ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఐదేళ్లల్లో ఏం అభివృద్ధి చేశారని మళ్లీ వస్తున్నారు? - వైఎస్సార్సీపీ నేతలకు చేదు అనుభవం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 6, 2024, 1:27 PM IST

Villagers Questioned YSRCP Leaders in Paderu: వైఎస్సార్సీపీ నాయకులకు సొంత పార్టీ వార్డు సభ్యులు, స్థానికుల నుంచి చుక్కెదురైంది. అభివృద్ధి చేస్తారని ఓటేస్తే ఐదేళ్లలో మా గ్రామానికి ఏం చేశారు? మళ్లీ ఎందుకు వస్తున్నారు? అంటూ అల్లూరి జిల్లా జి. కే వీధి మండలంలో వైసీపీ నాయకులను సొంత పార్టీ వార్డు సభ్యులు, స్థానికులు ప్రశ్నించారు.

వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన విశ్వేశ్వరరాజుతో పాటు ఎంపీపీ బోయిన కుమారి, ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు సోమవారం పెదవలస, లకవరపు పేట పంచాయతీల్లో పర్యటించారు. లకవరపు పేట పంచాయతీ కె. కొడిసింగ్ గ్రామంలోకి వైసీపీ నేతలు ప్రవేశించగానే వైసీపీకి చెందిన వార్డు సభ్యులు, సొంత పార్టీ నేతలు సత్యనారాయణతో పాటు స్థానికులు అడ్డుకున్నారు. గ్రామంలో 120 ఇళ్లు ఉన్నాయని, కనీసం మంచినీరు దొరక్క ఊట బావి నీటినే తాగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సిమెంటు రోడ్లు లేవని, కరెంటు స్తంభాలు పడి పోయే స్థితిలో ఉన్నాయని, వ్యవసాయ భూములకు నీరందించే చెక్ డ్యామ్ కూడా లేదని ఇటువంటి ఎన్నో సమస్యలతో ఇబ్బందులు గురవుతున్నామని గ్రామస్తులు వాపోయారు. ఈ సమస్యలను పరిష్కరించకుండా మళ్లీ ఎందుకు వస్తున్నారంటూ వైసీపీ నేతలను స్థానికులు నిలదీశారు. గ్రామస్థులు ఎంత సేపటికీ శాంతించకపోవడంతో ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు వెనుదిరిగారు.

ABOUT THE AUTHOR

...view details