ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఉద్యోగం పేరుతో ఇంటి పనులు - సచివాలయ పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 14, 2024, 2:59 PM IST

State Secretariat Sanitation Workers Agitation For Job Security: ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ రాష్ట్ర సచివాలయ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. గత ఎన్నికల సమయంలో శానిటేషన్ వర్కర్స్​ను (Sanitation Workers) ఆప్కాస్‌లోకి తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని కార్మికులు తెలిపారు. ఆ హామీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ (CM Jagan)​ ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని కార్మికులు సచివాలయ రహదారి వద్ద బైఠాయించారు. గత ఐదు సంవత్సరాలుగా సచివాలయంలోని వివిధ శాఖలలో పారిశుద్ధ్య కార్మికులుగా పని చేస్తున్న తమను ఆప్కాస్​లోకి తీసుకుంటామని చెప్పి సీఆర్​డీఏ అధికారులు తమ ఇళ్లల్లో పనులు చేయించుకున్నారని కార్మికులు వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యను పరిష్కరించి ఆప్కాస్‌లోకి తీసుకోవాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు.

సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని పారిశుద్ధ్య కార్మికులు ఈ ఏడాది జనవరిలో  నిరవధిక సమ్మె చేపట్టారు. కార్మిక సంఘాలతో చర్చల్లో ఇకపై ఆరోగ్య భత్యంతో కలిపి వేతనాలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 36 ప్రకారం కార్మికులకు ఆరోగ్య భత్యంతో కలిపి వేతనాన్ని పట్టణ స్థానిక సంస్థలే చెల్లించాలని జీవోలో పేర్కొనడంపై అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details