన ఆంక్షలను సడలిస్తున్నందువల్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.

మెగా డ్రైవ్​కు సిద్ధంగా ఉండాలి

రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన వాక్సినేషన్‌ వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. రాష్ట్రంలో 1 కోటి 37 లక్షల 42 వేల 417 డోసుల వ్యాక్సినేషన్‌ వేసినట్లు అధికారులు తెలిపారు. 82 లక్షల 77 వేల 225 మందికి మొదటి డోసు, 27 లక్షల 32 వేల 596 మందికి రెండు డోసుల వాక్సిన్‌ వేసినట్లు తెలిపారు. మొత్తంగా ఇప్పటి వరకు 1 కోటి 10 లక్షల 09 వేల821 మంది వ్యాక్సిన్లు అందుకున్నారని తెలిపారు. ఐదేళ్లలోపు వయస్సున్న పిల్లల తల్లుల్లో 10 లక్షల29 వేల 266 మందికి వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లనున్న 11,158 మందికి మొదటి డోసు వేశామన్నారు. జూన్‌ 20న నిర్వహించిన మెగా డ్రైవ్‌లో 13 లక్షల 72 వేల 481 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వివరించారు. ఒకే రోజు రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌ చేసిన సిబ్బందికి సీఎం జగన్ (cm jagan) అభినందనలు తెలిపారు. గత రికార్డును అధిగమిస్తూ వ్యాక్సిన్లు ఇచ్చిన వారందరికీ అభినందనలు చెప్పారు. వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే ఇచ్చే సమర్థత ఉందని.. మన దగ్గర మంచి యంత్రాంగం ఉందని నిరూపించినట్లు తెలిపారు. అలాగే మండలానికి రెండు పీహెచ్‌సీలు, అందులోని డాక్టర్లు ఉండాలన్నారు. అధిక సంఖ్యలో వ్యాక్సిన్లు మనకు అందుబాటులో ఉంటే.. అంతేస్థాయిలో వ్యాక్సిన్లు ఇవ్వగలిగే సామర్థ్యం మనకు ఉన్నాయన్నారు. ఇంత కంటే మెరుగ్గా చేయగలమన్నారు. వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగానే మరో మెగా డ్రైవ్‌ నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

సమగ్ర నివేదిక ఇవ్వండి..

కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం (medical colleges), నాడు – నేడు (nadu nedu) పనులపైనా సీఎం సమీక్షించారు. ఆస్పత్రుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలపై సీఎం ఆదేశాల మేరకు ఇప్పటికే అధ్యయనం చేసిన అధికారులు, దీనికి సంబంధించిన వివరాలను సీఎంకు అందజేశారు. బిల్డింగ్, సర్వీసులు, నాన్‌ బిల్డింగ్‌ సర్వీసులపై అధ్యయన వివరాలు తెలిపారు. ఆస్పత్రి ఆవరణకూడా అత్యంత పరిశుభ్రంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆస్పత్రి నిర్వహణకు సంబంధించి పటిష్టమైన ఎస్‌ఓపీలను తయారుచేయాలన్నారు. మనం పోటీపడుతున్నది ప్రభుత్వ ఆస్పత్రులతోకాదని, కార్పొరేట్‌ ఆస్పత్రులతో పోటీపడాలన్నారు. ఎక్కడా కూడా ప్రమాణాల విషయంలో వెనక్కి తగ్గకూడదని నిర్దేశించారు. అనుకోని ప్రమాదాలు వచ్చే సమయంలో రోగులను సురక్షితంగా ఖాళీచేయించే ఎమర్జెన్సీ ప్లాన్స్‌ కూడా సమర్థవంతంగా ఉండాలన్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో అనుసరించే ప్రోటోకాల్స్‌పై అధ్యయనం చేయాలన్న సీఎం.. అన్ని అంశాలనూ స్టడీ చేశాక సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

ఇదీ చదవండి

MP Raghurama letter to CM : రఘురామ లేఖలో ఇంకా ఏముందంటే...

ABOUT THE AUTHOR

...view details