పాఠ్యపుస్తకాల ముద్రణ టెండర్లలలో వైసీపీ సర్కార్ కొత్త నిబంధన - ప్రింటర్ల ఉపాధికి గండి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 5, 2024, 10:36 AM IST
YCP Govt New Rule on Textbook Printing Tenders: పాఠ్యపుస్తకాల ముద్రణ టెండర్లలలో ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేయడంపై రాష్ట్ర ముద్రణదారుల సంఘం ప్రతినిధులు అభ్యంతరం తెలిపారు. విజయవాడలో సమావేశమైన రాష్ట్ర ముద్రణదారుల సంఘం ప్రతినిధులు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ నిరసన ప్రకటించారు. పాతికేళ్లుగా ప్రింటింగ్, పేపరు కోసం వేర్వేరుగా టెండర్లు పిలుస్తుండగా ప్రభుత్వం తాజాగా రెండింటిని ఒకరే చేపట్టాలని నిబంధన తీసుకువచ్చిందని దీనివల్ల రాష్ట్రంలోని 60 ప్రింటింగ్ ప్రెస్సులు మూతపడే ప్రమాదం ఏర్పడిందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సూర్యనారాయణ, బసవయ్య ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని 60 ప్రింటింగ్ ప్రెస్సులు మూతపడితే సుమారుగా 2 లక్షల మంది ఉపాధి దెబ్బతినే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా తీసుకువచ్చిన నిబంధన వల్ల రాష్ట్రానికి చెందిన వారెవరూ అర్హత సాధించకపోగా వేరే రాష్ట్రానికి చెందినవారికి టెండర్ అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నారని వారు అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించుకుని పాత విధానంలోనే టెండర్లు పిలవాలని కోరారు.