ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఉక్రెయిన్​లోని నా పెంపుడు పులులను రక్షించండి.. ఆంధ్రా వైద్యుడి విన్నపం

By

Published : Oct 5, 2022, 3:24 PM IST

Andhra Doctor Request Indian Government: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ఉక్రెయిన్​ పౌరులపై చాలా ప్రభావాన్ని చూపించింది. పుతిన్​ సేన దాడులతో భయానికి గురైన ప్రజలు.. ఇళ్లు వదిలిపెట్టి పోయిన సంగతి తెలిసిందే. అయితే ఉక్రెయిన్‌ను వీడిన ఓ ఆంధ్రా డాక్టర్‌.. తన పెంపుడు పులులను రక్షించాలని భారత్‌తో పాటు వివిధ దేశాలను వేడుకుంటున్నారు.

Andhra doctor request
Andhra doctor request

Jaguar Kumar: ఉక్రెయిన్‌పై రష్యా మొదలుపెట్టిన యుద్ధం కారణంగా లక్షల మంది పౌరులు యుద్ధ క్షేత్రాన్ని వీడిపోయిన సంగతి తెలిసిందే. పుతిన్‌ సేనల భీకర దాడులతో వణికిపోయిన ఉక్రెయిన్‌ ప్రజలు.. ఇళ్లు, పెంపుడు జంతువులను వదిలి కట్టుబట్టలతో అక్కడినుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇలా యుద్ధం కారణంగా అక్కడనుంచి పొరుగు దేశానికి వెళ్లిపోయిన ఓ ఆంధ్రా డాక్టర్‌.. తన పెంపుడు పులులను రక్షించాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డాక్టర్‌ గిరి కుమార్‌ పాటిల్.. ఉక్రెయిన్‌లోని సెవెరోదొనెట్స్క్‌లో ఉన్న ఓ ఆస్పత్రిలో పని చేసేవారు. ఉక్రెయిన్‌లో స్థిరపడ్డ ఆయనకు పెంపుడు జంతువులంటే ఇష్టం. దీంతో కీవ్‌లోని జంతు ప్రదర్శనశాల నుంచి రెండు అరుదైన చిరుతలను సంపాదించారు. ‘యశా’ అనే జాగ్వర్‌ (హైబ్రిడ్‌ చిరుతపులి)తో పాటు ‘సబ్రినా’ అనే ఫాంథర్‌ (నల్లటి చిరుత)లను గత రెండేళ్లుగా పెంచుకుంటున్నారు. అంతరించిపోతున్న పులులు జాతులను కాపాడే ప్రయత్నమని చెప్పే ఆ వైద్యుడిని జాగ్వర్‌ కుమార్‌గా పిలిచేవారు.

రష్యా దాడుల్లో పాటిల్‌ పని చేస్తున్న ఆస్పత్రి నాశనం కావడంతోపాటు.. ఆ ప్రాంతాన్ని పుతిన్‌ సేనలు ఆక్రమించుకున్నాయి. పాటిల్‌కు ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. పెంపుడు పులుల పోషణ కష్టతరమైంది. దీంతో వాటిని లుహాన్స్క్‌లోని స్థానిక రైతు వద్ద వదిలిపెట్టి పోలాండ్‌కు వెళ్లిపోయాడు. ప్రస్తుతం పోలాండ్‌ రాజధాని వార్సాలో ఆశ్రయం పొందుతున్న ఆయన.. ఆ రైతుకు ఫోన్‌ చేస్తూ నిత్యం వాటి బాగోగులను తెలుసుకునే వాడు. ఇటీవల అక్కడ ఇంటర్నెట్‌ సేవలు మూతపడడంతో వాటిని చూసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో తీవ్ర నిరాశలో ఉన్న ఆయన.. తన పులులను ఎలాగైనా రక్షించుకోవాలంటూ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా పీటీఐ వార్తా సంస్థ వద్ద పాటిల్‌ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

‘పెంపుడు పులులకు దూరంగా ఉండడం నన్ను ఎంతగానో వేధిస్తోంది. ఆ మధురమైన జ్ఞాపకాలు ఓవైపు, వాటి మంచి చెడుల గురించిన భయాలు నన్ను వెంటాడుతున్నాయి. దీంతో ఒక్కోసారి కుంగుబాటుకు గురవుతున్నా’ -గిరి కుమార్‌ పాటిల్‌

వాటిని తరలించడానికి ఎటువంటి సమస్యలు ఉన్నాయో తనకు స్పష్టంగా తెలియదని.. అయినప్పటికీ తన పెంపుడు జంతువుల భద్రత దృష్ట్యా ఉక్రెయిన్‌ పొరుగు దేశాలు, యూరప్‌ లేదా భారత్‌ వంటి దేశాలు వాటిని రక్షించేందుకు ముందుకు వస్తే పరిష్కారం చూపేందుకు సిద్ధంగా ఉన్నానని గిరి కుమార్‌ పాటిల్‌ చెప్పారు. వీటిని రక్షించేందుకు కీవ్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని కోరినప్పటికీ వారి నుంచి ఎటువంటి సహాయమూ అందలేదని.. దీంతో భారత ప్రభుత్వం తన రెండు చిరుత పులులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. భారత్‌తోపాటు వివిధ దేశాల ప్రభుత్వాలను సంప్రదిస్తున్నట్లు సమాచారం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details