ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ACCIDENTS: హైదరాబాద్ రహదారులు రక్తసిక్తం.. రోజుకు 34 ప్రమాదాలు

By

Published : Jul 27, 2021, 9:47 AM IST

సైబరాబాద్‌, రాచకొండ, హైదరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలోని రహదారులన్నీ రక్తంతో తడుస్తున్నాయి. రోజుకు సగటున 34 ప్రమాదాలు జరుగుతున్నాయి. దాదాపు ఐదుగురు చనిపోతుంటే... 18 మంది గాయాలపాలవుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

ACCIDENTS
రోడ్డు ప్రమాదాలు

హైదరబాద్ పరిసర ప్రాంతాల్లో రహదారులన్నీ ప్రతి రోజూ రక్తసిక్తమవుతున్నాయి. నిత్యం ఎక్కడో చోట రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉంటుంది. సైబరాబాద్‌, రాచకొండ, హైదరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో రోజుకు సగటున 34 ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయిదుగురు మృత్యువాత పడుతుంటే, 18 మంది గాయాలపాలవుతున్నట్లు పోలీసులు లెక్క తేల్చారు. అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌, మద్యం మత్తులో వాహనం నడుపుతుండటమే కారణమని చెబుతున్నారు.

సైబరాబాద్‌లో ఆందోళనకరం..

ప్రమాదాల నివారణపై పోలీసులు ఎంత దృష్టి పెడుతున్నా, తగ్గకపోగా.. ఏటా పెరుగుతున్నాయి. రాచకొండ, హైదరాబాద్‌తో పోలిస్తే సైబరాబాద్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సైబరాబాద్‌ పరిధిలో 2019లో 3313 ఘటనల్లో 861 మంది మృతి చెందారు. గతేడాది లాక్‌డౌన్‌తో ప్రమాదాల సంఖ్య 3013కు తగ్గింది. మరణాల సంఖ్య సైతం 663కు తగ్గినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది విషయానికొస్తే ఆరు నెలల్లోనే 2199 ప్రమాదాలు జరిగాయి. 325 మంది మృతి చెందారు. ఈ లెక్కన చూస్తే ఏడాది చివరకు 4 వేల మార్కును దాటొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్‌లో..

హైదరాబాద్‌లో 2019లో 2496 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా, 271 మంది దుర్మరణం చెందారు. గతేడాది 527 ఘటనల్లో 68 మరణించారు. ఈ ఆరు నెలల్లో 2017 ప్రమాదాల్లో 173 మంది మృతి చెందారు. ఏడాది నాటికి 3,500కు పైగా నమోదయ్యే అవకాశముందంటున్నారు.

రాచకొండలో..

రాచకొండలో 2019లో 2990 రోడ్డు ప్రమాదాలు జరగగా, 739 మంది మరణించారు. గతేడాది 2047 ఘటనల్లో 533 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఆరు నెలల్లో 1908 ప్రమాదాల్లో 328 మంది మరణించారు. ఈ ఏడాది చివరకు 3500 దాటొచ్చని చెబుతున్నారు.

ఎందుకిలా...

అతివేగంతో దూసుకెళ్తూ ఇతరుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నట్లు పోలీసుల అధ్యయనంలో తేలింది. ఒక్కసారిగా వేగాన్ని అదుపు చేయలేక ప్రమాదాల బారిన పడుతున్నట్లు గుర్తించారు. సుమారు 25 శాతం నుంచి 30 శాతం ప్రమాదాలు ఈ తరహాలోనే జరుగుతున్నట్లు చెబుతున్నారు. మరో 25 శాతం నుంచి 28 శాతం.. డ్రంకెన్‌ డ్రైవింగ్‌ కారణంగా, 15 శాతం నుంచి 18 శాతం నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ వల్ల చోటుచేసుకుంటున్నాయి. మరో 5 శాతం నుంచి 8 శాతం వరకు నిద్రమత్తు, అలసటతో జరుగుతున్నాయి.

ఇదీ చదవండి:

ప్రభుత్వ ఆసుపత్రిలో భూత వైద్యం.. డాక్టర్లు ఏం చేస్తున్నారు?

Viveka murder case: 'వివేకా ఇంట్లో పనివారంతా గంగిరెడ్డికి తెలుసు'

ABOUT THE AUTHOR

...view details